MK Stalin: ప్రజల పట్ల మర్యాదతో ప్రవర్తించండి.. ఉద్యోగులకు సీఎం స్టాలిన్‌ విజ్ఞప్తి

తమ సమస్యలు చెప్పుకొనేందుకు వచ్చే ప్రజల పట్ల ప్రభుత్వ ఉద్యోగులు మర్యాదతో వ్యవహరించాలని తమిళనాడు సీఎం స్టాలిన్‌ కోరారు.

Published : 28 Sep 2023 02:09 IST

చెన్నై: సాధారణ ప్రజలతో ప్రభుత్వ ఉద్యోగులు మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌(MK Stalin) కోరారు. కార్యాలయానికి వచ్చిన వారిని సీట్లో కూర్చోమని చెప్పి వారి మాటలు వినాలన్నారు. ఇలాంటి చర్యలు ప్రజలకు ఎంతో సంతృప్తినిస్తాయన్నారు. బుధవారం చెన్నైలో గ్రూప్‌ 4 ఉద్యోగాలకు నియమితులైనవారికి అపాయింట్‌మెంట్‌ లెటర్లు అందజేసిన సందర్భంగా ఆయన కీలక సూచనలు చేశారు.  ప్రభుత్వ ఉద్యోగులు తమ సంక్షేమం కోసం పాటుపడుతున్నారనే విషయాన్ని ప్రజలు గుర్తించేలా వ్యవహరించాలన్నారు.  ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల పట్ల నిజాయతీగా ఉండాలని సూచించారు. ప్రజలకు వారు చేసే మంచి చెడుల ఫలితాన్ని బట్టే వారి పేరు నిలిచిపోతుందని చెప్పారు. 

రెండేళ్లలో 50వేల ప్రభుత్వ కొలువులు భర్తీ చేస్తాం

అలాగే, తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి స్టాలిన్‌ కీలక ప్రకటన చేశారు. వచ్చే రెండేళ్లలో 50వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు వెల్లడించారు. డీఎంకే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గత రెండేళ్ల వ్యవధిలో 12,576 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిందన్నారు. తాజాగా మరో 10,205 మందిని భర్తీ చేసినట్టు చెప్పారు. ఈ ఏడాదిలోనే కొత్తగా మరో 17వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు రాబోతున్నాయని స్టాలిన్ చెప్పారు.  ప్రభుత్వ పథకాలను ఎలాంటి వివక్ష లేకుండా అన్ని వర్గాలవారికి చేర్చాలని ఉద్యోగులకు సూచించారు. తమది సామాజిక న్యాయాన్ని కాపాడే ప్రభుత్వమన్నారు.  ప్రజల ఫిర్యాదులను పరిశీలించి వారి సమస్యలను పరిష్కరించేందుకు చొరవచూపాలన్నారు.  ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల ప్రయోజనాలు వారికి అందేలా చూడాలన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని