Loan Charges: ఏయే రుణాలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు వేస్తాయ్‌?

బ్యాంకులు రుణ దరఖాస్తుదారులకు రుణం ఇచ్చినందుకు దానిపై వడ్డీని వసూలుజేస్తాయి. వడ్డీతో పాటు అనేక ఇతర ఛార్జీలను కూడా వసూలు చేస్తాయి.

Published : 13 Jan 2024 17:14 IST

ఇంటర్నెట్ డెస్క్‌: బ్యాంకుల కార్యకలాపాల్లో రుణాలు చాలా కీలకమైనవి. గృహ, వాహన, విద్య, వ్యక్తిగత మొదలైన అనేక రుణాలను అందిస్తుంటాయి. ఈ రుణాలపై వడ్డీతో పాటు అనేక ఛార్జీలను వసూలు చేస్తాయి. ఈ ఛార్జీలు ప్రతి రుణానికి ప్రత్యేకంగా ఉంటాయి. ముఖ్యంగా హోమ్‌లోన్‌ అధిక మొత్తంతో కూడుకున్నది కాబట్టి, దీనికి బ్యాంకులు వసూలు చేసే ఛార్జీలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ప్రాసెసింగ్‌ ఫీజులు, అనేక ఇతర రుసుములు ఉంటాయి. ఇంటి రుణానికి దరఖాస్తు చేసే ముందు వీటిని తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఇంటి రుణంపై రుసుములు

ఇంటి రుణంపై బ్యాంకులు సగటున 7-9% వరకు వడ్డీని వసూలు చేస్తాయి. క్రెడిట్‌ స్కోరు మెరుగ్గా ఉన్నవారికి వడ్డీ తక్కువే ఉంటుంది. బ్యాంకు రుణంపై తక్కువ వడ్డీని చూసి చాలా మంది దరఖాస్తు చేస్తుంటారు. బ్యాంకులు రుణ మంజూరుకు ముందు, తర్వాత కూడా చాలా ఛార్జీలు వసూలు చేస్తాయి. ఇంటి రుణాన్ని మంజూరు చేయడానికి బ్యాంకులు దరఖాస్తుదారుడు సమర్పించిన పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తాయి. దీనికి ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తాయి. ఇది బ్యాంకును బట్టి మారుతుంది. బ్యాంకులు సాధారణంగా రుణమొత్తంపై 0.5-1% వరకు ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తాయి. ప్రాసెసింగ్‌ రుసుం చెల్లించడం వల్ల రుణ దరఖాస్తు కచ్చితంగా ఆమోదిస్తారని భావించకూడదు. బ్యాంకు ఇంటి రుణ దరఖాస్తును తిరస్కరిస్తే, రుణగ్రహీతకు ఈ ఫీజులో ఎలాంటి మొత్తం వాపసు రాదు. ఇంటి రుణాన్ని ఆమోదించిన తర్వాత బ్యాంకులు నిర్వహణ రుసుమును వసూలు చేస్తాయి. రుణం తీరే వరకు ఆస్తి (ఇంటి) దస్తావేజులను బ్యాంకు భద్రపరుస్తుంది. దీనికి కూడా ఛార్జ్‌ వసూలు చేస్తుంది. ఇంటి రుణం తీసుకున్న తర్వాత ఈఎంఐ కాలవ్యవధిని మార్చాలనుకుంటే, బ్యాంకుకు అదనపు ఛార్జీని సమర్పించుకోవల్సి వస్తుంది.

ఇంటి రుణాన్ని ఒక బ్యాంకు నుంచి ఇంకొక బ్యాంకుకు రుణ బదిలీ చేసుకోవచ్చు. దీనికి కూడా బ్యాంకులు ఛార్జీలు వసూలు చేస్తాయి. ఫిక్స్‌డ్‌ రేటుపై ఇంటి రుణాన్ని తీసుకున్నవారు రుణాన్ని ముందస్తుగా చెల్లించడానికి సిద్ధపడితే బ్యాంకు ముందస్తు చెల్లింపు పెనాల్టీని వసూలు చేస్తుంది. ఇది 2-6% వరకు ఉండొచ్చు. ఒకవేళ మీరు రూ.6 లక్షల బ్యాలెన్స్‌ చెల్లించి లోన్‌ ఖాతాను క్లోజ్‌ చేస్తే రూ.12,000-30,000 వరకు బ్యాంకుకు చెల్లించాల్సి రావచ్చు. ఆస్తి టైటిల్‌ డీడ్‌లు/ఓనర్‌షిప్‌ డాక్యుమెంట్స్‌ను రుణం కోసం తాకట్టుగా బ్యాంకుకు అందిస్తారు. మీ ఆస్తి చట్టపరమైన సమస్యలో చిక్కుకున్నట్లయితే ఈ పత్రం ఉపయోగపడుతుంది. దీనిపైనా ఛార్జీలు ఉంటాయి. ఈ ఛార్జీలు రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఈ ఛార్జీలు ఆస్తి ధరలో 0.1% నుంచి 0.2% వరకు ఉంటాయి. హౌసింగ్‌ లోన్‌తో పాటు ఇంటి/జీవిత బీమా పాలసీని కొనుగోలు చేయాలని కొన్ని బ్యాంకులు పట్టుబడుతుంటాయి. ఇది తప్పనిసరి కాదని గుర్తుంచుకోండి. ఇంటి రుణాన్ని ఆఫర్‌ చేస్తున్నప్పుడు బ్యాంకులు రుణగ్రహీతకు అనేక సేవలను అందిస్తాయి. ఇవి జీఎస్‌టీ పరిధిలోకి వస్తాయి. ప్రాసెసింగ్‌ ఫీజు, అడ్మినిస్ట్రేషన్‌ ఫీజు, టెక్నికల్‌, లీగల్‌ అసెస్‌మెంట్‌ ఫీజు మొదలైన వాటిపై జీఎస్‌టీని వసూలు చేస్తాయి.

విద్యా రుణంపై రుసుములు

భారత్‌లో విద్య కోసం రుణాలు తీసుకునేవారి సంఖ్య బాగా పెరిగింది. బ్యాంకులు కూడా ఈ రుణాలను విరివిగానే ఇస్తున్నాయి. విద్యా రుణ దరఖాస్తును ప్రాసెస్‌ చేయడానికి బ్యాంకు ప్రాసెసింగ్‌ రుసుమును వసూలు చేస్తుంది. ఇది లోన్‌ మొత్తంలో ఒక శాతం ఉండొచ్చు. కొన్ని బ్యాంకులు ప్రాసెసింగ్‌ రుసుముపై సర్వీస్ ఛార్జీని విధిస్తాయి. సకాలంలో ఈఎంఐ చెల్లింపులు చేయడంలో విఫలమైనప్పుడు ఆలస్య చెల్లింపులకు సంబంధించి బ్యాంకులు రుసుమును వసూలు చేస్తాయి. ఇది ఈఎంఐ మొత్తంలో 2-3% ఉండొచ్చు. దీనికి అదనంగా జీఎస్‌టీని కూడా చెల్లించాలి. విద్యా రుణాన్ని తీసుకున్నప్పుడు బీమా కూడా ప్రధానమైనది. రుణ చెల్లింపుల్లో ఇబ్బందులు వచ్చినప్పుడు.. రుణగ్రహీత చెల్లించలేని పరిస్థితిలో ఉన్నట్లయితే ఈ బీమా ఎంతగానో ఉపయోగపడుతుంది. కొన్ని బ్యాంకులు రుణంపై బీమా తీసుకోని వారికి అదనపు వడ్డీని విధిస్తాయి. ఇది ప్రభుత్వ బ్యాంకుల్లో 0.05%-0.25% వరకు ఉండగా, ప్రైవేట్‌ బ్యాంకుల్లో 2% వరకు ఉంటుంది.

రుణగ్రహీతలు ఆస్తిని తాకట్టు పెట్టి విద్యా రుణం తీసుకున్నప్పుడు బ్యాంకులు రుణ మొత్తంలో 0.25% నుంచి 0.5% వరకు మార్ట్‌గేజ్‌ క్రియేషన్‌ ఛార్జీలను వసూలు చేస్తాయి. అయితే కొన్ని రాష్ట్రాలు ఈ తనఖా ఛార్జీలను మాఫీ చేశాయి. ఒకవేళ రుణగ్రహీత తాకట్టు పెట్టిన ఆస్తి (ఇల్లు) పాతదైతే అది కుప్పకూలిన, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఇబ్బంది కాకుండా ఉండడానికి బ్యాంకులు ఆస్తిపై బీమా చేయాలని అడుగుతాయి. అంతేకాకుండా రుణగ్రహీతలు ఆరోగ్య బీమా లేదా ప్రయాణ బీమాలను తీసుకోవలసి ఉంటుంది. ఇటువంటి అన్ని ఛార్జీలు విద్యా రుణానికి చాలా వరకు తప్పవు.

వ్యక్తిగత రుణంపై ఛార్జీలు

అత్యవసర ఖర్చులను లేదా ఇతర అవసరాలను తీర్చుకోవడానికి వ్యక్తిగత రుణం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ రుణంపై వడ్డీ మాత్రమే కాకుండా ఇతర ఛార్జీలు కూడా ఉంటాయి.  వీటిని కూడా రుణగ్రహీత పరిగణనలోకి తీసుకోవాలి. రుణాన్ని ప్రాసెస్‌ చేసే సమయంలో అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించిన కొంత ఖర్చు ఉంటుంది. ఈ ఖర్చును రుణ దరఖాస్తుదారుడే భరించాలి. ఇది లోన్‌ మొత్తంపై 0.5% నుంచి 2.50% వరకు ఉండొచ్చు. పర్సనల్‌ లోన్‌ ప్రాసెసింగ్‌ ఛార్జీలు బ్యాంకును బట్టి మారుతూ ఉంటాయి. వ్యక్తిగత రుణంపై వెరిఫికేషన్‌ ఛార్జీలు కూడా ఉంటాయి. రుణ బకాయిలను కాలవ్యవధికి ముందే చెల్లించాలని భావిస్తే బ్యాంకు ముందస్తు చెల్లింపునకు జరిమానా విధించవచ్చు. ఈ పెనాల్టీ సాధారణంగా 2-4% వరకు ఉంటుంది. చెల్లింపుల, రుణం బాకీ ఉన్న డూప్లికేట్‌ స్టేట్‌మెంట్‌ను బ్యాంకును అడిగితే దీనికి కూడా బ్యాంకు ఛార్జీ వసూలు చేస్తుంది. ఇది రూ.200-500 వరకు ఉంటుంది. అంతేకాకుండా ఈఎంఐ ఆలస్యంగా చెల్లిస్తే బ్యాంకుకు జరిమానా చెల్లించవలసి ఉంటుంది. జరిమానా మొత్తానికి అదనంగా జీఎస్‌టీ చెల్లించాలి.

కారు రుణంపై రుసుములు

కారు రుణాన్ని ప్రాసెస్‌ చేయడం, మంజూరు చేయడం కోసం బ్యాంకు తన అడ్మినిస్ట్రేషన్‌ ఖర్చులను రుణగ్రహీత నుంచి వసూలు చేస్తుంది. ఇది లోన్‌ మొత్తంపై 0.50 నుంచి 1 శాతం మధ్య ఉంటుంది. ఇది గరిష్ఠంగా రూ.1,000 నుంచి రూ.9,000 మధ్య ఉండొచ్చు. కారు రుణ ఆమోదం తర్వాత రుణగ్రహీతలు ఈ రుసుమును భరించవలసి ఉంటుంది. కొన్ని ఫెస్టివల్‌ ఆఫర్లలో బ్యాంకులు ఈ రుసుమును మాఫీ చేయొచ్చు. కారు రుణాలపై ప్రీ-క్లోజర్‌ (ముందస్తు చెల్లింపులకు) అనుమతి ఉంది. కానీ, బ్యాంకులు రుణగ్రహీతల నుంచి పెనాల్టీని వసూలు చేస్తాయి. పెనాల్టీలు బకాయి ఉన్న లోన్‌ మొత్తం ఆధారంగా వసూలు చేస్తారు. రుణం తీసుకున్న మొదటి సంవత్సరం తర్వాత ప్రీ-క్లోజ్‌ చేస్తే, కొన్ని బ్యాంకులు రుణ మొత్తంలో 5% వరకు వసూలు చేస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు