April 28th: ఈ రోజు ఎన్ని బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలు విడుదలయ్యాయో తెలుసా?

ఏప్రిల్‌ 28కి టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు ఉంది. అది ఎందుకు స్పెషల్‌ అనే విషయం మీకు తెలుసా..?

Updated : 28 Apr 2023 10:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏప్రిల్‌ 28 (April 28th).. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చరిత్ర లిఖించిన రోజు. టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టించిన సినిమాలు ఆ తేదీనే విడుదలయ్యాయి. అందుకే అది సినీ ప్రియులకు ఎంతో ప్రత్యేకమైంది. ఆ కథేంటంటే..? ఓ చిత్రం సూపర్‌హిట్‌ అయితే దాని రిలీజ్‌ డేట్‌ గుర్తుపెట్టుకుని మరీ సినీ అభిమానులు ప్రతి ఏడాది అదే రోజున సంబరాలు చేసుకుంటుంటారు. ఆ సినిమా ప్రారంభమైన దశ నుంచి సాధించిన వసూళ్ల వరకు అన్నింటి గురించి చర్చిస్తుంటారు. మరి, వేర్వేరు సంవత్సరాల్లో ఒకే తేదీన విడుదలైన నాలుగు సినిమాలు బ్లాక్‌ బస్టర్లుగా నిలిస్తే..? అంతకుమించి అనిపించేలా సందడి చేస్తారు. అంతటి హంగామాకు కారణమైన ఈ తేదీన ఏయే చిత్రాలు విడుదలయ్యాయో ఓ లుక్కేద్దామా!

1977లో ప్రారంభం..

‘అడవి రాముడు’ (Adavi Ramudu) సినిమాతో 1977లోనే ఏప్రిల్‌ 28 స్పెషల్‌గా నిలిచింది. నందమూరి తారకరామారావు (దివంగత) హీరోగా దర్శకుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన చిత్రమిది. అప్పటి వరకు సాంఘిక, పౌరాణిక తదితర నేపథ్యాలే ఎక్కువగా కనిపించిన తెలుగు తెరకు అసలైన కమర్షియల్‌ హంగులు చూపింది ఈ చిత్రమే. అప్పట్లోనే రూ.3 కోట్లు కలెక్ట్ చేసిన తొలి తెలుగు సినిమాగా చరిత్ర సృష్టించింది. 32 కేంద్రాల్లో 100 రోజులు, 16 కేంద్రాల్లో 175 రోజులు, 8 కేంద్రాల్లో 200 రోజులు, విజయవాడలోని అప్సర థియేటర్‌లో 302 రోజులు ప్రదర్శితమైందని సినీ విశ్లేషకులు చెబుతుంటారు.

1994లో ఇలా..

కమెడియన్‌ అలీని హీరోగా పెట్టి డైరెక్టర్‌ ఎస్వీ కృష్ణారెడ్డి చేసిన ప్రయోగం.. ‘యమలీల’ (Yamaleela). 1994 ఏప్రిల్‌ 28న వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. తల్లీకొడుకుల సెంటిమెంట్‌కు ఫాంటసీ నేపథ్యాన్ని జోడించి కృష్ణారెడ్డి అప్పట్లో ట్రెండ్‌ సెట్‌ చేశారు. ప్రముఖ హీరో కృష్ణ (దివంగత) అతిథిగా మెరిసిన ఈ సినిమా 100కిపైగా రోజులు దిగ్విజయంగా ఆడింది. హైదరాబాద్‌లోని పలు థియేటర్లలో 400 రోజులు ప్రదర్శితమైందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

2006లో ఊహించని ప్రభంజనం 

‘పోకిరి’ (Pokiri) విడుదలతో ఏప్రిల్‌ 28కు మరింత గుర్తింపు దక్కింది. ప్రముఖ హీరో మహేశ్‌బాబు, దర్శకుడు పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఎవరూ ఊహించని ప్రభంజనం సృష్టించింది. 2006లో విడుదలైన ఈ చిత్రం దాదాపు రూ. 66 కోట్ల వసూళ్లతో టాలీవుడ్‌లో ఉన్న నాటి రికార్డులను తిరగరాసింది. సుమారు రూ. 12 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, ఆ స్థాయి వసూళ్లు చేయడం అప్పట్లో సంచలనం. 200 సెంటర్లలో 100 రోజులు, 63 సెంటర్లలో 175రోజులు, 15 సెంటర్లలో 200రోజులు, కర్నూలులోని ఓ థియేటర్‌లో సంవత్సరానికిపైగా ప్రదర్శితమైందనేది సినీ వర్గాల మాట. ‘పోకిరి’కి ముందు.. తర్వాత అని తెలుగు చలన చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడుకునేలా చేసింది.

ఆ ప్రశ్నకు సమాధానం ఈ రోజే..

‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’.. యావత్‌ సినీ అభిమానుల ప్రశ్నకు ‘బాహుబలి 2’ (Baahubali 2) సమాధానమిచ్చింది ఏప్రిల్‌ 28నే. ప్రభాస్‌, రానా ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెకెక్కించిన ఈ సీక్వెల్‌ (బాహుబలి 1కి) దాదాపు రూ. 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, సుమారు రూ. 1800 కోట్లు వసూళ్లు చేసి నయా రికార్డు సృష్టించింది. 2017లో ఈ చిత్రం విడుదలైంది.

అందరి చూపూ.. ఏజెంట్‌ వైపు!

సినీ పరిశ్రమ వారు సెంటిమెంట్‌గా భావించే ఈ ఏప్రిల్‌ 28న విడుదలవడంతో ‘ఏజెంట్’ (Agent)పైనే అందరి దృష్టి పడింది. ఆ సినిమాల్లానే ఈ చిత్రం కూడా మంచి విజయం అందుకుంటుదనే ఆశాభావం వ్యక్తమవుతోంది. అఖిల్‌ అక్కినేని (Akhil Akkineni) హీరోగా దర్శకుడు సురేందర్‌ రెడ్డి (Surender Reddy) తెరకెక్కించిన సినిమా ఇది. స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాక్షివైద్య కథానాయిక (Sakshi Vaidya). మలయాళీ ప్రముఖ నటుడు మమ్ముట్టి (Mammootty) కీలక పాత్ర పోషించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని