Andhra News: ఎంపీ రఘురామను ఎందుకు సస్పెండ్ చేయలేదు?: కొత్తపల్లి సుబ్బారాయుడు

తాను వైకాపాను చిన్న మాట కూడా అనలేదని.. తప్పు చేయకుండా వేటు వేయడం ఎంతవరకు సమంజసమని వైకాపా నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రశ్నించారు.

Updated : 02 Jun 2022 17:55 IST

నరసాపురం: తాను వైకాపాను చిన్న మాట కూడా అనలేదని.. తప్పు చేయకుండా వేటు వేయడం ఎంతవరకు సమంజసమని వైకాపా నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రశ్నించారు. సుబ్బారాయుడిపై సస్పెన్షన్‌ వేటు పడిన విషయం తెలిసిందే. పార్టీ క్రమశిక్షణా కమిటీ, సీఎం జగన్‌ ఆదేశాల మేరకు సుబ్బారాయుడును సస్పెండ్‌ చేసినట్టు బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. నరసాపురంలో సుబ్బారాయుడు మీడియాతో మాట్లాడుతూ.. తన సస్పెన్షన్‌పై స్పందించారు. తనపై వేటు వేసిన పార్టీ.. ఎంపీ రఘురామను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇలా సస్పెండ్ చేయడం దారుణమన్నారు. సస్పెన్షన్‌ కారణాలను సాయంత్రంలోగా చెప్పాలని డిమాండ్ చేశారు. సరైన కారణం లేకుండా సస్పెండ్ చేస్తే చట్టపరంగా పోరాడతానని సుబ్బారాయుడు స్పష్టం చేశారు.

స్థానిక ఎమ్మెల్యేతో విభేదాలే కారణమా?

2024 అసెంబ్లీ ఎన్నికల్లో తాను నరసాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రకటించారు. నరసాపురంలోని తన నివాసంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ... పార్టీ గుర్తు ఉన్నా, లేకపోయినా విజయం సాధిస్తానన్నారు. రాజకీయ ప్రస్థానం ప్రారంభం నుంచి 2019లో తప్ప..  అన్ని సార్లు పోటీలో ఉన్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని వర్గాలు, పార్టీల్లో తనకంటూ ప్రత్యేక ఓటు బ్యాంకు ఉందన్నారు. కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసినప్పుడు కూడా సొంత బలం ఆధారంగానే గెలిచానన్నారు. సుదీర్ఘకాలం ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా, ఇతర పార్టీలకు మద్దతుగా ఉంటారనే సందేహం ప్రజల్లో నెలకొందని, దీనిపై స్పష్టత ఇచ్చేందుకు సమావేశం ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. నరసాపురాన్ని జిల్లా కేంద్రం చేయాలని శాంతియుతంగా ఉద్యమం చేసిన తనపై ఏ1గా కేసు పెట్టడం దురదృష్టకరమన్నారు. కేసులు గురించి పట్టించుకోనని, ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలపై పోరాడతానని వెల్లడించారు.

నరసాపురం జిల్లా కేంద్రం సాధనలో వైకాపా ఎమ్మెల్యే ప్రసాదరాజు విఫలమయ్యారని మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ప్రసాదరాజును ఎమ్మెల్యేగా గెలిపించేందుకు ముఖ్యభూమిక పోషించి ఇప్పుడు బాధపడుతున్నానంటూ జిల్లా సాధనకోసం ఇటీవల జరిగిన ఉద్యమంలో తనను తాను చెప్పుతో కొట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. సుబ్బారాయుడు తీరుపై అప్పటి నుంచి వైకాపా అగ్రనాయకత్వం గుర్రుగా ఉంది. ఈ ఘటనపై వైకాపా సీనియర్‌ నేత పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలు మారినప్పుడల్లా సుబ్బారాయుడు చెప్పులతో కొట్టుకుంటున్నారని విమర్శించారు. పార్టీలో క్రమశిక్షణారాహిత్యాన్ని ఉపేక్షించబోమని హెచ్చరించారు. ప్రసాదరాజును రాజకీయంగా పతనం చేసేందుకే కొత్తపల్లి సుబ్బారాయుడు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. మీడియా సమావేశంలో సబ్బారాయుడు చేసిన ప్రకటనతో వైకాపా అధిష్ఠానం సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని