Vamshi Paidipally: ‘వారసుడు’ పక్కా తమిళ చిత్రం.. మహేశ్‌ ఫుల్‌ హ్యాపీ: వంశీ పైడిపల్లి

ప్రభాస్‌, ఎన్టీఆర్‌, మహేశ్‌ బాబు వంటి టాలీవుడ్‌ స్టార్‌ హీరోలతో సినిమాలు చేసి దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్నారు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally). ప్రస్తుతం ఆయన కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌తో ‘వారిసు’ (Varisu) చేస్తోన్న విషయం తెలిసిందే. ఆ సినిమా విశేషాలు మీకోసం..

Updated : 27 Oct 2022 11:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దళపతి విజయ్‌ (Vijay) - వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘వారిసు’ (Varisu). దిల్‌ రాజు (Dil Raju) నిర్మాత. ఇదే చిత్రాన్ని ‘వారసుడు’ (Vaarasudu) పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో వంశీ పైడిపల్లి తొలిసారి కోలీవుడ్‌ మీడియాతో ముచ్చటించారు. ‘వారసుడు’ గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. 

ఎన్నో ప్రశ్నలు..!

‘‘నిర్మాత దిల్‌రాజ్‌ ఓసారి నా వద్దకు వచ్చి.. ‘మన దగ్గర కథ ఉంది కదా. విజయ్‌కు చెబుదాం’ అని అన్నారు. విజయ్ పేరు వినగానే షాకయ్యా. ప్రాజెక్ట్‌ ఓకే అవుతుందో? లేదో? తెలియదు కానీ ఆయన్ని ఒక్కసారైనా కలిసే అవకాశం వస్తుంది కదా అనుకున్నా. అలా కో-డైరెక్టర్‌ హరితో కలిసి చెన్నైకు వెళ్లా. అక్కడ ఫ్లైట్‌ దిగగానే నాకు కంగారు పెరిగింది. విజయ్‌కు నేను చెప్పే కథ నచ్చుతుందా?లేదా? ఇలా ఎన్నో ప్రశ్నలు నా మదిలో మెదిలాయి. ఎందుకంటే ఏ దర్శకుడికైనా ఇలాంటి అవకాశం ఎప్పుడో ఒక్కసారే వస్తుంది’’

చెమటలు పట్టేశాయి..!

‘‘విజయ్‌ ఇంటికి చేరుకోగానే మమ్మల్ని ఓ గదిలో కూర్చొమన్నారు. కొంతసేపటికి విజయ్‌ అక్కడికి వచ్చారు. ఆయన చాలా సింపుల్‌. కథ చెప్పడం మొదలుపెట్టగానే నాకు చెమటలు పట్టేశాయి. నా టెన్షన్‌ గమనించిన ఆయన.. రూమ్‌లో ఏసీ పెంచారు. సుమారు గంటపాటు కథ వివరించాను. ఆయన సైలెంట్‌గా వింటూ కూర్చొన్నారు. కథ పూర్తైన వెంటనే.. ‘సర్‌. ఇది కథ. ఇలా శుభం కార్డు పడుతుంది’ అని చెప్పాను. 30 సెకన్లు ఆయన ఏం మాట్లాడలేదు. దాంతో నేను విజయ్‌ని మాత్రమే కలవగలిగానని  ఫిక్స్‌ అయిపోయా. అనంతరం ఆయన నా వద్దకు వచ్చి ‘కథ చాలా బాగుంది. చేద్దాం’ అని చెప్పారు. ఆ క్షణం జీవితంలో ఎప్పటికీ ఓ మధురానుభూతిగానే ఉంటుంది. అలా మా ప్రయాణం మొదలైంది’’

ఇంత తక్కువ సమయంలో..!

‘‘విజయ్‌ని కలిసి బయటకు వచ్చాక.. అక్కడున్నవాళ్లతోనే ఒక్కటే చెప్పా. ‘ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు చెన్నైకు వచ్చా. రాత్రి 9 గంటలకు మళ్లీ హైదరాబాద్‌కు రిటర్న్‌ అయిపోతా. నాకు తెలిసి ఇంత తక్కువ సమయంలో చెన్నైలో ఇంత గొప్పగా ఎవరూ ఏం సాధించలేదు’ అంటూ నా ఆనందాన్ని  పంచుకున్నా’’

అన్నీ ఆరులోనే..!

‘‘ఇది నా ఆరో చిత్రం. విజయ్‌కు 66వ చిత్రం. షూటింగ్‌ కూడా ఏప్రిల్‌ ఆరునే మొదలైంది. అయితే, ఇది మేము అనుకుని చేసింది కాదు. అనుకోకుండా అన్నీ అలా జరిగిపోయాయి. క్రికెట్‌లో అత్యధిక రన్స్‌ సిక్స్‌. ఆ విధంగా చూసుకుంటే ఇదొక సెంటిమెంట్‌గా భావిస్తున్నాం. ఇక, దిల్‌ రాజు సినిమా హిట్‌ అయితే దాన్ని సిక్సర్‌ అనే అభివర్ణిస్తారు. దేవుడి దయ వల్ల ఈ సినిమా కూడా సిక్సర్‌ కొడుతుందని భావిస్తున్నా’’

అంతకు మించి..!

‘‘ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనరే అయినప్పటికీ.. అంతకు మించి ఉంటుంది. విజయ్‌ ఇమేజ్‌ని దృష్టిలో ఉంచుకుని ఫ్యాన్స్‌ ఎలాంటి సినిమాని కోరుకుంటున్నారో అలాంటి చిత్రాన్నే చేస్తున్నాం. చిన్నా పెద్దా అందరూ చూసే సినిమా ఇది’’

న్యాయం చేసేలా..!

‘‘సినిమా థీమ్‌కు న్యాయం చేసేలా టైటిల్‌ ఉండాలి. ఈ టైటిల్‌కు ఒక అర్థం ఉంది. సినిమా చూశాక ప్రేక్షకులకు అది తెలుస్తుంది. దిల్‌రాజు ఈ సినిమాపై ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నారు. కాబట్టి, కథ గురించి ఇప్పుడే ఏం చెప్పలేను’’ (నవ్వులు)

రష్మిక కల నెరవేరింది..!

‘‘హీరోయిన్‌ని కేవలం హీరోయిన్‌గానే చూడకూడదు. ఆమెని కూడా కథలో ఓ పాత్రగానే మనం చూడాలనేది నా ఉద్దేశం. వాళ్లు స్క్రీన్‌పై కాసేపే కనిపించినా వాళ్ల పాత్రకు ఏదో ఒక అర్థం ఉండేలా చూపించాలి. విజయ్‌తో ఇప్పటి వరకూ నటించన కథానాయికను మా ప్రాజెక్ట్‌లోకి తీసుకోవాలని అనుకున్నప్పుడు.. రష్మిక అయితే బెటర్‌ అనిపించింది. అలా ఆమెను ఓకే చేశాం. వాళ్లిద్దరి కెమిస్ట్రీ స్క్రీన్‌పై అదిరిపోతుంది. విజయ్‌కు ఆమె పెద్ద ఫ్యాన్‌. మూడేళ్ల క్రితం ఓసారి రష్మికను కలిసినప్పుడే ఆమె ఈ మాట చెప్పింది. ఇటీవల విజయ్‌-రష్మికలపై ఓ సాంగ్‌ షూట్‌ చేశాం. చిత్రీకరణ పూర్తైన వెంటనే ఆమె నా వద్దకు వచ్చి.. ‘విజయ్‌తో డ్యాన్స్‌ చేయాలనేది నా కల. ఈ రోజుతో నా కల నెరవేరింది’ అని ఆనందం వ్యక్తం చేసింది’’

ఇది పక్కా తమిళ చిత్రం..!

‘‘ఇది పక్కా తమిళ చిత్రం. మిగిలిన భాషల్లోకి డబ్‌ చేసి రిలీజ్‌ చేస్తాం. గతంలో భాషా పరమైన వ్యత్యాసాలు ఉండేవి. కానీ, కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ప్రేక్షకులు అన్ని భాషల చిత్రాలను ఆదరిస్తున్నారు’’

మహేశ్‌ ఫుల్‌ ఖుష్‌..!

‘‘మహేశ్‌ బాబు (MaheshBabu) నాకొక సోదరుడులాంటి వ్యక్తి. నేను విజయ్‌తో సినిమా చేస్తున్నానని తెలిసి మహేశ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ మధ్యే ఫోన్‌ చేసి తన సంతోషాన్ని పంచుకున్నారు. సినిమాతో మొదలైన మా బంధం.. ఇప్పుడు ఒకే కుటుంబం అన్నట్లు మారింది. ఇక, ఎన్టీఆర్ ‌(NTR) నాకంటే చిన్నవాడైనప్పటికీ నేను అన్నయ్య అని పిలుస్తుంటా. ‘బృందావనం’ ఓకే చేసి ఆయన నాకెంతో సాయం చేశారు. ఆయనపై నాకెప్పటికీ ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది’’ అని వంశీ పైడిపల్లి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని