Kantara chapter-1: ‘కాంతారా-1’లో నాకు అవకాశమివ్వండి.. రిషబ్‌శెట్టికి క్రేజీ హీరోయిన్‌ విన్నపం!

Payal rajput: ‘కాంతారా-1’లో తనకు అవకాశం ఇవ్వమంటు నటి పాయల్‌ రాజ్‌పుత్‌ ట్విటర్‌ వేదికగా రిషబ్‌శెట్టిని కోరారు.

Updated : 12 Dec 2023 19:47 IST

హైదరాబాద్‌: భారతీయ బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించిన చిత్రం ‘కాంతారా: ది లెజెండ్‌’ (Kantara). రిషబ్‌శెట్టి నటనతో పాటు, భాషతో సంబంధం లేకుండా ‘వరాహ రూపం’ పాటను శ్రోతలందరూ తమలో ఆవాహన చేసుకున్నారు. ఇప్పుడు ఆ మూవీకి ప్రీక్వెల్‌గా ‘కాంతారా: చాప్టర్‌-1’ పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి రిషబ్‌శెట్టి (Rishab Shetty) ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు. మరోవైపు ఈ ఇందులో నటీనటుల కోసం ఆడిషన్స్‌ మొదలు పెట్టారు. ఈ క్రమంలో తెలుగులో తనకంటూ క్రేజ్‌ సొంతం చేసుకున్న నటి పాయల్‌ రాజ్‌పుత్‌ (payal rajput) ‘కాంతారా-1’లో ఛాన్స్‌ ఇవ్వమని హీరో రిషబ్‌శెట్టి, చిత్ర నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్‌కు ట్వీట్‌ చేసింది. తాను నటించిన ‘మంగళవారం’ చిత్రాన్ని ఓసారి చూసి తనకు అవకాశమివ్వమని కోరింది.

‘‘రిషభ్‌శెట్టి, హోంబాలే ఫిల్మ్స్‌.. ‘కాంతారా: చాప్టర్‌-1’ కోసం ఆడిషన్స్‌ జరుగుతున్నాయని నాకు తెలిసింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావాలని నాకు ఆశగా ఉంది. ఇటీవల విడుదలైన నా చిత్రం ‘మంగళవారం’లో నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. మీరు కాస్త సమయం వెచ్చించి నేను నటించిన సినిమా చూస్తే, మీకు కృతజ్ఞతలు చెప్పుకొంటాను. ఈ ప్రాజెక్ట్‌ కోసం ఆడిషన్‌ ఇవ్వడానికి ఏం చేయాలో దయచేసి చెప్పండి. నా పేరు రీపోస్ట్‌ చేస్తూ సహకరించే అభిమానులకు నా ధన్యవాదాలు’’ అని పాయల్‌ రాజ్‌పుత్‌ ఎక్స్‌ వేదికగా ‘కాంతార: చాప్టర్‌-1’ చిత్ర బృందాన్ని కోరింది.

పాయల్‌ రాజ్‌పుత్‌ ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ పలువురు నెటిజన్లు ‘ఆమెను తీసుకోండి. మంగళవారంలో ఆమె బాగా నటించింది’, ‘మంగళవారంలో శైలులాంటి పాత్ర పాయల్‌ మాత్రమే చేయగలదు. ఆమె ట్వీట్‌కు రిప్లై ఇవ్వగలరు’ అంటూ రిషబ్‌శెట్టి, హోంబాలే ఫిల్మ్స్‌ను (Hombale Films) ట్యాగ్‌ చేస్తున్నారు. మరి పాయల్‌ రాజ్‌పుత్‌ కోరినట్లు ఆడిషన్స్‌కు ఆహ్వానిస్తారా? ఒకవేళ ‘కాంతారా: చాప్టర్‌-1’లో నటించాల్సి వస్తే ఏ పాత్రకు అవకాశం దక్కుతుంది. తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే! ప్రస్తుతం పాయల్‌ రాజ్‌పుత్‌ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ‘గోల్‌మాల్‌’, ‘ఏంజెల్‌’, ‘కిరాతక’ చిత్రాల్లో ఆమె నటిస్తోంది. మరోవైపు అజయ్‌ భూపతి దర్శకత్వంలో రూపొందిన మిస్టీరియస్‌ థ్రిల్లర్‌ ‘మంగళవారం’ (Mangalavaaram) త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ మూవీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+హాట్‌స్టార్‌ దక్కించుకున్నట్లు సమాచారం. డిసెంబరు చివరి వారంలో ఈ మూవీ స్ట్రీమింగ్‌ తీసుకురానున్నట్లు తెలుస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని