సోషల్‌మీడియాలో ఏం చేయాలి.. ఏం చేయకూడదు?

Social Media day: ప్రస్తుత పోటీ ప్రపంచంలో సమాచార వ్యాప్తిలో సామాజిక మాధ్యమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఒక వ్యక్తి జీవితంలో కలిగే ఆనందం, బాధ వంటి భావోద్వేగాలను పంచుకోవడంతోపాటు సమాజంలో చోటుచేసుకునే తాజా సంఘటనలకు సంబంధించి తమ వ్యక్తిగత అభిప్రాయాలను సమాజం ముందుకు తీసుకొచ్చేందుకు సాయపడుతున్నాయి...

Updated : 30 Jun 2021 19:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుత పోటీ ప్రపంచంలో సమాచార వ్యాప్తిలో సామాజిక మాధ్యమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఒక వ్యక్తి జీవితంలో కలిగే ఆనందం, బాధ వంటి భావోద్వేగాలను పంచుకోవడంతో పాటు సమాజంలో చోటుచేసుకునే తాజా సంఘటనలకు సంబంధించి తమ వ్యక్తిగత అభిప్రాయాలను సమాజం ముందుకు తీసుకొచ్చేందుకు సాయపడుతున్నాయి. అయితే వీటి వినియోగంలో పాటించాల్సిన జాగ్రత్తల గురించి అవగాహనలేమితో కొందరు.. అత్యుత్సాహంతో మరికొందరు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల వినియోగంలో ఏయే అంశాల్లో జాగ్రత్తలు పాటించాలనేది తెలుసుకుందాం.

* చాలా మంది సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత విషయాలతో పాటు రోజువారీ జీవితంలో తాము ఎదుర్కొన్న సంఘటనల అనుభవాలను కూడా పంచుకుంటుంటారు. కొన్నిసార్లు తాము పోస్ట్ చేసిన సమాచారం వల్ల తమ ఉద్యోగాలతో పాటు.. ఉద్యోగావకాశాలను కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. అవి మీ ప్రొఫెషనల్ కెరీర్‌పై కూడా ప్రభావం చూపిస్తాయి. అందుకే ప్రభుత్వ విధానాలు లేదా ఏదైనా కంపెనీకి సంబంధించిన సమాచారాన్ని షేర్ చేసే ముందు అది నిజమా? కాదా? అనేది సరిచూసుకోవాలి. 

* ఉన్నత చదువుల కోసం లేదా మంచి ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలనుకున్నారు. వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే తిరస్కరించారు. కారణం.. గతంలో మీరు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన సమాచారం సదరు దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా ఉన్నాయని అధికారులు భావించి ఉండొచ్చు. మనకు తెలియకుండానే కొన్నిసార్లు ఇతర దేశాల విధివిధానాలకు వ్యతిరేకిస్తూ వచ్చే పోస్టులను షేర్ చేస్తాం. అవి భవిష్యత్తులో మీ విదేశీ ప్రయాణాలపై ప్రభావం చూపిస్తాయి.  

* ప్రభుత్వ నిర్ణయాలు, న్యాయపరమైన విధానాలను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో ఎన్నో రకాల పోస్టులు చూస్తుంటాం. కొన్నిసార్లు అనాలోచితంగా వాటిని షేర్ లేదా రీపోస్ట్ చేసేస్తాం. వాటి ఆధారంగా పోలీసులు మీపై కేసు నమోదు చేస్తారు. అలా మీరు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసిన వాటినే సాక్ష్యాలుగా సమర్పిస్తే కోర్టు మీకు శిక్ష విధించే అవకాశం కూడా ఉంది. 

* సామాజిక మాధ్యమాల్లో పరిచయంలేని వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్టులకు దూరంగా ఉండటమే మంచిది. చాలా సందర్భాల్లో సైబర్ నేరగాళ్లు నకిలీ ఐడీలతో మోసాలకు పాల్పడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అలానే మీ స్నేహితులు, బంధువుల పేరుతో సోషల్ మీడియాలో ఆర్థిక సాయం కోరితే.. ముందుగా వారికి ఫోన్‌ చేసి కనుక్కోవడం ఉత్తమం. ఒకవేళ అది నకిలీ అయితే మీకు ఎలాంటి నష్టం జరగదు.  

* ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య.. కామెంట్ల రూపంలో వచ్చే అసభ్య పదజాలం. ఉద్దేశపూర్వకంగానే కొంత మంది వ్యక్తులు తమకు నచ్చని వారు పోస్ట్‌ లేదా షేర్ చేసిన సమాచారం లేదా ఫొటోలు/ వీడియోలను టార్గెట్ చేస్తూ సోషల్‌ మీడియాలో వేధింపులకు పాల్పడుతుంటారు. ఈ తరహా చర్యలు సదరు వ్యక్తుల మానసిన ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపవచ్చు. మీరు చేసే కామెంట్ల వల్ల కొన్నిసార్లు న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఒకవేళ సోషల్ మీడియాలో మీకు నచ్చని సమాచారం లేదా పోస్ట్ కనిపిస్తే సదరు వ్యక్తులు, సంస్థ ఖాతాలను అనుసరించడం ఆపేయండి.

* సోషల్ మీడియా వల్ల లాభాలతో పాటు నష్టాలు ఉన్నాయి. అందుకని మీరు వాటికి దూరంగా ఉండాల్సిన అవసరంలేదు. సామాజిక మాధ్యమాల్లో మీరు ఏం చేస్తారు? ఎలాంటి సమాచారం కోసం వెతుకుతారు? అనేది విశ్లేషించుకోండి. ఒకవేళ మీకు వాటి వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా ఉందనుకుంటే సదరు సోషల్‌ మీడియా ఖాతాను తాత్కాలికంగా డిలీట్ చేయండి. తిరిగి కొద్దిరోజుల తర్వాత ఖాతాను పునరుద్ధరించుకోవచ్చు లేదా పూర్తిగా ఖాతాను మూసేయ్యొచ్చు. అలాకాకుండా.. సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉండాలనుకుంటే.. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఈ డిజిటల్ ప్రపంచంలో సమాచార సరఫరాతోపాటు.. వ్యక్తులను అనుసంధానించడంలో సామాజిక మాధ్యమాలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని