IND vs AUS: ఆ ఇద్దరిని ఎందుకు ఎంపిక చేయలేదు.. సెలక్టర్లను ప్రశ్నించిన శశి థరూర్‌

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ ఆడనున్న భారత జట్టులో ఫామ్‌లో ఉన్న కొందరి ఆటగాళ్లకు స్థానం లభించకపోవడంపై కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ అసహనం వ్యక్తం చేశారు. ఎంపికపై సెలెక్టర్లు వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Published : 23 Nov 2023 12:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఓటమి చవిచూసిన భారత్‌.. ఈ సారి ద్వైపాక్షిక సిరీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. నేటి నుంచి ప్రారంభమవుతున్న టీ20 సిరీస్‌కు భారత్‌ జట్టు సిద్ధమైంది. ఇప్పటికే జట్టును బీసీసీఐ (BCCI) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సారి సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యం వహిస్తున్నాడు. అయితే, ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్‌ (Sanju Samson), యుజ్వేంద్ర చాహల్‌ (yuzvendra chahal)కు ఈ సారి కూడా సెలెక్టర్లు మొండి చేయి చూపడంపై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

జట్టులో వీరి పేర్లు లేకపోవడంపై కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ (Shashi Tharoor) ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా శాంసన్‌, చాహల్‌లను ఎంపిక చేయకపోవడానికి గల కారణాలను వెల్లడించాలని సెలెక్టర్లను డిమాండ్‌ చేశారు. దీనిపై అభిమానులకు వివరణ ఇవ్వాలన్నారు.

ఆసీస్‌తో టీ20 సిరీస్‌... టీమ్‌ ఇండియా మీ ఫైనల్‌ XI ఏంటి?

‘‘ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్‌, యుజ్వేంద్ర చాహల్‌ను ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్‌ జట్టుకు ఎంపిక చేయలేదు. ఐపీఎల్‌లో రాజస్థాన్‌రాయల్స్‌ జట్టుకు శాంసన్‌ చక్కగా సారథ్యం వహించాడు. ఈ సారి చాలా మంది సీనియర్లు జట్టులో లేరు.. కాబట్టి జట్టును అతడు సమర్థంగా నడిపించగలడు. సెలెక్టర్లు వీరిద్దరినీ ఎందుకు ఎంపిక చేయలేదో క్రికెట్‌ అభిమానులకు కచ్చితంగా వివరణ ఇవ్వాలి’’ అని ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా పోస్టు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని