ఘనంగా వంగూరి ఫౌండేషన్‌ 178వ ‘నెలనెలా తెలుగు వెన్నెల’ ఈవెంట్‌

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో 178 వ ‘నెలనెలా తెలుగు వెన్నెల’ సాహిత్య కార్యక్రమంగా ‘రాధిక మంగిపూడి రచనలపై సమీక్షా ప్రసంగాలు’ ఈవెంట్‌ మంగళవారం సాయంత్రం జరిగింది. 

Published : 10 Jan 2024 23:22 IST

హైదరాబాద్‌: వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో 178 వ ‘నెలనెలా తెలుగు వెన్నెల’ సాహిత్య కార్యక్రమంగా ‘రాధిక మంగిపూడి రచనలపై సమీక్షా ప్రసంగాలు’ ఈవెంట్‌ మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమం ప్రధాన నిర్వాహకులు, వంగూరి ఫౌండేషన్ (ఇండియా) మేనేజింగ్ ట్రస్టీ, డా. వంశీ రామరాజు మాట్లాడుతూ.. ‘వంగూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా ప్రతి నెల నిర్వహించే సాహిత్య కార్యక్రమాల్లో భాగంగా 178వ కార్యక్రమంగా సింగపూర్ నుంచి తొలి రచయిత్రిగా పేరుపొందిన రాధిక మంగిపూడి రచించిన 5 పుస్తకాలపై ప్రత్యేక సమీక్షా ప్రసంగాలను ఏర్పాటు చేశాం. విశిష్ట అతిథులుగా విచ్చేసిన ప్రఖ్యాత రచయితలు, రచయిత్రులు సమీక్ష చేయడం మా సంస్థకు ఎంతో ఆనందంగా ఉంది’’ అన్నారు. 

ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రముఖ సాహితీవేత్త డా. కొలకలూరి ఇనాక్ విచ్చేసి రాధిక రచనల్ని అభినందించారు. పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ విశ్రాంత రిజిస్ట్రార్ ఆచార్య టి. గౌరీశంకర్ ‘భారతీయ తత్త్వ శతకం’ అనే పద్య శతకం గురించి, ప్రముఖ సినీకవి డా. వడ్డేపల్లి కృష్ణ - ‘నవ కవితా కదంబం’ అనే కవితా సంపుటి గురించి, హాస్యబ్రహ్మ డా. శంకర నారాయణ - ‘అలా సింగపురంలో’ అనే కథా సంపుటి గురించి, ప్రముఖ రచయిత్రి డా. తిరునగిరి దేవకీదేవి - ‘మరో మాయాబజార్’ కథా సంపుటి గురించి, ప్రముఖ రచయిత్రి డా. కేతవరపు రాజ్యశ్రీ ‘భావతరంగాలు’ అనే కవితా సంపుటి గురించి అద్భుతమైన సమీక్షలు అందించి రాధికను ఆశీర్వదించారు. 

ఈ సందర్భంగా రాధిక మంగిపూడి మాట్లాడుతూ.. తన రచనలను వంగూరి ఫౌండేషన్‌ ఆది నుంచి ప్రోత్సహించిందన్నారు. ఈ కార్యక్రమంలో తన రచనల్ని ఎంపిక చేయడం, ఆచార్య ఇనాక్ వంటి పెద్దలు, ప్రముఖ రచయితలు సాహితీవేత్తలు ఈ వేదికపై ఆశీర్వదించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు డా.వంగూరి చిట్టెన్ రాజు, వంశీ రామరాజుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సింగపూర్ శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్, పలు దేశాలకు చెందిన తెలుగు సంస్థల ప్రతినిధులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి వంగూరి ఫౌండేషన్ (ఇండియా) ట్రస్టీ శైలజా సుంకరపల్లి నిర్వహణ బాధ్యతలు తీసుకోగా, మునమర్తి కృష్ణవేణి సభా వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని