పెట్రోలియం గుర్తించేందుకు ఐఐటీ మద్రాస్‌ కొత్త విధానం

పెట్రోలియం, హైడ్రోకార్బన్‌ నిక్షేపాలను గుర్తించటానికి ఐఐటీ మద్రాస్‌ పరిశోధకులు వినూత్న గణాంక పద్ధతిని రూపొందించారు. ఇది భూగర్భంలోని రాళ్ల నిర్మాణాలను విశ్లేషించి కచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది

Updated : 15 Feb 2023 06:10 IST

పెట్రోలియం, హైడ్రోకార్బన్‌ నిక్షేపాలను గుర్తించటానికి ఐఐటీ మద్రాస్‌ పరిశోధకులు వినూత్న గణాంక పద్ధతిని రూపొందించారు. ఇది భూగర్భంలోని రాళ్ల నిర్మాణాలను విశ్లేషించి కచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది. దీని ద్వారా ఎగువ అస్సాంలోని టిపమ్‌ ఫార్మేషన్‌లో హైడ్రోజన్‌ సంతృప్తీకరణ ప్రాంతాలను, వివిధ రకాల రాళ్ల విసృతిని విజయవంతంగా గుర్తించగలిగారు. 2.3 కి.మీ. లోతులో ఉన్న రాళ్ల తీరుతెన్నులనూ దీంతో అంచనా వేయటం విశేషం. భూగర్భంలోని నిర్మాణాల తీరులను గుర్తించటం చాలా కష్టమైన పని. సీస్మిక్‌ సర్వే పద్ధతులు, బావులను తవ్వి సేకరించే సమాచారాన్ని బట్టి వీటిని అంచనా వేస్తుంటారు. ధ్వని తరంగాలను లోపలికి పంపించి సీస్మిక్‌ సర్వేను నిర్వహిస్తుంటారు. ఈ తరంగాలు రాళ్ల పొరలను ఢీకొని వైవిధ్యమైన లక్షణాలతో వెనక్కి మళ్లుతుంటాయి. వీటిని నమోదు చేసి, భూగర్భ రాళ్ల ఆకృతులను అంచనా వేస్తారు. ఇక చమురు కోసం బావులను తవ్వుతున్నప్పుడు భూమి వివిధ పొరల వివరాలు బయటపడుతుంటాయి. అస్సాంలోని డిగ్‌బాయ్‌ చమురు క్షేత్రంలోని భూగర్భంలో హైడ్రోజన్‌తో కూడిన రాళ్లలో పెట్రోలియం నిల్వలు ఉన్నాయి. ఇలాంటి రాళ్లను తేలికగా గుర్తించటానికి తాజా పద్ధతి ఉపయోగపడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని