2021లో వెండితెరపై అందాల విందు

తెలుగులో మెరిపిస్తూ...తెలుగుతో పాటు దక్షిణాదిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మిక, షాలినీ పాండే, సమంతలు బాలీవుడ్‌ ఎంట్రీ ...

Published : 11 Jan 2021 17:56 IST

చిత్రసీమ పుష్పకవిమానం లాంటిది. ఎంతమంది వచ్చినా ప్రతిభ చాటగలిగే వారికి చోటు ఉంటూనే ఉంటుంది. అందులోనూ అందాల నాయికలకైతే ఎర్రతివాచీ పరిచి ఆహ్వానం పలుకుతుంది. పదే పదే ఒకే నాయికను చూడటం కంటే కొత్త భామల అందాల్ని ఆస్వాదించాలనుకుంటారు ప్రేక్షకులు. కొత్త అమ్మాయిలైతే సినిమాకు ఫ్రెష్‌లుక్‌ వస్తుందని ఆలోచిస్తుంటారు దర్శక నిర్మాతలు. అందుకే ఏటా కొత్త తారలు తళుక్కుమంటుంటారు. ఈసారి బాలీవుడ్‌లో కొత్త ముఖాల మెరుపులు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా అగ్రతారల చిత్రాల్లోనూ, యువతరం హీరోలతో ఆడిపాడబోతున్న భామలు ఎక్కువగా ఉన్నారు. 2021లో బాలీవుడ్‌ వెండితెరపై అందాల విందు చేయబోతున్న ఆ తారలెవరో చూసేద్దాం..

తొలి చిత్రంతోనే అగ్ర కథా నాయకులతో కలిసి నటించే అవకాశం దక్కించుకుని జాక్‌పాట్‌ కొట్టేశారు మానుషి చిల్లర్, క్రైస్ట్లీ డిసౌజా. ‘పృథ్విరాజ్‌’ చిత్రంతో అక్షయ్‌ కుమార్‌ సరసన నటిస్తోంది ప్రపంచ సుందరి కిరీటం తగిలించుకున్న మానుషి. చారిత్రక కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పృథ్విరాజ్‌ ప్రియురాలు సంయోగిత పాత్రలో కనిపించనుంది. చంద్రప్రకాష్‌ ద్వివేది తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అమితాబ్‌బచ్చన్, ఇమ్రాన్‌ హష్మీ, రియా చక్రవర్తి ప్రధాన పాత్రల్లో రానున్న చిత్రం ‘ఛేహ్రే’. ఇందులో అవకాశం అందుకుంది క్రైస్ట్లీ డిసౌజా. బుల్లితెరపై సందడి చేసిన ఈ భామ రూమీ జాఫ్రే తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది.

తెలుగులో మెరిపిస్తూ... తెలుగుతో పాటు దక్షిణాదిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మిక, షాలినీ పాండే, సమంతలు బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నారు. తెలుగులో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిన విజయ్‌దేవరకొండ్‌ చిత్రం  ‘అర్జున్‌రెడ్డి’లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది షాలినీ పాండే. ఇప్పుడు ఆమె బాలీవుడ్‌లో నటిస్తున్న తొలి చిత్రం ‘జయేష్‌భాయ్‌ జోర్దార్‌’. రణ్‌వీర్‌సింగ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దివ్యాంగ్‌ టక్కర్‌ తెరకెక్కిస్తున్నారు. మహిళల నేపథ్యంగా సాగే కథ ఇది. ప్రస్తుతం దక్షిణాది క్రేజీ హీరోయిన్లలో ఒకరైన రష్మిక కూడా బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చేసింది. సిద్ధార్థ్‌ మల్హోత్ర కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మిషన్‌ మజ్ను’. శంతన్‌ బగ్చీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తోంది. దక్షిణాది ప్రేక్షకుల్ని తనదైన నటనతో ఆకట్టుకునే సమంత కూడా ఈసారి హిందీ ప్రేక్షకుల్ని పలకరించనుంది. కానీ అది సినిమా కాదు వెబ్‌సిరీస్‌. ‘ది ఫ్యామిలీ మేన్‌ 2’లో ఆమె కీలక పాత్రలో నటించింది. మరి భవిష్యత్తుల్లో సినిమాల్లో నటిస్తుందో లేదో చూడాలి. 

యువతరంతో చిందేయడానికి..

యువతరం హీరోలతో ఆడిపాడటానికి సిద్ధమవుతున్నారు శర్వరి, ఇషాబెల్లె కైఫ్‌. ‘ది ఫర్‌గాటెన్‌ ఆర్మీ- ఆజాదీ కే లియే’ వెబ్‌ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకుంది శర్వరి. ఇప్పుడు ఈ నాయిక ‘బంటీ ఔర్‌ బబ్లీ 2’ చిత్రంతో బాలీవుడ్‌ వెండితెరపైకి రాబోతుంది. ఇందులో సిద్ధాంత్‌ చతుర్వేదికి జోడీగా నటిస్తోంది. ‘బంటీ ఔర్‌ బబ్లీ’కి సీక్వెల్‌గా రానున్న ఈ చిత్రంలో రాణీ ముఖర్జీ, సైఫ్‌ అలీఖాన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘క్వత’ చిత్రంతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తుంది కత్రినాకైఫ్‌ సోదరి ఇషా బెల్లె కైఫ్‌. సల్మాన్‌ఖాన్‌ బావమరిది ఆయుష్‌ శర్మ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. కరణ్‌ లలిత్‌ బుటానీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఆయుష్‌ ఆర్మీ అధికారిగా కనిపించనున్నాడు. 

ఇదీ చదవండి

సోషల్‌ లుక్‌: తారల ‘సండే’ తళుకులు..! 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని