Hacking: మరో ఆసుపత్రిపై హ్యాకర్ల పంజా.. 1.5లక్షల మంది రోగుల డేటా విక్రయం..!

తమిళనాడులోని శ్రీ శరణ్‌ మెడికల్‌ సెంటర్‌ ఆసుపత్రికి చెందిన రోగుల డేటాను హ్యాకర్లు సైబర్‌ క్రైమ్‌ ఫోరమ్‌లలో విక్రయించినట్లు క్లౌడ్‌సెక్‌ వెల్లడించింది.

Published : 04 Dec 2022 01:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశ రాజధాని దిల్లీలో ఎయిమ్స్‌ సర్వర్ల హ్యాకింగ్ వ్యవహారం తేలకముందే.. మరో ఆసుపత్రి సైబర్‌ దాడికి గురైంది. తమిళనాడులోని ఓ ఆసుపత్రి డేటాబేస్‌ను హ్యాక్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు దాదాపు లక్షన్నర మంది రోగుల డేటాను ఆన్‌లైన్‌లో విక్రయించినట్లు తెలుస్తోంది. సైబర్‌ ముప్పులను అంచనా వేసే క్లౌడ్‌సెక్‌ అనే సంస్థ ఈ ఉదంతాన్ని బయటపెట్టింది.

తమిళనాడులోని శ్రీ శరణ్‌ మెడికల్‌ సెంటర్‌ ఆసుపత్రికి చెందిన రోగుల డేటాను హ్యాకర్లు సైబర్‌ క్రైమ్‌ ఫోరమ్‌లలో విక్రయించినట్లు క్లౌడ్‌సెక్‌ వెల్లడించింది. 2007-2011 మధ్య ఈ ఆసుపత్రికి వెళ్లిన రోగుల పేర్లు, పుట్టిన తేదీ, చిరునామా, గార్డియన్‌ పేరు, వైద్యుల వివరాలను సైబర్‌ నేరగాళ్లు విక్రయించినట్లు తెలిపింది. ఈ డేటాను 100 డాలర్ల నుంచి 400 డాలర్ల చొప్పున అమ్మినట్లు సమాచారం. ‘థ్రీ క్యూ ఐటీ ల్యాబ్‌’ అనే థర్డ్‌ పార్టీ వెండర్‌ నుంచి ఈ డేటాను చోరీ చేసినట్లు క్లౌడ్‌సెక్‌ తెలిపింది.

‘‘తొలుత థ్రీ క్యూబ్‌ ఐటీ ల్యాబ్‌ను హ్యాకర్లు టార్గెట్‌ చేశారు. ఆ వెండర్‌ సిస్టమ్స్‌ను తమ అధీనంలోకి తీసుకుని.. అక్కడి నుంచి ఆసుపత్రి డేటాను దొంగలించి ఉంటారు’’ అని క్లౌడ్‌సెక్‌ కంపెనీకి చెందిన అనలిస్ట్‌ ఒకరు తెలిపారు. ఎయిమ్స్‌ సర్వర్లపై సైబర్‌ దాడి జరిగిన మరుసటి రోజే తమిళనాడు ఆసుపత్రి డేటా లీక్‌ను గుర్తించినట్లు తెలుస్తోంది.

ఎయిమ్స్‌లో సర్వర్లు మొరాయించినట్లు గత నెల 23న తొలిసారి గుర్తించారు. ఆ తర్వాత హ్యాకింగ్‌ విషయం వెలుగులోకి వచ్చింది. ఎయిమ్స్‌ నుంచి హ్యాకర్లు రూ.200 కోట్లు క్రిప్టోకరెన్సీ రూపంలో చెల్లించాలని డిమాండ్‌ చేసినట్లు వార్తలు వచ్చాయి. హ్యాక్‌ చేసిన ఐదు సర్వర్లలో దాదాపు 4 కోట్ల మంది రోగుల సమాచారం నిక్షిప్తమై ఉంది. ప్రస్తుతం ఎయిమ్స్‌లో సర్వర్లు, కంప్యూటర్లకు యాంటీ వైరస్‌ సొల్యూషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని