ఎక్కడి చిత్రాలు అక్కడే

చిత్రసీమలో గతేడాది కనిపించిన పరిస్థితులే పునరావృతం అవుతున్నాయి. కరోనా ఉధృతితో ఒక పక్క థియేటర్లు వెలవెలబోతున్నాయి. మరోపక్క చిత్రీకరణలూ ఒకొక్కటిగా ఆగిపోతున్నాయి. అగ్ర తారల చిత్రాలు దాదాపు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. ప్రకటించిన తేదీ ప్రకారం అగ్ర తారల సినిమాలేవీ ప్రేక్షకుల ముందుకొచ్చే పరిస్థితులు కనిపించడం లేదు.

Published : 20 Apr 2021 14:54 IST

కరోనా భయంతో ఆగిన చిత్రీకరణలు

చిత్రసీమలో గతేడాది కనిపించిన పరిస్థితులే పునరావృతం అవుతున్నాయి. కరోనా ఉధృతితో ఒక పక్క థియేటర్లు వెలవెలబోతున్నాయి. మరోపక్క చిత్రీకరణలూ ఒకొక్కటిగా ఆగిపోతున్నాయి. అగ్ర తారల చిత్రాలు దాదాపు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. ప్రకటించిన తేదీ ప్రకారం అగ్ర తారల సినిమాలేవీ ప్రేక్షకుల ముందుకొచ్చే పరిస్థితులు కనిపించడం లేదు.

కరోనాతో 2020 ఎలాగో తుడిచిపెట్టుకుపోయింది. 2021లోనైనా దూసుకెళ్దాం అన్నట్టుగా వరుస సినిమాలతో హుషారుగా కనిపించారు కథానాయకులు. ఒకపక్క కరోనా భయపెడుతున్నా... తగిన జాగ్రత్తలు తీసుకుంటూ... పరిస్థితులకి అలవాటు పడుతూ చిత్రీకరణల్ని కొనసాగించారు. ఎలాగైనా ఈ ఏడాది తమ సినిమాల్ని ప్రేక్షకులకు చూపించాల్సిందే అనే తపనతో కనిపించారు. కానీ మరోసారి కరోనా కరడుగట్టిన విలన్‌లా అడ్డుపడింది. అయితే గత కొన్నాళ్లుగా రెండో దశ కరోనా ఉధృతంగా కనిపిస్తున్నా చిత్ర బృందాలు మాత్రం వెనకడుగు వేయలేదు. చాలా సినిమాలు చిత్రీకరణలు జరుపుకుంటూనే వచ్చాయి. కానీ ఆయా చిత్రబృందాల్లోని కీలక సభ్యులే కరోనా బారిన పడటంతో ఇక చేసేదేం లేక చిత్రీకరణల్ని ఆపేస్తున్నారు.
*చిరంజీవి, రామ్‌చరణ్‌ కథా నాయకులుగా నటిస్తున్న ‘ఆచార్య’ మొన్నటివరకు శర వేగంగా చిత్రీకరణని జరుపుకొంది. రామ్‌చరణ్‌, ఇతర చిత్రబృందం నేపథ్యంలో కొన్ని పోరాట ఘట్టాల్ని తెరకెక్కించారు. పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని చిత్రీకరణని తాత్కాలికంగా నిలిపేశారు. ఆ చిత్రబృందంలో ఒకరైన సోనూసూద్‌ కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ కథానాయకులుగా నటిస్తున్న ‘ఎఫ్‌3’ కొత్తషెడ్యూల్‌ని మొదలుపెట్టారో లేదో, అంతలోనే దర్శకుడు అనిల్‌ రావిపూడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దాంతో ఆ సినిమా చిత్రీకరణని కూడా నిలిపేశారు.

* ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న రెండు చిత్రాలూ కరోనా ప్రభావంతోనే ఆగిపోయాయి. కొన్నాళ్ల కిందటివరకూ ముంబయిలో ‘ఆదిపురుష్‌’ చిత్రీకరణలో పాల్గొన్నారు ప్రభాస్‌. అయితే అక్కడ కరోనా తీవ్రత ఎక్కువ కావడంతో అక్కడ చిత్రీకరణని నిలిపివేశారు. దాంతో ‘రాధేశ్యామ్‌’ చిత్రీకరణనైనా పూర్తి చేద్దామని ఆయన హైదరాబాద్‌కి వచ్చేశారు. కానీ చిత్రీకరణ మాత్రం మొదలుపెట్టలేకపోయారు. కరోనా భయాలే అందుకు కారణం. మహేష్‌బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రబృందంలో కూడా పలువురికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ఆ సినిమా చిత్రీకరణని కూడా నిలిపేశారు. మిగిలిన సభ్యులు కూడా పరీక్షలు పూర్తి చేసుకుని వచ్చాక చిత్రీకరణని మొదలుపెట్టనున్నారు. నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న ‘థ్యాంక్‌యూ’ చిత్రీకరణ కోసం విదేశాలకి వెళ్లాలనుకున్నారు. ఆ క్రమంలో యూనిట్‌లో కొందరికి కొవిడ్‌ అని తేలడంతో ఆగిపోయారు. గోపీచంద్‌ ‘పక్కా కమర్షియల్‌’ సినిమా చిత్రీకరణ కూడా ఆగిపోయింది. రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ చిత్రీకరణలోనూ గత కొన్ని రోజులుగా పురోగతి లేదు. కొన్నివారాల కిందటి వరకూ పవన్‌ కల్యాణ్‌ రెండు చిత్రాలతో బిజీగా గడిపారు. ఆయనకి కొవిడ్‌ పాజిటివ్‌ అని తేలడంతో ఆ రెండు చిత్రాలు నిలిచిపోయాయి. కొందరు నటులు చిత్రీకరణల్లో పాల్గొనడానికి వెనకంజ వేస్తున్నారు.  

* చిత్రీకరణల పరిస్థితి ఇలా ఉంటే... ఇక ప్రదర్శనల సంగతి సరే సరి.థియేటర్లకి వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కొన్ని చోట్ల ‘తగిన సినిమాలు అందుబాటులో లేకపోవడంతో తాత్కాలికంగా ప్రదర్శనల్ని రద్దు చేస్తున్నాం’ అనే బోర్డులు పలు థియేటర్ల ముందు కనిపిస్తున్నాయి. అగ్ర తారల చిత్రాల విడుదలలు వాయిదా పడటంతో, పరిమిత వ్యయంతో తెరకెక్కిన చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని