Telangana High Court: హైకోర్టుకు మరో ఆరుగురు న్యాయమూర్తులు

తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు కొలీజియం కొత్తగా ఆరుగురు న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలో సోమవారం సమావేశమైన కొలీజియం ఆరుగురు న్యాయవాదులను న్యాయమూర్తులుగా

Updated : 26 Jul 2022 06:58 IST

కేంద్రానికి సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం

ఇంకో అయిదు కోర్టులకు 29 మంది

గత 5 రోజుల్లో 9 హైకోర్టులకు 56 పేర్ల ప్రతిపాదన

ఈనాడు - దిల్లీ

తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు కొలీజియం కొత్తగా ఆరుగురు న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలో సోమవారం సమావేశమైన కొలీజియం ఆరుగురు న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమించాలని ప్రతిపాదిస్తూ కేంద్రానికి జాబితా పంపింది. ఇందులో ఏనుగుల వెంకట వేణుగోపాల్‌, నగేష్‌ భీమపాక, పుల్లా కార్తీక్‌, కాజ శరత్‌, జగ్గన్నగారి శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వర్‌రావు ఉన్నారు. 42 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన ఈ హైకోర్టులో ప్రస్తుతం 27 మంది పనిచేస్తున్నారు. 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొలీజియం సిఫార్సు చేసిన ఈ ఆరుగురి నియామకానికి కేంద్రం ఆమోదముద్ర వేస్తే ఖాళీల సంఖ్య 9కి తగ్గుతుంది. సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం తెలంగాణతో పాటు హిమాచల్‌ప్రదేశ్‌ (2), ఒడిశా (3), గువాహటి (2), కోల్‌కతా (9), పంజాబ్‌, హరియాణా (13) హైకోర్టులకు కలిపి మొత్తం 35 మంది పేర్లను కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈనెల 19వ తేదీన కర్ణాటక హైకోర్టు (5), అలహాబాద్‌ హైకోర్టు (9), 20న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు (7)కు చేసిన సిఫార్సులను కూడా కలిపితే గత అయిదురోజుల్లో 9 హైకోర్టులకు 56 పేర్లను సిఫార్సు చేసినట్లయింది.


కొలీజియం సిఫార్సు చేసిన వారి నేపథ్యం

ఏనుగుల వెంకట వేణుగోపాల్‌  

కరీంనగర్‌ మంకమ్మతోటలో 1967 ఆగస్టు 16న జన్మించారు. తండ్రి ఇ.వి.రాజేశ్వర్‌రావు (హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ మాజీ డిప్యూటీ డైరెక్టర్‌), తల్లి ఇ.వి.బాలకుమారి (ఉమ్మడి ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు). కరీంనగర్‌ ఆర్ట్స్‌ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో 1992లో న్యాయశాస్త్రంలో పట్టా పొంది అదే ఏడాది బార్‌ కౌన్సిల్‌లో నమోదయ్యారు. కొంత కాలం కరీంనగర్‌లో ప్రాక్టీస్‌ చేశారు. సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది దివంగత రామ్‌జెఠ్మలానీ వద్ద జూనియర్‌గా పనిచేశారు. రైల్వే స్టాండింగ్‌ కౌన్సిల్‌గా సేవలు అందించారు. 2021లో సీనియర్‌ న్యాయవాదిగా గుర్తింపు పొందారు.

నగేష్‌ భీమపాక

భద్రాచలంలో మాజీ ఎమ్మెల్యే, స్వాతంత్య్ర సమరయోధుడు భూపతిరావు, శాంతమ్మలకు 1969 మార్చి 8న జన్మించారు. అక్కడే ప్రాథమిక, ఉన్నత విద్యనభ్యసించి ఏలూరు సీఆర్‌ రెడ్డి న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. లాలో పోస్టుగ్రాడ్యుయేషన్‌ను హైదరాబాద్‌ నిజాం కాలేజీలో పూర్తి చేశారు. 1993లో బార్‌ కౌన్సిల్‌లో నమోదై హైకోర్టులో ప్రాక్టీస్‌ ప్రారంభించారు. సివిల్‌, క్రిమినల్‌, రాజ్యాంగ, కార్మిక, రెవెన్యూ, మున్సిపల్‌ చట్టాలతో పాటు ఆర్బిట్రేషన్‌ చట్టాలకు చెందిన కేసుల్లో వాదనలు వినిపించారు. ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా, జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా, పరిశ్రమల శాఖ ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. ప్రస్తుతం వైద్య, ఆరోగ్యశాఖ ప్రభుత్వ న్యాయవాదిగా కొనసాగుతున్నారు.

పుల్లా కార్తీక్‌

జగిత్యాలలో ఒగ్గు హనుమంతు, పోచమల్లమ్మలకు 1967 జూన్‌ 4న జన్మించారు. అక్కడి ప్రభుత్వ పాఠశాల,కళాశాలల్లో పాఠశాల విద్యతో పాటు ఇంటర్‌ చదివారు. డిగ్రీ, పీజీలను ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశారు. ఉస్మానియాలోనే లా, ఎల్‌ఎల్‌ఎంలు చదివారు. 1996లో బార్‌కౌన్సిల్‌లో నమోదయ్యాక హైకోర్టులో ప్రాక్టీస్‌ ప్రారంభించారు. 2015లో ఏపీ పరిపాలన ట్రైబ్యునల్‌లో ప్రభుత్వ న్యాయవాదిగా సేవలందించి, 2017 నుంచి హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా కొనసాగుతున్నారు.

కాజ శరత్‌

భద్రాచలంలో సీతారామయ్య, లలితాంబలకు 1971 జనవరి 29న జన్మించారు. పాఠశాల విద్యతో పాటు డిగ్రీని భద్రాచలంలోనే పూర్తి చేశారు. ఉస్మానియా ఆర్ట్స్‌ కాలేజీలో ఎంఏ, విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ఉస్మానియాలో ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. 1997లో బార్‌కౌన్సిల్‌లో నమోదయ్యాక కొత్తగూడెం, భద్రాచలం జిల్లా కోర్టుల్లో ప్రాక్టీస్‌ ప్రారంభించారు. అనంతరం 2002 నుంచి హైకోర్టులో అన్ని రకాల కేసుల్లోనూ వాదనలు వినిపిస్తున్నారు.

జగ్గన్నగారి శ్రీనివాసరావు

రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో 1969 ఆగస్టు 31న జన్మించారు. తండ్రి జె.మాణిక్యరావు. ఉస్మానియాలో బీఏ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి 1999లో బార్‌కౌన్సిల్‌లో నమోదై హైకోర్టులో ప్రాక్టీస్‌ ప్రారంభించారు. 2015 నుంచి సింగరేణి కాలరీస్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా కొనసాగుతున్నారు.

నామవరపు రాజేశ్వర్‌రావు

మహబూబాబాద్‌ జిల్లా సూదనపల్లిలో ఎన్‌.సత్యనారాయణరావు, గిరిజాకుమారిలకు 1969 జూన్‌ 30న జన్మించారు. పాఠశాల విద్య వరంగల్‌ సరస్వతి శిశుమందిర్‌, కాలేజీ విద్య గోవిందరావుపేటలో పూర్తిచేశారు. పెండేకంటి లా కాలేజీలో న్యాయశాస్త్రంలో పట్టాపొందారు. 2001లో హైకోర్టులో ప్రాక్టీస్‌ ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా, తెలంగాణలో యూజీసీ, ఎస్‌ఎఫ్‌ఐవో, ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ట్రైబ్యునల్‌ ప్యానెల్‌ న్యాయవాదిగా, 2019 నుంచి అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌గా సేవలందిస్తున్నారు. సివిల్‌, ఆర్థిక నేరాలు, కార్పొరేట్‌ లా, మోటారు ప్రమాదాలు, సర్వీసుకు చెందిన కేసుల్లో వాదనలు వినిపించారు.

-ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని