బ్యాటరీ నిండుకుంటోందా?

అధునాతన స్మార్ట్‌ఫోన్లలో ఎన్నో ఫీచర్లు. ఎన్నెన్నో యాప్‌లు. ఇవన్నీ ఫోన్‌ బ్యాటరీని వాడుకునేవే. దీంతో బ్యాటరీ త్వరగా నిండుకుంటుంది. కొన్నిసార్లు అత్యవసర సమయాల్లో వాడుకోవటానికీ వీలుండకపోవచ్చు.

Updated : 07 Dec 2022 06:16 IST

అధునాతన స్మార్ట్‌ఫోన్లలో ఎన్నో ఫీచర్లు. ఎన్నెన్నో యాప్‌లు. ఇవన్నీ ఫోన్‌ బ్యాటరీని వాడుకునేవే. దీంతో బ్యాటరీ త్వరగా నిండుకుంటుంది. కొన్నిసార్లు అత్యవసర సమయాల్లో వాడుకోవటానికీ వీలుండకపోవచ్చు. అందుకే మాటిమాటికి ఛార్జ్‌ చేయాల్సి వస్తుంటుంది. మరి ఆండ్రాయిడ్‌ ఫోన్‌ బ్యాటరీ త్వరగా ఖాళీ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

స్క్రీన్‌ వెలుగు సర్దుబాటు

ఫోన్‌ తెర బాగా వెలిగితే స్పష్టంగా కనిపిస్తుంది. అందుకేనేమో కొందరు బ్రైట్‌నెస్‌ ఎక్కువగా సెట్‌ చేసుకుంటారు. కానీ ఇది బ్యాటరీని బాగా వాడుకుంటుంది. కాబట్టి సరి చేసుకోవటం మంచిది. బ్రైట్‌నెస్‌ తగ్గించుకోవటానికి చాలామంది చేసే పని ‘ఆటో’ మోడ్‌లో పెట్టుకోవటం దీంతో చుట్టుపక్కల పరిసరాలకు తగినట్టుగా తెర ప్రకాశం మారి పోతుంది. ఇది సౌకర్యంగానే ఉన్నప్పటికీ బ్యాటరీని ఎక్కువగా వాడుకుంటుంది. నిజంగా బ్యాటరీ త్వరగా నిండుకోకుండా చూసుకోవాలని అనుకుంటే అన్నింటికన్నా మంచి పద్ధతి స్క్రీన్‌ బ్రైట్‌నెస్‌ను తగ్గించుకోవటం. ఎందుకంటే డిస్‌ప్లే బ్యాటరీని ఎక్కువగా వాడుకుంటుంది. బ్రైట్‌నెస్‌ను తగ్గిస్తే బ్యాటరీ ఎక్కువసేపు వస్తుంది.

అనవసర ఫీచర్లు ఆఫ్‌

ప్రస్తుతం ఫోన్లలో ఎల్‌టీఈ, జీపీఎస్‌, వై-ఫై, బ్లూటూత్‌ వంటి ఫీచర్లెన్నో ఉంటున్నాయి. నిజానికి ఇవన్నీ నిరంతరం అవసరం లేదు. అన్నింటినీ ఒకేసారి వాడుకోం కూడా. కాబట్టి అవసరం లేని సమయాల్లో ఇలాంటి ఫీచర్లను ఆఫ్‌ చేసుకోవాలి. ప్రధానంగా చెప్పుకోవాల్సింది వై-ఫై గురించి. చాలామంది దీన్ని ఎప్పుడూ ఆన్‌లోనే ఉంచు కుంటారు. వైఫై నెట్‌వర్క్‌కి కనెక్ట్‌ కానప్పుడు ఫోన్‌ దాని కోసం వెతుకుతూనే ఉంటుంది. ఈ క్రమంలో బ్యాటరీనీ వాడుకుంటుంది. అందువల్ల వైఫైని వాడుకోని చోట్ల దీన్ని ఆఫ్‌ చేసుకోవటం మంచిది. బ్లూటూత్‌ హెడ్‌సెట్‌ని వాడుకుంటున్నప్పుడంటే సరే. వాడుకోనప్పుడు మాత్రం బ్లూటూత్‌ ఆప్షన్‌ను ఆపెయ్యాలి. అలాగే నావిగేషన్‌ ఫీచర్‌ జీపీఎస్‌ను కూడా అవసరం లేనప్పుడు ఆఫ్‌ చేసుకోవాలి.

* యాప్స్‌కు లొకేషన్‌ యాక్సెస్‌ను పరిమితం చేసుకోవటమూ మంచి మార్గమే. దీంతో అవి బ్యాక్‌గ్రౌండ్‌లో లొకేషన్‌ కోసం వెతకటం ఆపేస్తాయి. బ్యాటరీ ఆదా అవుతుంది.

బ్యాక్‌గ్రౌండ్‌ యాప్స్‌ క్లోజ్‌

బ్యాక్‌ లేదా హోం బటన్లతో యాప్స్‌ను క్లోజ్‌ చేస్తే చాలదు. అవి బ్యాక్‌గ్రౌండ్‌లో ఇంకా పనిచేస్తూనే ఉండొచ్చు. బ్యాటరీని ఖాళీ చేస్తూనే ఉండొచ్చు. ఫోన్‌ రీసెంట్‌లోకి వెళ్లి బ్యాక్‌గ్రౌండ్‌ యాప్స్‌ను క్లోజ్‌ చేయటం మంచిది. అప్పుడే అవి బ్యాక్‌గ్రౌండ్‌లో రన్‌ అవటం ఆగుతుంది. బ్యాటరీ మన్నిక పెరుగుతుంది.

ఫ్యాన్సీ విడ్జెట్లు పక్కకు

లైవ్‌ వాల్‌పేపర్లు, కదలికను పసిగట్టే వాల్‌పేపర్లు, వాతావరణాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసే వెదర్‌ విడ్జెట్‌, నిరంతరం వార్తలను చేరవేసే న్యూస్‌ విడ్జెట్ల వంటివి ఎవరికి ఇష్టముండదు. ఇవి ఫోన్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దటంతో పాటు రోజువారీ పనుల్లోనూ బాగా సహకరిస్తాయి. కానీ మనకు తెలియకుండానే బోలెడంత బ్యాటరీని వాడుకుంటాయి. పవర్‌ ఎక్కువసేపు రావాలంటే ఇలాంటి ఫీచర్లను పక్కనపెట్టాల్సిందే. కావాలంటే ఆండ్రాయిడ్‌ పరికరాన్ని బ్యాటరీ సేవ్‌ మోడ్‌లోనూ పెట్టుకోవచ్చు. దీంతో అవాంఛిత యానిమేషన్లు, గ్రాఫిక్స్‌తో పాటు వైబ్రేషన్‌, సౌండ్‌ వంటి హ్యాప్టిక్‌ ఫీడ్‌బ్యాక్‌ ఫీచర్లు సైతం డిసేబుల్‌ అవుతాయి. అనవసరంగా బ్యాటరీ ఖాళీ కావటం ఆగుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు