విజయ్‌చౌక్‌లో అలరించిన బీటింగ్‌ రిట్రీట్‌

భారత గణతంత్ర దిన ముగింపు వేడుకలు దిల్లీలోని విజయ్‌చౌక్‌ వద్ద ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగాయి. స్వల్పంగా వర్షం కురుస్తున్నా కార్యక్రమ స్ఫూర్తి ఎక్కడా తగ్గకుండా సైనిక, పారామిలిటరీ దళాలు నిర్వహించిన బీటింగ్‌ రిట్రీట్‌ అలరించింది.

Updated : 30 Jan 2023 05:58 IST

హాజరైన రాష్ట్రపతి, ప్రధాని 
వర్షంతో 3,500 డ్రోన్ల మెగా షో రద్దు

దిల్లీ: భారత గణతంత్ర దిన ముగింపు వేడుకలు దిల్లీలోని విజయ్‌చౌక్‌ వద్ద ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగాయి. స్వల్పంగా వర్షం కురుస్తున్నా కార్యక్రమ స్ఫూర్తి ఎక్కడా తగ్గకుండా సైనిక, పారామిలిటరీ దళాలు నిర్వహించిన బీటింగ్‌ రిట్రీట్‌ అలరించింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాక సందర్భంగా సాయుధ దళాల వాయిద్య బృందాలు లయబద్ధంగా సాగిన పద ఘట్టనల సంప్రదాయ సంగీతంతో ఆకట్టుకున్నాయి. రాష్ట్రపతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్వాగతం పలికారు. ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సైనికుల విన్యాసాలు, 3డీ ప్రదర్శన భళా అనిపించాయి. ‘‘కదమ్‌ కదమ్‌ బఢాయే జా’’, ‘‘అయ్‌ మేరే వతన్‌ కే లోగో’’ వంటి దేశభక్తి గీతాలతో ఆహుతులను  మంత్రముగ్ధులను చేసిన వాయిద్య బృందాలు ‘‘సారే జహాసే అచ్ఛా’’తో ముగించాయి. 3,500 స్వదేశీ డ్రోన్లతో ఏర్పాటుచేసిన ప్రత్యేక ప్రదర్శనను వాతావరణం అనుకూలించని కారణంగా రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. కార్యక్రమం ముగిశాక ప్రధాని మోదీ వర్షంలో తడుస్తూ చుట్టూ కలయదిరిగి ప్రేక్షకులకు అభివాదం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని