Mukesh Ambani: ముకేశ్ అంబానీకి మరోసారి బెదిరింపులు.. రూ.20 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌

ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీకి మరోసారి బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు.

Updated : 28 Oct 2023 10:28 IST

ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీన్‌ (Reliance Industries) అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani)కి మరోసారి బెదిరింపులు రావడం కలకలం రేపింది. అంబానీ కంపెనీకి చెందిన ఓ ఈ-మొయిల్‌ ఐడీకి శుక్రవారం (అక్టోబరు 27) గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపు మెయిల్‌ (Threat Email) వచ్చింది. ‘‘మా దగ్గర మంచి షూటర్లున్నారు. రూ.20కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాం’’ అని ఆ మెయిల్‌లో ఆగంతకులు బెదిరింపులకు పాల్పడ్డారు.

దీంతో, ముకేశ్ అంబానీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన ముంబయి గామ్‌దేవీ పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. షాదాబ్ ఖాన్‌ అనే వ్యక్తి నుంచి ఆ బెదిరింపు మెయిల్‌ వచ్చినట్లు గుర్తించారు. అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

గతేడాది కూడా అంబానీ కుటుంబానికి ఇలాంటి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. 2022 ఆగస్టు 15వ తేదీన ఓ వ్యక్తి రిలయన్స్‌ ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న హర్‌కిసాన్‌దాస్‌ ఆస్పత్రికి బెదిరింపు ఫోన్‌ వచ్చింది. ఆసుపత్రిని పేల్చేస్తామని, అంబానీ కుటుంబాన్ని చంపేస్తామని నిందితుడు బెదిరించాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.

2021లో అంబానీ నివాసం ఆంటిలియా సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన ఓ స్కార్పియో కారును నిలిపి ఉంచడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన వారం రోజులకే స్కార్పియో యజమాని మన్‌సుఖ్‌ హీరేన్‌ అనుమానాస్పద రీతిలో చనిపోయారు. ఈ కేసులను తొలుత ఇన్‌స్పెక్టర్‌ సచిన్‌ వాజే దర్యాప్తు చేపట్టగా.. తర్వాత ఆయనే ప్రధాన సూత్రధారిగా తేలడం గమనార్హం. దీంతో ఎన్‌ఐఏ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. ఈ ఘటన తర్వాత నుంచి ముకేశ్‌ అంబానీ, ఆయన కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వమే భద్రత కల్పిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని