Year Ender 2022: ఈ ఏడాదిలో విడుదలైన బెస్ట్‌ ఫోన్స్‌!

ఏటా విడులైనట్లుగా 2022లో కూడా అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో కొత్త ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. వాటిలో వినియోగదారులను విశేషంగా ఆకట్టుకున్న ఫోన్ల జాబితా ఇదే. 

Updated : 27 Dec 2022 12:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లాక్‌డౌన్‌ కాలంలో ఆన్‌లైన్‌ క్లాసులు, ఆఫీస్‌ వర్క్‌ అంటూ పెరిగిన మొబైల్‌ వినియోగం.. ప్రస్తుతం ఇంకా ఎక్కువైంది. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్‌ నివేదిక ప్రకారం ఈ ఏడాది రెండో త్రైమాసికంలో భారత్‌లోకి 37 మిలియన్ల స్మార్ట్‌ఫోన్లు దిగుమతి అయ్యాయంటే.. దేశంలో స్మార్ట్‌ఫోన్‌ వినియోగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏటా విడులైనట్లుగా 2022లో కూడా అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో కొత్త ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. వాటిలో కొన్నింటిని వినియోగదారులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మరోవైపు యూజర్లను ఎంతోకాలంగా ఊరించిన 5జీ నెట్‌వర్క్ దేశంలో అందుబాటులోకి వచ్చేసింది. అంతకుముందే మొబైల్ కంపెనీలు 5జీని సపోర్ట్ చేసే ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తుండటం కలిసివచ్చింది. మరి, 2022 విడుదలైన (Year Ender 2022) వాటిలో యూజర్లను అమితంగా ఆకట్టుకున్న ఫోన్ల జాబితాపై ఓ లుక్కేద్దాం.  


1. ఐఫోన్‌ 14 (iPhone 14)

యాపిల్ కంపెనీ ఈ ఏడాది సెప్టెంబరులో ఐఫోన్‌ 14 సిరీస్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. నాలుగు వేరియంట్లలో విడుదలైన ఈ ఫోన్‌ను కొనేందుకు భారత్‌ సహా విదేశాల్లో యూజర్లు అమితాసక్తి చూపారు. ఐఫోన్‌ 14, ఐఫోన్ 14 ప్లస్‌ ఫోన్లలో ఏ 15 బయోనిక్‌ చిప్‌ను, ఐఫోన్‌ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ మోడల్స్‌లో ఏ16 బయోనిక్‌ చిప్‌ను ఉపయోగించారు. బేస్‌ వేరియంట్లలో 12 మెగాపిక్సెల్‌ కెమెరాలను అమర్చితే, ప్రో వేరియంట్లలో డైనమిక్‌ ఐలాండ్‌ ఫీచర్‌తో 48 ఎంపీ కెమెరాను అమర్చారు. భారత మార్కెట్లో బేస్‌ వేరియంట్ ఐఫోన్ 14 ధర ప్రారంభ ధర ₹ 79,900 కాగా,  హైఎండ్ వేరియంట్‌ ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్‌ ప్రారంభ ధర ₹ 1,39,900.


2. గూగుల్ పిక్సెల్‌ 7 (Googel Pixel 7)

చాలాకాలం తర్వాత గూగుల్ కంపెనీ పిక్సెల్‌ 7 సిరీస్‌ ఫోన్లతో భారత్‌ మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చింది. అక్టోబరులో పిక్సెల్‌ 7, పిక్సెల్‌ 7 ప్రో పేరుతో రెండు మోడల్స్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్లలో టెన్సర్‌ జీ2 సెకండ్‌ జనరేషన్‌ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. పిక్సెల్‌ 7లో 6.3 అంగుళాలు, పిక్సెల్‌ 7ప్రోలో 6.7 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను అమర్చారు. ఫోన్ వెనుకవైపు 50 ఎంపీ, 12 ఎంపీ, 48 ఎంపీ కెమెరాలతోపాటు, ముందుభాగంలో 12 ఎంపీ కెమెరాలు ఉన్నాయి. వీటి ప్రారంభ ధర 59,999గా కంపెనీ నిర్ణయించింది. 


3. శాంసంగ్‌ గెలాక్సీ జెడ్‌ సిరీస్‌ (Samsung Galaxy Z Fold 4 and Galaxy Z Flip 4)

ఈ ఏడాది శాంసంగ్ విడదల చేసిన వాటిలో రెండు ఫోల్డింగ్‌ ఫోన్లు ప్రత్యేకం. గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 4, గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌ 4 పేరుతో అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో వీటిని పరిచయం చేసింది. ఈ ఫోన్లలో స్నాప్‌డ్రాగన్‌ 8 ప్లస్‌ జెన్‌ వన్‌ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 

జెడ్‌ ఫోల్డ్ 4 మొబైల్‌ను అన్‌ఫోల్డ్ చేస్తే 7.6 అంగుళాల డైనమిక్ అమోలెడ్ డిస్‌ప్లే, ఫోన్‌ను మడతబెట్టినప్పుడు 6.2 అంగుళాల కవర్‌స్క్రీన్‌ డిస్‌ప్లే ఉంటుంది. వెనుక 50 ఎంపీ, 12 ఎంపీ, 10 ఎంపీ కెమెరాలతోపాటు, ముందు 10 ఎంపీ కెమెరా, తెరిచినప్పుడు 4 ఎంపీ అండర్‌డిస్‌ప్లే కెమెరా ఇస్తున్నారు. ఈ ఫోన్‌ ప్రారంభ ధర ₹ 1,42,000. 

గెలాక్సీ జెడ్‌ 4 ఫ్లిప్‌లో 6.7 అంగుళాల హెచ్‌డీ+ డైనమిక్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఫోన్‌ను మడతబెట్టినప్పుడు నోటిఫికేష్లను చూసేందుకు 1.9 అంగుళాల అమోలెడ్‌ కవర్‌ స్క్రీన్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. వెనుకవైపు రెండు 12 ఎంపీ కెమెరాలు, ముందు 10 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. మూడు వేరియంట్లలో లభిస్తున్న ఈ ఫోన్  ప్రారంభ ధర ₹ 80,000. 


4. నథింగ్ ఫోన్‌ వన్‌ (Nothing Phone (1))

ఈ ఏడాది టెక్‌ ప్రపంచాన్ని అమితంగా ఆకర్షించిన మోడల్స్‌లో నథింగ్‌ ఫోన్‌ వన్‌ ముందు వరుసలో ఉంటుంది. ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌తో విడుదలైన ఈ ఫోన్‌లో బ్యాక్‌ ప్యానెల్‌లోని ఎల్‌ఈడీ లైట్లు ఫోన్‌కు ప్రత్యేక ఆకర్షణ. నోటిఫికేషన్లు, అలర్ట్ మెసేజ్‌లు, కాల్స్‌ వచ్చినప్పుడు యూజర్‌ సెట్టింగ్స్‌కు అనుగుణంగా వెనుక లైట్లు వెలుగుతాయి. ఇందులో 6.55 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 5 కూడా ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 778జీ+ ప్రాసెసర్‌ ఉపయోగించారు. వెనుకవైపు రెండు 50 ఎంపీ కెమెరాలు, ముందుభాగంలో 16 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. భారత మార్కెట్లో ఈ ఫోన్ ప్రారంభ ధర ₹ 29,999. 


5. షావోమి 12ఎస్‌ ప్రో (Xiaomi 12S Pro)

షావోమి 2022లో విడుదల చేసిన అన్ని మోడల్స్‌లోకి ఈ మోడల్‌ ప్రత్యేకంగా నిలిచింది. ఇందులో వెనుకవైపు మూడు 50 ఎంపీ కెమెరాలతోపాటు, ముందు 32 ఎంపీ ఇన్‌డిస్‌ప్లే కెమెరా అమర్చారు. 6.73 అంగుళాల 2k ప్లస్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ వన్‌ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. రెండు వేరియంట్లలో లభిస్తోన్న ఈ ఫోన్‌ ధర ₹ 59,999. 


6. వన్‌ప్లస్ నార్డ్‌ 2టీ (Oneplus Nord 2T)

ఈ ఫోన్‌లో  6.43 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ప్లస్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. మీడియాటెక్‌ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ఫోన్‌లో వెనుక వైపు సోనీ సెన్సర్లతో  50 ఎంపీ కెమెరా, 8 ఎంపీ, 2  ఎంపీ కెమెరాలు ఉన్నాయి. ముందు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. రెండు వేరియంట్లలో లభిస్తోన్న ఈ ఫోన్ ధర ₹ 28,999. 


7. ఐకూ 9టీ 5జీ (iQOO 9T 5G)

ఈ మోడల్‌ను లెజెండ్‌, అల్ఫా అనే రెండు వేరియంట్లలో ఐకూ విడుదల చేసింది. బీఎండబ్ల్యూ మోటార్‌స్పోర్ట్‌తో కలిసి ఐకూ ఈ ఫోన్‌ను డిజైన్‌ చేసింది. 6.7 అంగుళాల ఈ5 అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్‌ 8 ప్లస్ జెన్‌ 1 ప్రాసెసర్‌ ఉపయోగించారు. గేమింగ్‌, ఫొటోగ్రఫీ కోసం అదనంగా వీ1ప్లస్‌ చిప్‌ను అమర్చారు. 20 నిమిషాల్లో వంద శాతం ఛార్జింగ్‌ కావడం ఈ ఫోన్ ప్రత్యేకత. వెనుక 50 ఎంపీ, 13 ఎంపీ, 12 ఎంపీ కెమెరాలతోపాటు, ముందువైపు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. ఈ ఫోన్ ప్రారంభ ధర ₹ 45,999.


8. వివో ఎక్స్‌80 ప్రో (Vivo X80 Pro)

ఈ ఫోన్‌లో జైసిస్‌ లెన్స్‌తో 50 ఎంపీ, 48 ఎంపీ, 12 ఎంపీ, 8 ఎంపీ కెమెరాలు ఇస్తున్నారు. ముందువైపు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్ 1 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. గేమింగ్‌, ఫొటోగ్రఫీ కోసం అదనంగా వీ1ప్లస్‌ చిప్‌ను అమర్చారు. 6.78 అంగుళాల ఎల్‌టీపీవో అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. 12 జీబీ ర్యామ్‌/256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌లో లభిస్తోన్న ఈ ఫోన్ ధర ₹ 79,999.  


9. ఒప్పో రెనో 8 ప్రో (Oppo Reno 8 Pro)

రెనో 8 ప్రోలో 6.7 అగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. వెనుక 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 8 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలతోపాటు ముందు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 12 జీబీ ర్యామ్‌/256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 45,999.


10. రియల్‌మీ 9ప్రో+ (Realme 9pro+)

ఈ ఫోన్‌లో 16 ఎంపీ ఇన్‌డిస్‌ప్లే సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. వెనుక 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 8 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలు అమర్చారు. 6.4 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 920 5జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. రెండు వేరియంట్లలో లభిస్తోన్న ఈ ఫోన్ ప్రారంభ ధర ₹ 24,999. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని