Rashmika: నిర్మాతలు అడిగితే ఇదే చెబుతా: పారితోషికం పెంపు వార్తలపై రష్మిక

‘యానిమల్‌’ సినిమా విజయం తర్వాత రష్మిక రెమ్యునరేషన్‌ పెంచారంటూ వార్తలొచ్చాయి. వాటిపై ఆమె స్పందించారు. 

Updated : 06 Feb 2024 20:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాత్ర ఏదైనా తనదైన నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తారు నటి రష్మిక (Rashmika). ‘యానిమల్‌’తో ఇటీవల మరో విజయాన్ని అందుకున్నారామె. రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా సందీప్‌రెడ్డి వంగా రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. ఈ సక్సెస్‌ని దృష్టిలోపెట్టుకుని రష్మిక రెమ్యునరేషన్‌ పెంచారంటూ వార్తలొచ్చాయి. ఒక్కో సినిమాకు రూ.4 నుంచి రూ.4.5 కోట్లు తీసుకుంటున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. ఓ వెబ్‌ పోర్టల్‌ ఇదే విషయాన్ని తమ ‘ఎక్స్‌’ (ఇంతకుముందు ట్విటర్‌) ఖాతాలో పోస్ట్‌ చేసింది. దానిపై రష్మిక స్పందించారు.

‘‘రెమ్యునరేషన్‌ పెంచానని ఎవరు చెప్పారు? ఈ న్యూస్‌ చూసి నేను ఆశ్చర్యపోతున్నా. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలనుకుంటున్నా. పారితోషికం ఎందుకు పెంచారని తదుపరి సినిమాల నిర్మాతలు అడిగితే మీడియా అలానే చెప్పింది. వారి మాటలకు కట్టుబడి ఉండాలనుకుంటున్నా అని సమాధానమిస్తా’’ అని సరదాగా చెప్పారు. స్మైలీ ఎమోజీలు జోడించారు. ‘‘ఈ ఆర్టికల్‌ వెలువడకముందే ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ షూటింగ్‌ ప్రారంభమైనందుకు ఆనందంగా ఉంది’’ అంటూ నిర్మాత ఎస్‌.కె.ఎన్‌. కామెంట్‌ చేశారు. ఈ నాయికా ప్రాధాన్య చిత్రానికి రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆ సినిమా నిర్మాతల్లో ఎస్‌.కె.ఎన్‌. ఒకరు. సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న  ‘పుష్ప: ది రూల్’ (Pushpa: The Rule), ‘రెయిన్‌బో’ (తెలుగు), ‘ఛావా’ (హిందీ) సినిమాల్లోనూ ఆమె నటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని