‘రజనీ వైల్డ్‌’ ఎపిసోడ్‌ వచ్చేస్తోంది

రజనీకాంత్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వస్తోంది. ఆయన పాల్గొన్న మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌ ఎపిసోడ్‌ ప్రసార తేదీని డిస్కవరీ ఛానల్‌ ప్రకటించింది.

Published : 27 Feb 2020 16:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రజనీకాంత్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వస్తోంది. ఆయన పాల్గొన్న మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌ ఎపిసోడ్‌ ప్రసార తేదీని డిస్కవరీ ఛానల్‌ ప్రకటించింది. మార్చి 23న రాత్రి 8గంటలకు ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఛానల్‌ తన ట్విటర్‌ ఖాతాలో ప్రకటించింది. అంతేకాదు ఆ ఎపిసోడ్‌కు సంబంధించిన ఓ ప్రోమో వీడియోను కూడా విడుదల చేసింది. ‘అల్టిమేట్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, సాహసవీరుడు బేరీ గ్రిల్స్‌ కలిసి ఇండియాలోని అడవుల్లో చేసిన సాహస కృత్యాలను చూసేందుకు సిద్ధమవండి. తలైవా ఆన్‌ డిస్కవరి’ అంటూ పేర్కొంది. ఆ ప్రోమోలో సూపర్‌స్టార్‌ క్వాడ్రా సైకిల్‌ మీద దూసుకొస్తూ కనిపిస్తారు.
ఈ ఎపిసోడ్‌ను కర్ణాటకలోని బందీపూర్‌ అడవుల్లో జనవరిలో చిత్రీకరించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంతో తలైవా రజనీకాంత్‌ తొలిసారిగా ఓ టీవీషోలో కనిపించనున్నారు. కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉందని, ఇదొక మరిచిపోలేని అనుభవమని రజనీ అభిమానులతో ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. కాగా.. ఈ షూట్‌లో తొలిరోజు రజనీకి గాయాలైనప్పటికీ కోలుకొని తర్వాతి రోజే చిత్రీకరణలో పాల్గొన్నారు. గతంలో రజనీకంటే ముందు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో కనిపించారు. ఆ ఎపిసోడ్‌ను ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది వీక్షించి రికార్డు సృష్టించినట్లు ఛానల్‌ పేర్కొంది. తాజాగా.. రజనీకాంత్‌ పాల్గొన్న ఈ ఎపిసోడ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని