MaheshBabu: హైదరాబాద్‌లో ల్యాండైన మహేశ్‌.. సూపర్‌ ప్రమోషన్స్‌ షురూ..!

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు నటించిన సరికొత్త చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్‌ షురూ....

Published : 05 May 2022 15:07 IST

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు నటించిన సరికొత్త చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్‌ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా మే 7న శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్‌ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అభిమానుల సమక్షంలో జరగనున్న ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎవరు పాల్గొననున్నారనే విషయాన్ని మాత్రం ఇంకా ప్రకటించలేదు. మరోవైపు ప్రమోషన్స్‌లో భాగంగా ట్విటర్‌లో ‘సర్కారువారి పాట’ ఎమోజీ విడుదలైంది. దీంతో ప్రస్తుతం #SarkaruVaariPaata #SVPMania #SVP.. ఈ మూడు హ్యాష్‌ట్యాగ్స్‌ ట్విటర్‌ ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్నాయి.

హైదరాబాద్‌కి మహేశ్‌..

‘సర్కారువారి పాట’ ప్రమోషన్స్‌, తదుపరి సినిమా షూటింగ్స్‌ని దృష్టిలో ఉంచుకుని.. మహేశ్‌ ఇటీవల వర్క్‌లైఫ్‌ నుంచి కాస్త బ్రేక్‌ తీసుకొన్నారు. కుటుంబంతో కలిసి ప్యారిస్‌కు వెళ్లి వచ్చారు. ఆ టూర్‌కు సంబంధించిన పలు ఫొటోలను ఆయన సతీమణి నమ్రత ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. అయితే, ప్యారిస్‌ టూర్‌ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో మహేశ్‌ పాల్గొంటారా? లేదా? అనే సందేహం అభిమానుల్లో వ్యక్తమవుతోన్న వేళ.. సూపర్‌స్టార్‌ తన పర్యాటన ముగించుకొని హైదరాబాద్‌లో ల్యాండ్‌ అయ్యారు. గురువారం ఉదయం ఆయన హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కుటుంబంతోపాటు కనిపించారు. ఈ ఫొటోలు చూసిన అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేస్తోన్నారు.

ఆ ముగ్గురేనా..?

‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ముఖ్య అతిథులుగా ఎవరు పాల్గొంటారనే విషయంలో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు స్టార్‌ హీరోల పేర్లు కూడా వినిపించాయి. ఈ క్రమంలోనే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం.. టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్స్‌ ఈ కార్యక్రమంలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ డైరెక్టర్స్‌ ఎవరంటే.. రాజమౌళి, త్రివిక్రమ్‌, పూరీ జగన్నాథ్‌. ఆయా దర్శకులతో మహేశ్‌కు మంచి స్నేహబంధం ఉందని, అందుకే వారు ముగ్గురూ ఈ స్టేజ్‌పై కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి, ఈ వార్తల్లో నిజమెంత తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని