SSMB 29: మహేశ్‌ బాబు సరసన ఇండోనేషియా నటి? ఇప్పుడిదే ట్రెండింగ్‌!

మహేశ్‌ బాబు హీరోగా రాజమౌళి ఓ సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హీరోయిన్‌ విషయమై ఊహాగానాలొచ్చాయి.

Published : 12 Feb 2024 02:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్టార్‌ హీరో, డైరెక్టర్‌ కలిసి సినిమా చేయబోతున్నారని తెలియడమే ఆలస్యం.. ప్రేక్షకులు అమితాసక్తి కనబరుస్తారు. ఆ చిత్ర నేపథ్యం, టైటిల్‌.. తదితర వివరాల కోసం ఆరా తీస్తుంటారు. ఈ క్రమంలో ఎన్నో ఊహాగానాలు తెరపైకి వస్తుంటాయి. మహేశ్‌బాబు (Mahesh Babu)- రాజమౌళి (Rajamouli) కాంబినేషన్‌ చిత్రంపై ముందు నుంచీ ఇదే వ్యవహారం సాగుతోంది. తాజాగా హీరోయిన్‌ అంశం నెట్టింట ట్రెండింగ్‌ అవుతోంది. పాన్‌ వరల్డ్‌ స్థాయిలో ఈ సినిమాని తెరకెక్కించనున్న రాజమౌళి.. దానికి తగ్గట్లు విదేశీ నటులనూ ఎంపిక చేసుకునే ఆలోచనలో ఉన్నారట. ఈ మేరకు ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌ ఇందులో హీరోయిన్‌గా నటించే అవకాశాలున్నాయని ప్రచారం ఊపందుకుంది. చెల్సియా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో రాజమౌళిని ఫాలో అవుతుండడంతో ఆ వార్తలకు బలం చేకూరినట్లైంది. ఇంతకుముందు బాలీవుడ్‌ హీరోయిన్‌ ఒకరు మహేశ్‌ సరసన నటించే ఛాన్స్‌ ఉందంటూ గాసిప్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే.

జకార్తాలో చదువు పూర్తి చేసిన చెల్సియా 2013లో హాలీవుడ్‌ ఫిల్మ్‌ ‘రిఫ్రైన్‌’తో తెరంగేట్రం చేసింది. తర్వాత ‘స్ట్రీట్‌ సొసైటీ’, ‘హెడ్‌షాట్‌’, ‘మే ది డెవిల్‌ టేక్‌ యు’ తదితర సినిమాలతో మంచి గుర్తింపు పొందింది. మరోవైపు, మార్వెల్‌ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ సంపాదించుకున్న క్రిస్‌ హెమ్స్‌వర్త్‌ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నారని కథనాలు వస్తున్నాయి. వీటిల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడాల్సిందే. ఈ సినిమాకు SSMB29 అనేది వర్కింగ్‌ టైటిల్‌. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని