Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్‌.. ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు

స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు అరెస్ట్‌ నేపథ్యంలో విజయవాడలోని ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి.

Updated : 10 Sep 2023 15:10 IST

విజయవాడ: స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు అరెస్ట్‌ నేపథ్యంలో విజయవాడలోని ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. కాసేపట్లో న్యాయమూర్తి తీర్పు వెలువరించనున్నారు. చంద్రబాబు అరెస్ట్‌పై వాదనలు సుదీర్ఘంగా కొనసాగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఉదయం 8 గంటలకు తర్వాత ప్రారంభమైన వాదనలు.. మధ్యాహ్నం 2.30 గంటల వరకు కొనసాగాయి. ఈ కేసులో కోర్టుకు సీఐడీ సమర్పించిన రిమాండ్‌ రిపోర్టుపై ఇరుపక్షాలు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. 

సిద్ధార్థ లూథ్రా, అదనపు ఏజీ పొన్నవోలు ఏమని వాదించారంటే..

ఈ కేసులో 409 సెక్షన్‌ పెట్టడం సబబు కాదని.. ఆ సెక్షన్‌ పెట్టాలంటే ముందు సరైన సాక్ష్యం చూపాలని సిద్ధార్థ లూథ్రా తన వాదనలు వినిపించారు. రిమాండ్‌ రిపోర్టు తిరస్కరించాలంటూ నోటీసు ఇచ్చారు. దీంతో తిరస్కరణ వాదనలకు న్యాయమూర్తి అవకాశం కల్పించారు. కేసులో చంద్రబాబు పాత్రపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా? అని సీఐడీని న్యాయమూర్తి ప్రశ్నించారు. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. శనివారం ఉదయం 6 గంటలకే చంద్రబాబును అరెస్ట్ చేశామని.. 24 గంటల్లోపు కోర్టులో ప్రవేశపెట్టామని చెప్పారు. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్‌ చేశామన్నారు. 

చంద్రబాబును ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని.. ఆయన హక్కులకు భంగం కలిగించేలా సీఐడీ పోలీసులు వ్యవహరించారని సిద్ధార్థ లూథ్రా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గవర్నర్‌ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్ట్‌ చేశారని చెప్పారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సీఐడీ అధికారుల ఫోన్‌ సంభాషణలను కోర్టుకు సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. 

ఈ క్రమంలో సీఐడీకి న్యాయస్థానం పలు ప్రశ్నలు సంధించింది. 2021లో కేసు పెడితే ఇప్పటి వరకు చంద్రబాబును ఎందుకు అరెస్ట్‌ చేయలేదని ప్రశ్నించింది. ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరును ఎందుకు చేర్చలేదని కోర్టు ప్రశ్నించగా.. రిమాండ్‌ రిపోర్ట్‌లో అన్ని అంశాలు చేర్చామని అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డికి తెలిపారు. ఈ క్రమంలో 409 సెక్షన్‌పై ఏసీబీ కోర్టులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. మధ్యలో న్యాయమూర్తి పలుమార్లు విరామం ఇచ్చారు. సుమారు గంటపాటు భోజన విరామం అనంతరం తిరిగి మధ్యాహ్నం 1.45 గంటల ప్రాంతంలో వాదనలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత సుమారు మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో వాదనలు ముగిశాయి. ఉదయం నుంచి  సుమారు 6.30 గంటల పాటు ఈ వాదనలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని