Anushka Shetty: ఆ భయం ఇప్పటికీ ఉంది!

‘‘వినోదం.. భావోద్వేగాలు కలగలిసి ఉన్న కొత్తదనం నిండిన చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’’ అంటోంది నటి అనుష్క. ఓ వైపు కమర్షియల్‌ కథలతో అలరిస్తూనే.. మరోవైపు నాయికా ప్రాధాన్య చిత్రాలతోనూ తనదైన ముద్ర వేసి పరిపూర్ణమైన నటిగా పేరు తెచ్చుకుంది.

Updated : 06 Sep 2023 14:21 IST

‘‘వినోదం.. భావోద్వేగాలు కలగలిసి ఉన్న కొత్తదనం నిండిన చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’’ అంటోంది నటి అనుష్క. ఓ వైపు కమర్షియల్‌ కథలతో అలరిస్తూనే.. మరోవైపు నాయికా ప్రాధాన్య చిత్రాలతోనూ తనదైన ముద్ర వేసి పరిపూర్ణమైన నటిగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడామె.. నవీన్‌ పొలిశెట్టి కలిసి నటించిన చిత్రమే ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’. పి.మహేష్‌బాబు తెరకెక్కించారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది. ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ‘ఈనాడు సినిమా’తో ముచ్చటించింది అనుష్క.

ఈ మధ్య మీరు సినిమా.. సినిమాకీ చాలా గ్యాప్‌ తీసుకుంటున్నారు. సరైన కథలు దొరక్కా.. మరేవైనా కారణాలున్నాయా?

‘‘నిజంగానే ఈసారి నా నుంచి చాలా గ్యాప్‌ వచ్చింది. ‘భాగమతి’ తర్వాత ఐదేళ్లకు ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’తో మళ్లీ థియేటర్లలోకి అడుగు పెడుతున్నా. చాలా ఆనందంగా ఉంది. నిజానికి ఈ విరామానికి కథలు దొరక్కపోవడం కారణం కాదు. ‘భాగమతి’ తర్వాత నేనే కావాలని కొన్నాళ్లు సినిమాల నుంచి విరామం తీసుకున్నా. అదే సమయంలో ‘నిశ్శబ్దం’ కథ నా దగ్గరకొచ్చింది. సైలెంట్‌ ఫిల్మ్‌.. కథ విభిన్నంగా ఉంది.. రెండు నెలల్లో పూర్తయిపోతుంది అనుకున్నా. కానీ, అది ఆలస్యమైంది. అది పూర్తయ్యాక మళ్లీ కొన్నాళ్లు విరామం తీసుకోవాలనిపించింది. ఆ తర్వాత ఈ చిత్రం పట్టాలెక్కించా. ఇకపై ఇంత విరామం రాకుండా చూసుకుంటా’’.  

‘సైజ్‌ జీరో’ సినిమా కోసం బరువు పెరగడం.. తగ్గడం.. మీ ఆరోగ్యంపై ప్రభావితం చూపించిందనుకోవచ్చా?

‘‘అలాంటిదేమీ లేదు. ‘సైజ్‌ జీరో’ 2015లో వచ్చింది. ఆ తర్వాత నేను ‘ఓం నమో వేంకటేశాయ’, ‘బాహుబలి-2’, ‘భాగమతి’.. ఇలా వరుస చిత్రాలు చేశా కదా. నేను తీసుకున్న విరామానికి ‘సైజ్‌ జీరో’ ఏమాత్రం కారణం కాదు. నాకు నచ్చి చేసిన పాత్రది. ప్రతి దాంట్లోనూ ప్లస్‌.. మైనస్‌లు ఉంటాయి. అంతకు ముందు నేను కొన్ని సినిమాలు చేసినప్పుడు కూడా చాలా గాయాలయ్యాయి. అవన్నీ వృత్తిలో భాగం. ‘భాగమతి’ తర్వాత విరామం తీసుకోవడమన్నది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. ఎందుకంటే అంతకు ముందు వరకు వరుసగా చాలా పెద్ద ప్రాజెక్ట్‌లు చేశా. మానసికంగా.. శారీరకంగా కాస్త విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందనిపించింది. తీసుకున్నా. అంతే తప్ప దీనికి ఏ ఒక్క చిత్రమో కారణం కాదు’’.

‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ కథలో మిమ్మలి ఆకర్షించిన అంశాలేంటి? దీంట్లో మీ పాత్ర ఎలా ఉంటుంది?

‘‘కథలో ఉన్న కొత్తదనం నాకు బాగా నచ్చింది. అలాగే నా పాత్రని తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకుంది. 2019లో నేనీ కథ విన్నా. విన్న వెంటనే కచ్చితంగా ఇది నేను చేయాలని అనుకున్నా. అయితే కొవిడ్‌ వల్ల సినిమా సెట్స్‌పైకి వెళ్లడం ఆలస్యమైంది. ఇందులో మంచి వినోదంతో పాటు చక్కటి భావోద్వేగాలున్నాయి. నేనిందులో అన్విత అనే లండన్‌కు చెందిన మాస్టర్‌ చెఫ్‌గా కనిపిస్తా. తను బిడ్డను కనాలనుకునే ఆలోచనలో ఓ భావోద్వేగమైన కథ ఉంది. అదేంటన్నది సినిమా చూస్తే అర్థమవుతుంది’’.

ఈ సినిమా విషయంలో మీకు సవాల్‌గా అనిపించిన అంశాలేంటి? నవీన్‌ పొలిశెట్టితో చేయడం ఎలా అనిపించింది?

‘‘ఇది చాలా సింపుల్‌ కథ. పెద్ద డ్రామా ఏమీ ఉండదు. సెటిల్డ్‌ ఎమోషన్స్‌ ఉంటాయి. ఇలాంటి కథను భుజానికెత్తుకొని దానికి న్యాయం చేయడం సవాల్‌తో కూడుకొని ఉంటుంది. కానీ, దర్శకుడు మహేష్‌ వల్ల ఈ సవాల్‌ని తేలికగా పూర్తి చేయగలిగాం. ఈ కథ విన్నప్పుడే దీనికి నవీన్‌ పొలిశెట్టి సరిగ్గా సరిపోతాడనిపించింది. తను ఇందులో అద్భుతంగా నటించాడు. తన కామెడీ టైమింగ్‌ భలే ఉంటుంది. తనతో కలిసి పని చేయడం చాలా బాగుంది’’.

ఈ చిత్రంలో చెఫ్‌గా నటించారు కదా. ఇంట్లో కూడా వంట చేస్తుంటారా?

‘‘వంట చేస్తాను కానీ, మా అమ్మలా అయితే చేయలేను. తను చాలా రుచికరంగా చేస్తుంది. ఎవరైనా మా ఇంటికొచ్చారంటే భోజనం చేయకుండా అసలు వెళ్లనీయను. మరీ అద్భుతమైన వంటలు కాకపోయినా నాకొచ్చినంతలో మంచిగా చేసి పెడతా. నాకు పప్పు చాలా ఇష్టం. మంచిగా వండుతా. అలాగే పాస్తా బాగా చేస్తాను’’.

చిత్రసీమలోకి అడుగు పెట్టి 18ఏళ్లు పూర్తవుతోంది. కెరీర్‌ ఆరంభంలో ఇంత సుదీర్ఘ ప్రయాణాన్ని ఊహించారా?

‘‘అసలు ఊహించలేదు. ఎందుకంటే ఓ ప్రణాళిక ప్రకారం నేనెప్పుడూ ముందుకెళ్ల లేదు. నాకన్ని తెలివితేటలు కూడా లేవు. మంచి కథల్లో భాగమవ్వాలి.. ప్రభావవంతమైన పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించాలన్న అత్యాశ నాకెప్పుడూ ఉంటుంది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో నన్నెప్పుడూ ఓ భయం వెంటాడుతుండేది. సెట్లోకి వెళ్లి ధైర్యంగా డైలాగ్‌ చెప్పగలుగుతానా.. నాకిచ్చిన పాత్రకు న్యాయం చేయగలుగుతానా.. దర్శక నిర్మాతలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానా? అని భయపడేదాన్ని. నేనొక కొత్త చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నానంటే ఇప్పటికీ కొన్ని రోజుల వరకు ఆ భయం వెంటాడుతూనే ఉంటుంది (నవ్వుతూ)’’.

ఈ సుదీర్ఘ ప్రయాణంలో మీకు కలిసొచ్చిన అంశాలేంటి? నేర్చుకున్న విషయాలేంటి?

‘‘నాకొచ్చిన అవకాశాల వల్లే ఇంత సుదీర్ఘ ప్రయాణం సాధ్యమైందని నమ్ముతా. కెరీర్‌ ఆరంభం నుంచి మంచి కథలు.. వైవిధ్యభరితమైన పాత్రలు చేయగలిగా. గొప్ప నటులు, దర్శక నిర్మాతలతో కలిసి పని చేసే అవకాశం దొరికింది. కోడి రామకృష్ణ, శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి ‘అరుంధతి’తో నా కెరీర్‌ను మరో మలుపు తిప్పారు. అక్కడి నుంచే నాపై ప్రేక్షకుల ప్రేమ రెట్టింపయ్యింది. ఇలా ఎన్నో అంశాలు నా కెరీర్‌ విజయవంతంగా సాగడంలో దోహదపడ్డాయని చెప్పొచ్చు. ఇక్కడ జయాపజయాలేవీ శాశ్వతం కాదు. ఓ చక్రంలా అవి తిరుగుతూనే ఉంటాయి. గెలుపోటములు రెండింటినీ సమంగా తీసుకోవడం అలవర్చుకోవాలి. ఫలితాన్ని దృష్టిలో పెట్టుకోకుండా పని చేయగలిగినప్పుడే ఆ ప్రయాణాన్ని ఆస్వాదించగలుగుతాం. నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో చాలా ఎమోషన్‌ ఉంది’’.

ఇకపైనా నాయికా ప్రాధాన్య కథలతోనే ముందుకెళ్లాలి అనుకుంటున్నారా?

‘‘అలా ఏమీ లేదు. ప్రత్యేకంగా ఇలాంటి కథలే చేయాలని పరిమితులేం పెట్టుకోలేదు. వైవిధ్యభరితమైన కథలు దొరికితే ఏ భాషలో నటించడానికైనా వెనకాడను. అలాగే మంచి కథలొస్తే కమర్షియల్‌ సినిమాలు చేయడానికీ సిద్ధమే. ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ కూడా నాయికా ప్రాధాన్య చిత్రమేమీ కాదు. నాయకానాయికల మధ్య నడిచే ఓ అందమైన కథతో రూపొందింది’’.

కొత్త చిత్ర విశేషాలేంటి?

‘‘ప్రస్తుతం మలయాళంలో ‘కథనార్‌..’ అనే చిత్రంలో నటిస్తున్నా. తెలుగులో ఓ కథ విన్నా. ఆ ప్రాజెక్ట్‌ వివరాల్ని దాని నిర్మాతలు త్వరలో ప్రకటిస్తారు. మంచి విభిన్నమైన కథలు దొరికితే ఓటీటీకి చేయడానికీ సిద్ధమే’’.  

పెళ్లి విషయంలో మీ ఆలోచనలేంటి? ఇన్నేళ్ల తర్వాత చేసుకోవాలన్న ప్రణాళిక ఏమైనా ఉందా?

‘‘నేను పెళ్లికి వ్యతిరేకం కాదు. పెళ్లి.. పిల్లలు.. కుటుంబ బంధాలు.. ఇవన్నీ చాలా అందంగా ఉంటాయి. అయితే నేను నమ్మేదేంటంటే.. ఈ ప్రక్రియంతా ఆర్గానిక్‌గా జరగాలి. దానికి సరైన సమయం రావాలి. పెద్దలు కుదిర్చిన పెళ్లైనా.. ప్రేమ పెళ్లైనా అందులో ఎమోషన్‌ ఉండాలి. ప్రేమ, ఎమోషన్‌ లేకుండా ఏ పెళ్లి చేసుకున్నా ఉపయోగముండదు’’.


నేనే తొలి ప్రేక్షకుణ్ని

‘‘వినోదాన్ని.. భావోద్వేగాల్ని అద్భుతంగా మిళితం చేసి ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ని రక్తి కట్టించేలా తెరకెక్కించార’’న్నారు కథానాయకుడు చిరంజీవి. ఈ చిత్రానికి తానే తొలి ప్రేక్షకుణ్ని అంటూ చెప్పిన చిరు.. సినిమాని ఆద్యంతం ఆస్వాదించినట్లు మంగళవారం సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. ఈ మేరకు ఈ చిత్ర బృందంతో కలిసి దిగిన ఫొటోల్ని అభిమానులతో పంచుకున్నారు. నేటి యువత ఆలోచనా విధానాన్ని ప్రతిబింబించే సరికొత్త కథాంశంతో ఈ సినిమా రూపొందిందని.. ఇది ప్రేక్షకుల్ని వందశాతం నవ్వుల బాట పట్టిస్తుందని పేర్కొన్నారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని