మళ్లీ అదే నిర్లక్ష్యమా?

‘‘ప్రశ్న పత్రాల లీకేజీతో ఒకసారి గ్రూప్‌-1 పరీక్షను రద్దు చేసి మరోసారి నిర్వహిస్తున్నపుడూ మళ్లీ అదే నిర్లక్ష్యమా? గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకోరా?

Updated : 27 Sep 2023 06:58 IST

తప్పులు సరిదిద్దుకోరా?
మీ నిబంధనలను మీరే ఉల్లంఘిస్తారా?
గత అక్టోబరులో రద్దయిన గ్రూప్‌-1 పరీక్షకు ఎంత మంది హాజరయ్యారు?
వివరాలు సమర్పించాలంటూ టీఎస్‌పీఎస్సీకి హైకోర్టు ఆదేశం
విచారణ నేటికి వాయిదా

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘ప్రశ్న పత్రాల లీకేజీతో ఒకసారి గ్రూప్‌-1 పరీక్షను రద్దు చేసి మరోసారి నిర్వహిస్తున్నపుడూ మళ్లీ అదే నిర్లక్ష్యమా? గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకోరా? బయోమెట్రిక్‌ విధానం అమలు చేస్తున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొని దాన్ని ఎందుకు అమలు చేయలేదు? మీ నోటిఫికేషన్‌లోని నిబంధనలను మీరే ఉల్లంఘిస్తారా? అలా ఎందుకు జరిగింది? లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. వారి ఆశలను నీరుగారుస్తారా’’ అని టీఎస్‌పీఎస్సీపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించింది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై కమిషన్‌ దాఖలు చేసిన అప్పీలుపై మంగళవారం జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. గత అక్టోబరులో ఎంత మంది ఈ పరీక్ష రాశారో, ఎన్ని కేంద్రాల్లో బయోమెట్రిక్‌ అమలు చేశారో... తాజాగా ఎందుకు అమలు చేయలేకపోయారో వివరాలు సమర్పించాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశిస్తూ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. గతంలో ఏయే పరీక్షల్లో బయోమెట్రిక్‌ అమలు చేశారో వివరాలు సమర్పించాలని పిటిషనర్లను ఆదేశించింది.

అభ్యర్థుల విశ్వాసం దెబ్బతీసిన కమిషన్‌

‘‘మొదట ప్రశ్నపత్రం లీకేజీ నుంచి ఎన్నో వివాదాలు వస్తూనే ఉన్నాయి. ఒకసారి సమస్య ఎదురయ్యాక రెండోసారి పరీక్ష నిర్వహించినపుడు మళ్లీ అవి జరగకుండా చూసుకోవాలి. మీరేం దాతృత్వ కార్యక్రమం నిర్వహించడంలేదు. అది మీ బాధ్యత. ఒకరి బదులు మరొకరు పరీక్ష రాస్తే ఏం చేస్తారు? ఇలాంటివి జరగకుండా రక్షణ కోసమే బయోమెట్రిక్‌. పరీక్ష పారదర్శకంగా నిర్వహించినట్లు అభ్యర్థులకు విశ్వాసం కల్పించాలి. కమిషన్‌ దాన్ని దెబ్బతీసింది. ఇది ప్రభుత్వ ప్రతిష్ఠకు చెందిన అంశం. కమిషన్‌ చర్యలను వెనకేసుకురావద్దు’’ అని అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ను ఉద్దేశించి న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అడ్వొకేట్‌ జనరల్‌ వాదనలు వినిపిస్తూ కేవలం ఊహలు, ఆరోపణలతో పిటిషన్‌ దాఖలు చేశారన్నారు. ఎలాంటి ఆధారాలు లేవన్నారు. కేవలం ముగ్గురు అభ్యర్థులు మాత్రమే పిటిషన్‌ దాఖలు చేశారన్నారు. యుపీఎస్సీ పరీక్షల్లో కూడా బయోమెట్రిక్‌ లేదనగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ‘మీరెందుకు అమలు చేయలేద’ని ప్రశ్నించింది.

నోటిఫికేషన్‌ను మార్చడానికి వీల్లేదు

‘‘బయోమెట్రిక్‌ విధానం గురించి నోటిఫికేషన్‌లోని సూచనల్లో ఉంది. నోటిఫికేషన్‌ను మార్చడానికి వీల్లేదు. దీనికి సంబంధించి పలు తీర్పులున్నాయి. పిటిషన్‌ వేసింది ముగ్గురన్న విషయాన్ని పక్కనబెట్టండి. మొత్తం 503 పోస్టుల భర్తీలో 100 మంది తప్పుడు మార్గాల్లో ప్రవేశించినా పరీక్షల నిర్వహణ లక్ష్యం దెబ్బతిన్నట్టే. విశ్వసనీయత అవసరం. అందులో భాగమే ఈ బయోమెట్రిక్‌ విధానం. సాంకేతిక కారణాలతో అమలుచేయలేకపోతే, అదే విషయాన్ని పత్రికా ప్రకటన ద్వారా ఎందుకు తెలియజేయరాదు’’ అని హైకోర్టు టీఎస్‌పీఎస్సీని ప్రశ్నించింది.

హాల్‌టికెట్‌.. నోటిఫికేషన్‌ కాదు

హాల్‌టికెట్‌లోని సూచనలను పరిశీలిస్తే బయోమెట్రిక్‌ లేదన్న విషయం తెలుస్తుందని ఏజీ చెప్పగా హాల్‌టికెట్‌ నోటిఫికేషన్‌ కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘కీలకమైన పోస్టుల భర్తీ ప్రక్రియ ఇది. ఇందులో ఎంపికైనవారు భవిష్యత్తులో కన్‌ఫర్డ్‌ ఐఏఎస్‌లై విధాన రూపకల్పనలో భాగస్వాములవుతారు. వీరిలో తప్పుడు మార్గాల్లో వచ్చిన వ్యక్తులుంటే పరిస్థితి ఏంటి? జూన్‌11న నిర్వహించిన పరీక్షకు సంబంధించి మీరు తొలుత సమర్పించిన వివరాల ప్రకారం హాజరైనవారి సంఖ్య 2,33,248 కాగా జూన్‌ 28నాటి వెబ్‌నోట్‌ ప్రకారం ఆ సంఖ్య 2,33,506. అదనంగా 258 మంది ఎక్కడి నుంచి వచ్చారు’ అని ప్రశ్నించింది. ఏజీ సమాధానమిస్తూ పరీక్ష నిర్వహణ రోజు ఫోన్‌ ద్వారా అందిన వివరాలు, తరువాత కచ్చితమైన వివరాలతో నివేదిక రూపొందించినట్లు తెలిపారు. ఒకరి బదులు మరొకరు పరీక్ష రాయకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. హాల్‌టికెట్‌లోని ఫొటోలతో ఆధార్‌, ఓటర్‌ గుర్తింపు కార్డుల ద్వారా ధ్రువీకరించినట్లు చెప్పారు. ఎక్కడా ఆరోపణలు లేవని, పటిష్ఠంగా నిర్వహించడానికి అన్ని చర్యలూ తీసుకున్నామన్నారు. అభ్యర్థుల తరఫున సీనియర్‌ న్యాయవాది ఎ.గిరిధర్‌రావు వాదనలు వినిపిస్తూ పోలీసు నియామక మండలి నిర్వహించిన కానిస్టేబుల్‌ పరీక్షలకు 6 లక్షల మంది హాజరయ్యారని, బయోమెట్రిక్‌ విధానం అమలు చేశారన్నారు. ఇక్కడ రెండు లక్షల మందికి ఏర్పాట్లు చేయలేరా అని ప్రశ్నించారు.


అనుబంధ నోటిఫికేషన్‌లో బయోమెట్రిక్‌ విధానం మినహాయిస్తే?

‘ఒకవేళ మేము పరీక్షను రద్దు చేసి, మళ్లీ నోటిఫికేషన్‌ జారీ చేయాలని ఆదేశించామనుకోండి... అప్పుడు కమిషన్‌ బయోమెట్రిక్‌ను మినహాయిస్తూ అనుబంధ నోటిఫికేషన్‌ జారీ చేసి పరీక్ష నిర్వహిస్తే పరిష్కారం ఏమిటి’ అని అభ్యర్థుల తరఫు సీనియర్‌ న్యాయవాది ఎ.గిరిధర్‌రావును హైకోర్టు ప్రశ్నించింది. అలా పరీక్షలు నిర్వహించే అధికారం కమిషన్‌కు ఉందని నోటిఫికేషన్‌లోనే స్పష్టంగా ఉందని తెలిపింది. ఒకవేళ తాము పరీక్షను రద్దు చేసినా కమిషన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందని, మళ్లీ నియామకాల్లో జాప్యం జరుగుతుందని వ్యాఖ్యానించింది. ఈ పరిస్థితులపై పిటిషనర్లయిన అభ్యర్థుల వివరణ తెలుసుకుని చెప్పాలంది. దీనిపై గిరిధర్‌రావు సమాధానమిస్తూ కమిషన్‌ ఇచ్చిన నోటిఫికేషన్‌ ప్రకారమే పరీక్ష నిర్వహించాలని కోరుతున్నామన్నారు. బయోమెట్రిక్‌కు రూ.1.30 కోట్లు ఖర్చవుతుందని అమలు చేయలేదని ఆయన అనగా ఏజీ దాంతో విభేదించారు. లాజిస్టిక్స్‌ కారణం వల్ల ఏర్పాటు చేయలేదన్నారు. వాదనలను విన్న ధర్మాసనం గతంలో బయోమెట్రిక్‌ ద్వారా నిర్వహించిన పరీక్షకు ఎంత మంది హాజరయ్యారు, ఎన్ని కేంద్రాల్లో బయోమెట్రిక్‌ అమలు చేయలేదు తదితర వివరాలను సమర్పించాలని కమిషన్‌ను ఆదేశిస్తూ విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు