‘అలాంటి కూతుర్ని జైల్లో పెట్టినా తప్పులేదు’

సీఏఏకు వ్యతిరేకంగా కర్ణాటక రాజధాని బెంగళూరులో నిర్వహించిన సభలో ఓ యువతి పాక్‌కు అనుకూలంగా నినాదాలు చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. కాగా.. యువతి ప్రవర్తించిన తీరుపై ఆమె తండ్రి తీవ్ర

Updated : 21 Feb 2020 16:10 IST

ఓవైసీ సభలో హల్‌చల్‌ చేసిన యువతి తండ్రి వ్యాఖ్య

బెంగళూరు: సీఏఏకు వ్యతిరేకంగా కర్ణాటక రాజధాని బెంగళూరులో నిర్వహించిన సభలో ఓ యువతి పాక్‌కు అనుకూలంగా నినాదాలు చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. కాగా.. యువతి ప్రవర్తించిన తీరుపై ఆమె తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి కూతుర్ని జైల్లో పెట్టినా తప్పులేదని, ఆమె కోసం తాను ఎలాంటి న్యాయపోరాటం చేయబోనని యువతి తండ్రి స్పష్టంగా చెప్పారు. 

అమూల్య వ్యాఖ్యలు టీవీలో, సోషల్‌మీడియాలో వైరల్‌ కాగానే కొందరు స్థానిక మీడియా విలేకరులు ఆమె తండ్రిని సంప్రదించగా ఆయన తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘నా కూతురి ప్రవర్తన చూసి దిగ్భ్రాంతికి గురయ్యా. ఇలా మాట్లాడొద్దని చాలా సార్లు చెప్పినా అమూల్య ప్రవర్తనలో ఎలాంటి మార్పు రావట్లేదు. ఆమెను జైల్లో పెట్టినా.. పోలీసులు ఆమె కాళ్లు విరగ్గొట్టినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. తన వల్ల నా కుటుంబం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆమె కోసం నేను న్యాయపోరాటం కూడా చేయను’ అని యువతి తండ్రి చెప్పుకొచ్చారు. 

అమూల్యకు 14 రోజుల కస్టడీ

కాగా.. పాక్‌కు అనుకూల నినాదాలు చేసినందుకు గానూ అమూల్యపై దేశద్రోహం కేసు నమోదైంది. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు అనంతరం నేడు కోర్టు ఎదుట హాజరుపర్చారు. ఈ కేసులో ఆమెకు న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. 

పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌పీఆర్‌, ఎన్నార్సీకి వ్యతిరేకంగా బెంగళూరులో నిన్న సభ నిర్వహించారు. మజ్లీస్‌ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ఈ సభకు హాజరై ప్రసంగించారు. అయితే ఓవైసీ ప్రసంగం తర్వాత 19ఏళ్ల అమూల్య లియోన్‌ ఒక్కసారిగా వేదికపైకి ఎక్కి పాక్‌కు అనుకూలంగా నినాదాలు చేసింది. దీంతో షాక్‌కు గురైన ఓవైసీ వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి మైక్‌ను లాక్కొనే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆ యువతి వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు వచ్చి ఆమెను తీసుకెళ్లిపోయారు. కాగా.. అమూల్య నినాదాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఓవైసీ స్పష్టం చేశారు.

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని