Andhra News: జగన్‌ నిర్ణయాన్ని ఎందుకు స్వాగతించకూడదు?: మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

పెట్టుబడులు రాబట్టడంలో ఏపీ 5వ స్థానంలో ఉందని ఏపీ సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. దేశవ్యాప్తంగా రూ.1.71 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తే అందులో అత్యధిక పెట్టుబడులు ఏపీకే వచ్చాయి.

Updated : 13 Feb 2023 16:57 IST

అమరావతి: పారిశ్రామికంగా దేశంలోనే అత్యధిక పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్‌ ఆకర్షిస్తోందని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. రాష్ట్ర జీఎస్‌డీపీ 11.34 శాతంగా ఉందని.. జాతీయ సగటుతో పోలిస్తే ఏపీ చాలా ముందుందన్నారు. తలసరి ఆదాయం కూడా 38.5 శాతం మేరకు పెరిగిందని చెప్పారు. కొందరు రాష్ట్ర వృద్ధి తిరోగమనంలో ఉందని ప్రచారం చేస్తున్నారని.. అది దుష్ప్రచారం మాత్రమేనని మంత్రి స్పష్టం చేశారు.

‘‘2022 జూలై నాటికి ఏపీకి రూ. 40,361 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దేశవ్యాప్తంగా రూ.1.71 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తే అందులో అత్యధిక పెట్టుబడులు ఏపీకే వచ్చాయి. ఈ మేరకు రూ.23,985 కోట్లకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపింది. పెట్టుబడులు రాబట్టడంలో ఏపీ 5వ స్థానంలో ఉంది. అలయన్స్ టైర్స్ సంస్థ విశాఖలో రూ.1,040 కోట్ల పెట్టుబడితో ఉత్పత్తిని ప్రారంభించడానికి ముందుకు వచ్చింది. రాష్ట్ర పారిశ్రామిక విధానానికి ఆకర్షితులై దేశీయ, విదేశీ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఈజ్‌ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లోనూ ఏపీ అగ్రస్థానంలో ఉంది. బల్క్ డ్రగ్ పార్కు కోసం రూ.1000 కోట్ల గ్రాంట్ ఏపీ సాధించింది.

‘‘రాజధానిని చూసి ఎవరూ పెట్టుబడులు పెట్టరు. ప్రభుత్వ పరిపాలన చూసే పెట్టుబడులు వస్తాయి. రాజధానికి.. పెట్టుబడులకు ఎలాంటి సంబంధం లేదు. గతంలో దావోస్‌కు వెళ్లి తెదేపా రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు తెచ్చిందో చెప్పాలి. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పట్టించుకోకుండా తెదేపా అధినేత చంద్రబాబు పెట్టిన రాజధానిని ఎలా ఆమోదిస్తాం. స్వల్ప పెట్టుబడులతోనూ విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతుంది. సీఎం జగన్ పరిపాలనా రాజధానిగానే విశాఖను ప్రకటించారు. మూడు ప్రాంతాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే సీఎం ఈ ప్రకటన చేశారు. జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు స్వాగతించకూడదు?’’ అని మంత్రి ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని