Shraddha Kapoor: బాలీవుడ్‌ చుట్టూ ‘బెట్టింగ్‌ యాప్‌’ ఉచ్చు.. నటి శ్రద్ధా కపూర్‌కు ఈడీ సమన్లు

మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కేసులో బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్ ఈడీ ముందు హాజరుకావాలని సమన్లు జారీ అయ్యాయి. ఇప్పటికే రణ్‌బీర్‌ కపూర్‌ సహా పలువురు నటీనటులకు ఈ సమన్లు అందిన విషయం తెలిసిందే.

Published : 06 Oct 2023 10:03 IST

దిల్లీ: మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ (Mahadev Gaming App) కేసు వ్యవహారం బాలీవుడ్‌ (Bollywood)లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఈ కేసులో మరో నటికి ఈడీ నుంచి సమన్లు అందాయి. శుక్రవారం విచారణకు రావాలని ప్రముఖ నటి శ్రద్ధా కపూర్‌ (Shraddha Kapoor)ను ఈడీ (ED) కోరినట్లు తెలుస్తోంది. అయితే, ఆమె నేడు విచారణకు హాజరవుతారా? లేదా? అన్నదానిపై స్పష్టత లేదు.

ఇప్పటికే ఈ కేసులో ప్రముఖ నటుడు రణ్‌బీర్‌ కపూర్ (Ranbir Kapoor), హాస్యనటుడు కపిల్‌ శర్మ, నటీమణులు హ్యూమా ఖురేషి, హీనా ఖాన్‌కు ఈడీ నుంచి సమన్లు జారీ అయ్యాయి. కాగా.. రణ్‌బీర్‌ కపూర్‌ కూడా శుక్రవారం రాయ్‌పుర్‌లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో హాజరు కావాల్సి ఉండగా, ఆయన రెండు వారాల సమయం కోరినట్లు తెలుస్తోంది. ఇక, కపిల్‌ శర్మ, హ్యూమా ఖురేషి, హీనా ఖాన్‌ను వేర్వేరు తేదీల్లో ప్రశ్నించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఏంటీ మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కేసు.. బాలీవుడ్‌లో కలకలం ఎందుకు?

మహాదేవ్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ ప్రమోటర్లు సౌరభ్‌ చంద్రకర్‌, రవి ఉప్పల్‌ భారత్‌లో 4వేల మంది ఆపరేటర్లను నియమించుకున్నారు. ఒక్కో ఆపరేటర్‌కు సుమారు 200 మంది కస్టమర్లున్నారు. ఆ లెక్కన రోజుకు రూ.200 కోట్లు చేతులు మారుతోంది. 70-30 నిష్పత్తి ప్రకారం లాభాల్లో వాటా ఇస్తామని వివిధ దేశాల్లో బీటర్లను నియమించుకున్నారు. ఈ యాప్‌ కార్యకలాపాలు యూఏఈ ప్రధాన కేంద్రంగా సాగుతున్నట్లు ఈడీ విచారణలో తేలింది. సౌరభ్‌, రవి ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

అయితే, నటులు ఆన్‌లైన్‌లో యాప్‌ను ప్రచారం చేసి.. అందుకు బదులుగా ప్రమోటర్ల నుంచి డబ్బు అందుకున్నారన్నది ఈడీ అభియోగం. ఈ కేసులో 14 నుంచి 15 మంది సెలబ్రిటీలు, నటుల పాత్ర ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది. మిగతా వారికి కూడా త్వరలోనే నోటీసులు జారీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ కేసులో వీరు నిందితులు కారని, హవాలా వ్యవహారంలో చెల్లింపులు ఎలా జరిగాయన్నది తెలుసుకోవడానికే వీరిని విచారించనున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని