భార్యకివ్వాల్సిన డబ్బును రూపాయి నాణేల్లో.. భర్తకు కోర్టు సూపర్‌ ట్విస్ట్‌

భార్యకివ్వాల్సిన నిర్వహణ ఖర్చులను రూపాయి నాణేల్లో ఏడు సంచుల్లో తెచ్చాడో భర్త. వాటిని ఇచ్చేందుకు అంగీకరించిన కోర్టు.. చివర్లో ఇచ్చిన ట్విస్ట్‌ అదిరిపోయింది. అదేంటో మీరే చదివేయండి..!

Published : 20 Jun 2023 18:03 IST

జైపుర్‌: విడాకుల (Divorce) వ్యవహారంలో భార్యకు నిర్వహణ ఖర్చుల కింద ఇవ్వాల్సిన రూ.55వేలను అచ్చంగా రూపాయి నాణేల్లో తీసుకొచ్చి షాకిచ్చాడో భర్త. అయితే నాణేల రూపం (rupee coins)లో భరణం ఇచ్చేందుకు అంగీకరించిన కోర్టు.. ఆ భర్తకు ఊహించని ట్విస్ట్‌ ఇచ్చింది. దీంతో చేసిన ఘనకార్యానికి అతడు తలబాదుకోవాల్సి వచ్చింది. ఈ విచిత్ర ఘటన రాజస్థాన్‌ (Rajasthan)లోని జైపుర్‌లో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..?

జైపుర్‌ (Jaipur)లోని హర్మదా ప్రాంతానికి చెందిన దశరథ్‌ కుమావత్‌కు కొన్నేళ్ల కిందట సీమా అనే మహిళతో వివాహమైంది. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టు (Family Court)ను ఆశ్రయించారు. ఈ కేసు కుటుంబ న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉంది. అయితే భర్త నుంచి విడిగా ఉంటున్న సీమా కుమావత్‌కు ప్రతినెలా రూ.5వేలు నిర్వహణ ఖర్చుల కింద ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టు దశరథ్‌ను ఆదేశించింది. కానీ, గత 11 నెలలుగా అతడు ఆ డబ్బులను ఇవ్వట్లేదు.

దీంతో సీమా మళ్లీ కుటుంబ కోర్టును ఆశ్రయించగా.. అతడిపై న్యాయస్థానం రికవరీ వారెంట్‌ జారీ చేసింది. అయితే, ఆ డబ్బులు చెల్లించేందుకు దశరథ్‌ నిరాకరించడంతో పోలీసులు జూన్‌ 17న అతడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఫ్యామిలీ కోర్టుకు సెలవులు ఉండటంతో మంగళవారం అదనపు జిల్లా న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. దశరథ్ అరెస్టు కావడంతో అతడి కుటుంబసభ్యులు సీమాకు చెల్లించాల్సిన డబ్బులను కోర్టుకు తీసుకొచ్చారు. అవన్నీ రూపాయి నాణేల్లో ఉండటం గమనార్హం. రూ.1, రూ.2 నాణేల రూపం (rupee coins)లో మొత్తం రూ.55వేలను ఏడు సంచుల్లో తీసుకొచ్చారు.

అయితే, ఈ డబ్బులను తీసుకొచ్చేందుకు సీమా నిరాకరించారు. తనను మానసికంగా వేధించాలని ఉద్దేశపూర్వకంగానే ఇలా నాణేలను తీసుకొచ్చారని ఆమె వాదించారు. అయితే, నాణేల రూపంలో దశరథ్ డబ్బులు చెల్లించేందుకు న్యాయస్థానం అంగీకరించింది. కానీ, అందుకు ఓ షరతు విధించింది. అవన్నీ అతడే లెక్కించి ఇవ్వాలని ట్విస్ట్‌ ఇచ్చింది. ‘‘ఈ కేసులో విచారణను జూన్‌ 26వ తేదీకి వాయిదా వేస్తున్నాం. అప్పటిదాకా ఈ డబ్బు కోర్టు కస్టడీలోనే ఉంటుంది. విచారణ తేదీ రోజున ఆ డబ్బును దశరథ్‌ లెక్కించి రూ.1000 చొప్పున ఒక్కో ప్యాకెట్‌గా విభజించాలి. ఆ ప్యాకెట్లను కోర్టులోనే భార్యకు అందజేయాలి’’ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దీంతో తలబాదుకోవడం దశరథ్‌ వంతైంది..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని