Written off Loans: రైటాఫ్‌ రుణాల రికవరీ 15 శాతం లోపే!

Written off Loans: రైటాఫ్‌ చేస్తున్న రుణాల వసూలు ప్రస్తుతం చాలా తక్కువగా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీన్ని భారీగా పెంచాల్సిన అవసరం ఉందని ప్రభుత్వరంగ బ్యాంకులకు సూచించింది.

Published : 01 May 2023 19:56 IST

దిల్లీ: రైటాఫ్‌ (సాంకేతికంగా రద్దు) (Written off Loans) చేసిన రుణాలను వసూలు చేసే విషయంలో మరింత చురుగ్గా వ్యవహరించాలని కేంద్ర ఆర్థిక శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకులకు సూచించినట్లు సమాచారం. రికవరీ రేటును 40 శాతానికి పెంచాలని కోరినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి సోమవారం తెలిపారు. ప్రస్తుతం ఇది 14 శాతంగా ఉన్నట్లు వెల్లడించారు.

గత ఐదేళ్లలో ప్రభుత్వం రూ.7.34 లక్షల కోట్లు రైటాఫ్‌ (Written off Loans) చేసినట్లు ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. దాంట్లో 14 శాతానికి సమానమైన రూ.1.03 లక్షల కోట్లు వసూలైనట్లు పేర్కొన్నారు. ఈ వసూలు అనంతరం నికరంగా రైటాఫ్‌ రుణాల విలువ రూ.6.31 లక్షల కోట్లకు పరిమితమైందని పేర్కొన్నారు. అయితే, రైటాఫ్‌ (Written off Loans) చేసి బ్యాంకులు చేతులు దులుపుకుంటున్నాయని ఆర్థిక శాఖ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సదరు అధికారి తెలిపారు. ఇంత తక్కువ స్థాయి రికవరీ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పినట్లు పేర్కొన్నారు. అధిక రికవరీ వల్ల బ్యాంకుల మూలధనమే మెరుగవుతుందని సూచించినట్లు తెలిపారు.

ఈ అంశంపై సమీక్ష నిర్వహించేందుకు కేంద్ర ఆర్థిక సేవల విభాగం త్వరలో ప్రభుత్వ రంగ బ్యాంకుల సీనియర్‌ అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. వివిధ కోర్టులు, రుణ వసూళ్ల ట్రైబ్యునళ్ల దగ్గర పెండింగ్‌లో ఉన్న కేసులపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు పేర్కొన్నాయి.

నికర నిరర్థక ఆస్తులకు నాలుగేళ్లు పూర్తయ్యాక.. వాటికి పూర్తిగా కేటాయింపులు జరిపి ఆర్‌బీఐ మార్గదర్శకాలు, బ్యాంకుల బోర్డుల ఆమోదం మేర రైటాఫ్‌ (Written off Loans) పేరుతో ఆ రుణాలను బ్యాలెన్స్‌ షీట్‌ల నుంచి బ్యాంకులు తొలగిస్తాయి. బ్యాలెన్స్‌ షీట్లను ఎప్పటికప్పుడు పటిష్ఠం చేసుకునే ప్రక్రియలో భాగంగా రైటాఫ్‌ రుణాల ప్రభావాన్ని బ్యాంకులు మదింపు చేస్తుంటాయి. అయితే రైటాఫ్‌ (Written off Loans) చేసినంత మాత్రాన.. రుణ గ్రహీతలకు ఆ రుణ బకాయిలు చెల్లించకుండా మినహాయింపు ఇచ్చినట్లు కాదు. రైటాఫ్‌ చేసిన రుణ బకాయిలను రుణ గ్రహీతల నుంచి వసూలు చేసేందుకు వివిధ పద్ధతుల్లో బ్యాంకులు ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఇందుకోసం సివిల్‌ కోర్టులో కేసులు వేయడం, రుణాల వసూళ్ల ట్రైబ్యునళ్లను ఆశ్రయించడం, సెక్యూరిటైజేషన్‌ అండ్‌ రీకన్‌స్ట్రక్షన్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ అసెట్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫ్‌ సెక్యూరిటీ ఇంట్రస్ట్‌ యాక్ట్‌- 2002 కింద చర్యలు చేపట్టడం లాంటివి బ్యాంకులు చేస్తుంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని