ఏనుగులతో ఆ ఒక్కరోజు చాలా భయమేసింది!

‘అరణ్య చిత్రం నాలో చాలా మార్పులు తీసుకొచ్చింది’ అన్నారు కథానాయకుడు రానా దగ్గుబాటి. రానా ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రభు సాల్మన్‌ తెరకెక్కించిన చిత్రమిది. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా విలేకర్లతో ముచ్చటించారు రానా

Published : 23 Mar 2021 19:27 IST

కథానాయకుడు రానా దగ్గుబాటి


‘అరణ్య చిత్రం నాలో చాలా మార్పులు తీసుకొచ్చింది’ అన్నారు కథానాయకుడు రానా దగ్గుబాటి. ఈయన ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రభు సాల్మన్‌ తెరకెక్కించిన చిత్రమిది. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా విలేకర్లతో ముచ్చటించారు రానా. ఆ ఆసక్తికర విశేషాలేంటో చదివేయండి...

ప్రతిరోజూ అదే చర్చ..

అసోంలోని కాజీరంగా ప్రాంతంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు ప్రభు సాల్మన్‌ ఈ కథని రాసుకున్నారు. ఆయన స్ర్కిప్టు వినిపిస్తున్నపుడే తెలియని నాలో తెలియని ఉత్సాహం కలిగింది. ప్రభు ‘కుంకి’ అనే చిత్రం చేస్తున్నపుడే ఏనుగుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. దాదాపు నాలుగేళ్లు ఈ ప్రాజెక్టు కోసం వెచ్చించారు. ఇందులో 18 ఏనుగులతో సాగే ప్రయాణం కొత్త అనుభూతి పంచుతుంది. షూటింగ్‌కి పదిహేను రోజుల ముందే థాయ్‌లాండ్‌కి వెళ్లాం. ప్రతిరోజూ నేనూ ప్రభు అడవికి వెళ్లి నా పాత్రకి, అక్కడున్న మొక్కకి ఏంటి సంబంధం? నాకు, కుందేలుకి ఏంటి సంబంధం? అంటూ చర్చించుకునేవాళ్లం. అడవిలో ఉండే ప్రతి జీవంతో నా పాత్ర ముడిపడి ఉంటుంది. శిక్షకుల సాయంతో ఏనుగులకి స్నానం చేయించి, ఆహారం అందించి వాటిని మచ్చిక చేసుకున్నాను.

అరటిపండు, బెల్లం..
ఏనుగులు మనుషుల్ని ఓ ఎనర్జీతో గుర్తిస్తాయి. తాకితే చాలు ఎవరు అనే విషయం ఇట్టే కనిపెట్టేస్తాయి. తొలినాళ్లలో అవి ఏమైనా చేస్తాయనే భయంతో జేబులో అరటిపండు, బెల్లం పెట్టుకుని తిరిగేవాణ్ని. ఓసారి జేబులోంచి అరటిపండు బయటికి వచ్చిన సంగతి నేను గుర్తించలేదు. అరటిపండు చూడగానే అక్కడున్న అన్ని ఏనుగులు నా వైపునకు వస్తుండటంతో చాలా భయపడ్డాను. కానీ అనుకున్నంతగా ఏం జరగలేదు. వారం రోజుల్లోనే వాటితో స్నేహం కుదిరింది.

ఏనుగుల కోసం పోరాటం..

ఈ చిత్రంలో నరేంద్ర భూపతిగా కనిపిస్తాను. ఫారెస్ట్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియాగా పేరొచ్చిన తర్వాత గ్రామ ప్రజలంతా ‘అరణ్య’ అని పిలవడం ప్రారంభిస్తారు. ఇప్పటికే ప్రేమ కోసం, ఇతరత్రా వాటికోసం పోరాడే సినిమాలు చేశాను. ఇది భూమి కోసం, జంతువుల కోసం పోరాడే చిత్రం కావడంతో ఎలాగైనా చేయాలనుకున్నాను. భవిష్యత్తు తరాలకు చూపించాల్సిన సినిమా ఇది. గతంలో జంతువు- మనిషి మధ్య అనుబంధం చూపించిన సినిమాలు వచ్చాయి కానీ పూర్తి స్థాయిలో ఏనుగుల గురించి రాలేదు. సినిమా ప్రారంభంలో ఏనుగులతోపాటు అడవిలో ఉండే అన్ని జంతువుల్ని చూపించాం. వెండితెరపై అడవుని చూసిన ప్రేక్షకులు మంచి అనుభూతికి లోనవుతారు. బయట కూడా కనిపించని పచ్చగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అంతగా మాయ చేశారు దర్శకుడు, ఛాయాగ్రాహకుడు.

కథల్ని బట్టి సమయం..

ఈ కథే నాకు స్ఫూర్తినిచ్చింది‌. ‘బాహుబలి’, ‘అరణ్య’ లాంటి సినిమాకు సమయం వెచ్చించినా నటులుగా కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. అరణ్య త్వరగానే పూర్తవుతుందని అనుకున్నా కానీ సెట్‌కి వెళ్లాక అర్థమైంది ఇలాంటి కథలు అనుకున్నంత తేలిక కాదు అని. వేణు ఊడుగుల తెరకెక్కిస్తోన్న ‘విరాటపర్వం’ తక్కువ సమయంలోనే పూర్తవుతుంది. ఎంపిక చేసుకున్న కథని బట్టి సమయం పడుతుంది. ‘విరాటపర్వం’లో కథానాయకుడి కలం పేరు ‘అరణ్య’ యాథృచ్చికంగా కుదిరింది. నన్ను పరిశ్రమకు పరిచయం దర్శకుడు శేఖర్‌ కమ్ములకు, బాబాయ్‌ వెంకటేష్‌కి నటుడిగా కొంచెం ఎదిగానని గర్వంతో ఈ చిత్రం చూపించా.

కేవలం వాటితోనే..

‘బాహుబలి’తో పోల్చుకుంటే ‘అరణ్య’నే కష్టమనిపించింది. 30 రోజులు నా పక్కన నటించేందుకు మనుషులకు అవకాశం లేదు. కేవలం ఏనుగులతోనే సన్నివేశాలన్నీ ఉంటాయి. ఈ కథని నాతో అనుకున్నప్పుడు లుక్‌ టెస్ట్‌ చేసి గడ్డం పెంచి సన్నగా మారమని చెప్పారు ప్రభు. షూటింగ్‌ కోసం అడవికి వెళ్లాక పాత్రకు తగ్గట్టు నన్ను నేను మలుచుకున్నాను. అరణ్య నన్ను చాలా మార్చింది. నేను పెళ్లి చేసుకోవడం దానికి నిదర్శనం (నవ్వుతూ).

పవన్‌తో..

ఎన్నో విభిన్న కథల్ని వినే నేను లాక్‌డౌన్‌ వస్తుందని కథగా చెప్పినా నమ్మేవాణ్ని కాదు. ఎవరూ ఊహించలేని పరిణామం అది. ప్రస్తుతం పరిస్థితి కాస్త కుదుట పడింది. కరోనా తర్వాత టాలీవుడ్‌ నుంచే అధిక సంఖ్యలో సినిమాలు రావడం, ప్రేక్షకులు ఆదరించడం శుభపరిణామం. గ్లోబల్‌ కథలకు కేరాఫ్‌గా తెలుగు చిత్ర పరిశ్రమ నిలుస్తుండటం తెలుగువారిగా గర్వపడాల్సిన విషయం. పవన్‌ కల్యాణ్‌తో కలిసి నటించే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది. ఆయన నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. ఆ సినిమా గురించి త్వరలో మాట్లాడుకుందాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని