Apple: మొన్న శాంసంగ్‌.. ఇప్పుడు యాపిల్‌ యూజర్లకు కేంద్రం అలర్ట్‌..!

Apple: యాపిల్ యూజర్లు తమ ఫోన్లను అప్‌డేట్‌ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ సెర్ట్‌-ఇన్‌ హెచ్చరించింది. యాపిల్‌ ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపాలు ఉన్నట్లు తెలిపింది.

Published : 16 Dec 2023 11:20 IST

దిల్లీ: ఇటీవల శాంసంగ్‌ (Samsung) స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు కేంద్రం అలర్ట్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా యాపిల్‌ ఉత్పత్తుల (Apple Products)కు కూడా కేంద్రం ఇదే తరహాలో హై-రిస్క్‌ అలర్ట్‌ ఇచ్చింది. ఈ కంపెనీకి చెందిన పలు ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపం ఉన్నట్లు గుర్తించామని కేంద్ర ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ.. కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ ఆఫ్‌ ఇండియా (CERT-In) వెల్లడించింది. దీని వల్ల యూజర్ల వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగలించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. యూజర్లు వెంటనే తమ ఉత్పత్తులను లేటెస్ట్‌ సెక్యూరిటీ అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది.

ఐఫోన్‌, యాపిల్‌ వాచ్‌, మ్యాక్‌ బుక్‌, ఐపాడ్‌, యాపిల్‌ టీవీ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లతో పాటు సఫారీ బ్రౌజర్‌లో ఈ భద్రతా పరమైన లోపాలను గుర్తించినట్లు సెర్ట్‌-ఇన్‌ తన అడ్వైజరీలో వెల్లడించింది. ‘‘యాపిల్ ఉత్పత్తుల్లో పలు సెక్యూరిటీ లోపాలు బయటపడ్డాయి. దీని వల్ల హ్యాకర్లు యాపిల్‌ ఉత్పత్తుల్లోని భద్రతా పరిమితులను అధిగమించి యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించే ప్రమాదం ఉంది’’ అని తెలిపింది. ఈ లోపాలను హ్యాకర్లు గుర్తించి చొరబడితే వారు సెక్యూరిటీ పరిమితులను బైపాస్‌ చేయగలరని, ఏకపక్షంగా కోడ్‌ను ఎగ్జిక్యూట్‌ చేసి సున్నితమైన సమాచారాన్ని దొంగలించగరలని సెర్ట్-ఇన్‌ పేర్కొంది.

శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు కేంద్రం అలర్ట్‌..!

ఐఓఎస్‌, ఐప్యాడ్‌ ఓఎస్‌ 17.2 కంటే ముందు వెర్షన్లు, ఐఓఎస్‌, ఐప్యాడ్‌ ఓఎస్‌ 16.7.3 కంటే ముందు వెర్షన్లు, మ్యాక్‌ ఓఎస్‌ సొనోమా 14.2, వెంట్యురా 13.6.3, మానిటరీ 12.7.2, యాపిల్‌ టీవీ ఓఎస్‌ 17.2, యాపిల్‌ వాచ్‌ ఓఎస్‌ 10.2, సఫారీ 17.2 కంటే ముందు వెర్షన్లలో ఈ లోపాలను గుర్తించినట్లు సెర్ట్‌-ఇన్‌ వెల్లడించింది. కాగా.. యాపిల్‌ ఉత్పత్తులకు కేంద్రం గతంలోనూ పలుమార్లు ఇలాంటి అలర్ట్‌లు జారీ చేసింది.

ఇక, రెండు రోజుల క్రితం శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు కూడా కేంద్రం హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆండ్రాయిడ్‌ 11, 12, 13, 14 ఓఎస్‌తో పనిచేసే శాంసంగ్‌ ఫోన్లలో భద్రతాపరమైన లోపం ఉందని, దీనివల్ల వ్యక్తులకు తెలియకుండానే వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగిలించే ప్రమాదం ఉందని పేర్కొంది. కాబట్టి యూజర్లు ఫోన్‌ సెట్టింగ్స్‌లోని అబౌట్‌ డివైజ్‌లోకి వెళ్లి లేటెస్ట్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేసుకోవాలని యూజర్లకు సెర్ట్‌-ఇన్‌ సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని