JEE Advanced: అడ్వాన్స్‌డ్‌కు అర్హుల్లో తెలుగువాళ్లే అత్యధికులు

జేఈఈ మెయిన్‌లో కనీస మార్కులు సాధించి అడ్వాన్స్‌డ్‌కు అర్హత పొందిన వారిలో అత్యధికులు తెలుగు రాష్టాల విద్యార్థులే. ఏకంగా 18.38 శాతం మంది ఏపీ, తెలంగాణ విద్యార్థులు అర్హత సాధించారు.

Updated : 23 May 2024 06:08 IST

జేఈఈ మెయిన్‌ విజేతల్లో 18 శాతం మంది ఏపీ, తెలంగాణ విద్యార్థులే
26న దేశవ్యాప్తంగా అడ్వాన్స్‌డ్‌ పరీక్ష

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌లో కనీస మార్కులు సాధించి అడ్వాన్స్‌డ్‌కు అర్హత పొందిన వారిలో అత్యధికులు తెలుగు రాష్టాల విద్యార్థులే. ఏకంగా 18.38 శాతం మంది ఏపీ, తెలంగాణ విద్యార్థులు అర్హత సాధించారు. రాష్ట్రాల వారీగా చూస్తే అత్యధికంగా అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించిన విద్యార్థుల సంఖ్యలో తెలంగాణ మూడో, ఏపీ నాలుగో స్థానంలో నిలవడం విశేషం. జేఈఈ మెయిన్‌లో కటాఫ్‌ మార్కులు పొంది ఉత్తీర్ణులైన 2.50 లక్షల మందే అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాయడానికి అర్హత సాధించారు. వారిలో దాదాపు 2 లక్షల మంది ఈ నెల 26వ తేదీన జరిగే అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల నుంచి 45,965 మంది అర్హత సాధించగా.. 40 వేల మందికిపైగా అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారే ఐఐటీల్లో బీటెక్‌ సీట్లకు పోటీ పడేందుకు అవకాశం ఉంటుంది. ఏపీలో 26, తెలంగాణలో 13 నగరాలు/పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. గత ఏడాది 23 ఐఐటీల్లో 17,385 సీట్లకు ప్రవేశాలు జరిగాయి.

ఏఏటీకి ఏడు ఐఐటీల్లో పరీక్షా కేంద్రాలు

అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణులైన వారు బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌(బీఆర్క్‌)లో చేరేందుకు ఆసక్తి ఉంటే.. మరో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌(ఏఏటీ) పేరిట దీన్ని జూన్‌ 12వ తేదీన నిర్వహిస్తారు. ఆ పరీక్షను బాంబే, దిల్లీ, గువాహటి, కాన్పుర్, మద్రాస్, భువనేశ్వర్, రూర్కీ ఐఐటీల్లో జరుపుతారు. అదే నెల 14వ తేదీన ఫలితాలు విడుదల చేస్తారు. కేవలం వందల మంది మాత్రమే ఆ పరీక్ష రాస్తారు. వారణాసి, ఖరగ్‌పుర్, రూర్కీ ఐఐటీల్లో మాత్రమే బీఆర్క్‌ కోర్సు అందుబాటులో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని