‘సామాజిక’ ప్రచారం

ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికల ప్రక్రియకు దేశం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఓటర్లను ఆకర్షించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలను ప్రారంభించాయి. ఇందులో భాగంగా వాట్సప్‌, సామాజిక మాధ్యమాలు, ఇన్‌ఫ్లుయెన్సర్లకు గిరాకీ పెరిగింది.

Published : 19 Mar 2024 04:15 IST

వాట్సప్‌, సోషల్‌ మీడియాదే కీలక పాత్ర
ఇన్‌ఫ్లుయెన్సర్లకూ గిరాకీ

దిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికల ప్రక్రియకు దేశం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఓటర్లను ఆకర్షించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలను ప్రారంభించాయి. ఇందులో భాగంగా వాట్సప్‌, సామాజిక మాధ్యమాలు, ఇన్‌ఫ్లుయెన్సర్లకు గిరాకీ పెరిగింది. గతంలో ఓట్ల కోసం కరపత్రాల పంపిణీ, సభల నిర్వహణ, గడప గడపకూ వెళ్లి ఓటర్లను కలిసేలా సాగేది ప్రచారం. ఇప్పుడు పంథా మారిపోయింది. ఐటీ అభివృద్ధి చెందడంతో సోషల్‌ మీడియా ప్రధాన ప్రచార మాధ్యమంగా మారిపోయింది. గత ఎన్నికలతో పోలిస్తే 2024 ఎన్నికల ప్రచారంలో సోషల్‌ మీడియా లేకుండా గెలవలేమని చాలా పార్టీలు భావిస్తున్నాయి.


పాడ్‌కాస్ట్‌లకు డిమాండ్‌

ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో యువ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఉదయం లేచింది మొదలు నిరంతరం తమ స్మార్ట్‌ ఫోన్లలో వీరు ఏదో ఒక కంటెంట్‌ చూస్తున్నారు. ఇదే అంశం పార్టీలకు సానుకూలంగా మారింది. వీటితోపాటు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు పార్టీలోని ముఖ్య నాయకులు ఇంటర్వ్యూలు ఇస్తూ.. యూట్యూబ్‌ ద్వారా పార్టీ ప్రధాన ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. గత కొద్ది నెలలుగా కేంద్ర మంత్రులు జైశంకర్‌, స్మృతి ఇరానీ, పీయూష్‌ గోయల్‌, రాజీవ్‌ చంద్రశేఖర్‌ ప్రముఖ పాడ్‌కాస్ట్‌, యూట్యూబ్‌ ఛానల్‌కు వరుస ఇంటర్వ్యూలు ఇచ్చారు. దానికి సుమారు 70లక్షల మంది  ఫాలోవర్స్‌ ఉన్నారు. అదే సమయంలో రాహుల్‌ గాంధీ మరో పాడ్‌కాస్ట్‌ ఛానల్‌ ముఖాముఖిలో పాల్గొన్నారు.


వాట్సప్‌, ఫేస్‌బుక్‌లదే హవా

ఓటర్ల అభిప్రాయం తెలుసుకునేందుకు ‘లెటర్‌ ఫ్రమ్‌ ద ప్రైమ్‌ మినిస్టర్‌’ పేరుతో భాజపా వాట్సప్‌లో ఓ లేఖను ప్రచారం చేస్తోంది. దేశంలో వాట్సప్‌నకు 50 కోట్ల మంది యూజర్లున్నారు. దాంతోపాటు ‘మై ఫస్ట్‌ ఓట్‌ ఫర్‌ మోదీ’ పేరుతో వెబ్‌ పేజీను ప్రారంభించి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ రాహుల్‌ గాంధీ పేరుతో వాట్సప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేసింది. అందులో ఆయన నేరుగా ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతారని ప్రచారం చేస్తోంది. ఎక్కువ వాట్సప్‌ గ్రూపులుంటే సులువుగా ప్రజలను చేరుకోవచ్చని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. ఆన్‌లైన్‌ ప్రచారానికి ప్రధాన మాధ్యమంగా ఫేస్‌బుక్‌నే ఎక్కువ మంది ఎంచుకుంటున్నారని ఎన్నికల విశ్లేషకుడు అమితాబ్‌ తివారీ తెలిపారు. తాజా గణాంకాల ప్రకారం ఫేస్‌బుక్‌కు 36.6 కోట్ల మంది యాక్టివ్‌ యూజర్లున్నారు. ఇవికాకుండా.. ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్‌, యూట్యూబ్‌ ద్వారా ప్రచారం చేస్తున్నారు. కొవిడ్‌-19 పరిస్థితుల తర్వాత సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల సంఖ్య పెరిగింది. ఓటర్లను నేరుగా కలవకుండా.. ఏఐ సాంకేతికతో వారితో నేరుగా సంభాషించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయంటున్నారు. మరోవైపు ఎన్నికల సంఘం సోషల్‌ మీడియా ప్రచారంపై ప్రత్యేక దృష్టి సారించింది. నకిలీ సమాచారం వ్యాప్తి చెందకుండా జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించి వాటిపై నిఘా పెట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని