Hamas: అలాగైతే బందీలు ప్రాణాలతో ఉండరు.. ఇజ్రాయెల్‌కు హమాస్‌ హెచ్చరిక

Israel-Hamas Conflict: బందీల విషయంలో హమాస్‌ చేసిన హెచ్చరికలను ఇజ్రాయెల్‌ ఏమాత్రం పట్టించుకోలేదు. సోమవారం కూడా గాజా నగరంపై దాడుల్ని తీవ్రతరం చేసింది. 

Updated : 11 Dec 2023 10:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గాజా(Gaza)లో హమాస్‌ మిలిటెంట్ల లక్ష్యంగా ఇజ్రాయెల్‌ తీవ్రంగా విరుచుకుపడుతోంది. ఉత్తర గాజాలో భూతల పోరాటం ఉద్ధృతమైంది. దక్షిణ గాజాలో బాంబుల మోత మోగుతోంది. ఖైదీల విడుదల కోసం తాము చేసిన డిమాండ్లు నెరవేరకపోతే ఇజ్రాయెల్‌కు చెందిన బందీలు సజీవంగా గాజా నుంచి బయటపడలేరని హమాస్‌ బెదిరింపులకు పాల్పడింది. ఈ హెచ్చరికల తర్వాత కూడా సోమవారం ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం కురిపించింది. (Israel-Hamas Conflict)

‘మా ఖైదీల విడుదల,  చర్చలు లేకుండా ఇజ్రాయెల్(Israel) బందీలు సజీవంగా తమ స్వదేశానికి వెళ్లలేరు’ అని ఆదివారం హమాస్ బెదిరించింది. గాజాలో హమాస్‌ చెరలో 137 మంది బందీలు ఉండగా.. 7 వేల మంది పాలస్తీనీయులు ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్నారు. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రదాడి అనంతరం గాజాపై ఇజ్రాయెల్‌ విరుచుకుపడుతోంది. హమాస్ మిలిటెంట్లు వెంటనే ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోవాలని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు(Benjamin Netanyahu) హెచ్చరించారు. హమాస్‌ ముగింపు దగ్గరపడిందని ఆయన అన్నారు.

అమెరికాలో సుడిగాలి బీభత్సం

ఓవైపు కాల్పుల విరమణను చేపట్టాలని అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తున్నా ఇజ్రాయెల్‌ విరమించడం లేదు. కాల్పుల విరమణ కోసం ఐరాస(UN)లో ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని అమెరికా(America) అడ్డుకోవడంతో ఇజ్రాయెల్‌ సైన్యం దాడుల్ని తీవ్రతరం చేసింది. ఈ పోరులో తీవ్రంగా ధ్వంసమైన అల్‌షిఫా ఆసుపత్రిలో ఇప్పటికీ 30 వేల మంది ఆశ్రయం పొందుతున్నారని మీడియా కథనాలు పేర్కొన్నాయి. ‘మా జీవితం నరకప్రాయంగా ఉంది. ఆహారం, నీరు, కరెంటు లేదు. అనారోగ్యంతో బాధపడుతోన్న చిన్నారులకు ఔషధాలు అందడం లేదు’ అని ఓ వ్యక్తి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

2.4 మిలియన్ల గాజా జనాభాలో 1.9 మిలియన్ల మంది తమ ఇళ్లను వదిలి పారిపోయారు. అందులో దాదాపు సగం మంది పిల్లలే ఉన్నారని ఐరాస అంచనా వేసింది. వారిని దక్షిణ గాజాకు వెళ్లిపొమ్మన్న ఇజ్రాయెల్‌.. ప్రస్తుతం అక్కడ కూడా దాడులు చేస్తుండటంతో శరణార్థుల రక్షణ ప్రమాదంలో పడింది. హమాస్‌ ఆరోగ్య శాఖ తెలిపిన లెక్కల ప్రకారం ఈ యుద్ధంలో ఇప్పటివరకు 17,900 మందికి పైగా పాలస్తీనియన్లు మృతిచెందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని