Go Digit Insurance IPO: ఐపీఓకు గో డిజిట్‌ ఇన్సూరెన్స్‌.. విరుష్క జోడీ వాటాలు వదులుకుంటున్నారా?

డిజిట్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఐపీఓకు రానుంది. మే 15న సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభమై.. 17న ముగియనుంది.

Updated : 09 May 2024 14:06 IST

Go Digit Insurance IPO | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆన్‌లైన్‌ వేదికగా ఇన్సూరెన్స్‌ సేవలందించే స్టార్టప్‌ సంస్థ గో డిజిట్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ (Go Digit Insurance IPO) ఐపీఓకు రానుంది. మే 15న సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభమై.. 17న ముగియనుంది. యాంకర్‌ ఇన్వెస్టర్లు ఒక రోజు ముందుగానే బిడ్లు దాఖలు చేయొచ్చు. క్యూఐబీలకు 75 శాతం, హెచ్‌ఎన్‌ఐలకు 15 శాతం, రిటైల్‌ వినియోగదారులకు 10 శాతం షేర్లను విక్రయించనున్నారు. తొలుత 2022 ఆగస్టులో ఈ కంపెనీ ఐపీఓ కోసం సెబీకి దరఖాస్తు చేయగా.. పునః దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దాంతో 2023 ఏప్రిల్‌లో మరోసారి దరఖాస్తు చేసుకోగా.. ఈ ఏడాది మార్చిలో గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది.

ఐపీఓ ద్వారా రూ.1500 కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్రెష్‌ ఇష్యూ ద్వారా రూ.1125 కోట్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద మిగిలిన మొత్తానికి సమానమైన ఈక్విటీ షేర్లను ఐపీఓ ద్వారా విక్రయించనున్నారు. ప్రమోటర్లు, వాటాదారులు తమ వాటాలను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా విక్రయించనున్నారు. ఈ కంపెనీలో విరుష్క దంపతులకు పెట్టుబడులు ఉన్నాయి. అయితే, ఈ ఐపీఓలో వారు తమ వాటాలను విక్రయించడం లేదు. మార్కెట్‌ నుంచి సమీకరించిన నిధులను సంస్థ మూలధనాన్ని పెంచుకునేందుకు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలను తీర్చుకునేందుకు వినియోగించనున్నట్లు తన ప్రాస్పెక్టస్‌లో కంపెనీ తెలిపింది. ఈ ఐపీఓకు ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, మోర్గాన్‌ స్టాన్లీ ఇండియా, యాక్సిస్‌ క్యాపిటల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, నువామా వెల్త్‌ మేనేజ్‌మెంట్‌, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ బుక్‌ రన్నింగ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.

అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..

ఆన్‌లైన్‌ వేదికగా కారు, ట్రావెల్‌, మొబైల్‌, జువెలరీ తదితర ఇన్సూరెన్స్‌ సేవలు అందించే ఈ కంపెనీ 2016లో ప్రారంభమైంది.  గతంలో బజాజ్‌ అలియాంజ్‌ జనరల్ అండ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ సీఈఓగా వ్యవహరించిన కామేశ్‌ గోయల్‌ దీన్ని ప్రారంభించారు. కెనడాకు చెందిన బిలియనీర్‌, ఇన్వెస్టర్‌ అయిన ప్రేమ్‌ వత్సకు చెందిన ఫెయిర్‌ఫాక్స్‌ ఈ కంపెనీలో ప్రధాన వాటాదారుగా ఉంది. ఈ సంస్థకు గో డిజిట్‌లో 45.3 శాతం వాటా ఉంది. 2020లో విరాట్‌, అనుష్క ఈ కంపెనీలో వాటాదారులుగా మారారు. అంతేకాదు విరాట్‌ కోహ్లీ ఈ కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని