Personal Finance: వివాహిత జంటలు ఆర్థిక వ్యవహారాలను ఎలా నిర్వహించాలి?

వివాహిత జంట ఎదుర్కొనే సవాళ్లలో వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలను నిర్వహించడం ఒకటి. ఈ వ్యవహారాలను కలిపి చేయాలా, విడిగా చేయాలా అనేది ఇక్కడ తెలుసుకుందాం.

Published : 03 Nov 2023 19:50 IST

ఇంటర్నెట్ డెస్క్‌: స్త్రీ, పురుషులిద్దరూ వారి ఆర్థిక వ్యవహారాలను వివాహానికి ముందు నిర్వహించడం వారి వ్యక్తిగతం. ఇలాంటి సందర్భంలో స్వాతంత్ర్యం కూడా ఎక్కువే ఉంటుంది. కానీ, పెళ్లి తర్వాత ఆర్థిక వ్యవహారాలను కలిపి నిర్వహించడం సమంజసమని, దీనివల్ల ఆర్థిక లక్ష్యాలను సులభంగా చేరుకోవడానికి అవకాశముంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే, ఉత్తమ భాగస్వాములకు కూడా మనీ మేనేజ్మెంట్ ఒక సవాలుగా ఉంటుంది. జంటలు వారి వ్యక్తిగత, భాగస్వామ్య లక్ష్యాలను తప్పనిసరిగా అంచనా వేసి మసులుకోవాలి. దీని గురించి తెలుసుకుందాం.

భార్యభర్తలు ఏం చేయాలి?

వివాహాం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్దానం మాత్రమే కాదు. బాధ్యతలు, అలవాట్లు, ప్రాధాన్యతలతో పాటు ముఖ్యంగా పెద్ద ఆర్థిక మార్పు కూడా. వివాహాం తర్వాత ఇద్దరి ఆర్థిక అలవాట్లు విస్తారమైన మార్పును చూస్తాయి. ఎందుకంటే వివాహాం తర్వాతే ఇంటి కొనుగోలు, భవిష్యత్‌ ప్రణాళికలు, పెట్టుబడులు వంటివి మదిలోకి వస్తాయి. ఇవన్నీ మీ జీవనశైలిలో పెనుమార్పులు తీసుకొస్తాయి. మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్‌ను ప్రారంభించడానికి వ్యవస్థీకృత ఆర్థిక ప్రణాళిక అవసరం. అందుచేత ప్రతి నూతన వధూవరులు ఆర్థిక నిర్వహణ గురించి విడిగా కాకుండా, కలిపే నిర్ణయాలు తీసుకోవాలి.

దంపతులలో ఎవరికైనా అధికంగా ఖర్చు చేసే అలవాటుంటే ఆ విషయాన్ని చర్చించండి. భాగస్వాములిద్దరూ నిర్ణీత నెలవారీ మొత్తాన్ని నిర్ణయించుకుని అద్దె/మెయింటెనెన్స్‌, కిరాణా సామగ్రి, యుటిలిటీలు, ముఖ్యంగా పిల్లల చదువు మొదలైన వాటికి చెల్లించడానికి ఉమ్మడి ఖాతాను నిర్వహించొచ్చు. తగిన జీవిత బీమా, ఆరోగ్య బీమా తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. దంపతులు ఉద్యోగస్తులైతే, తమ ఆదాయం ప్రకారం ఇంటి ఖర్చులను, భవిష్యత్‌ పొదుపులను విభజించుకోవచ్చు. మొత్తం ఇంటి ఖర్చులు, పిల్లల చదువులతో సహా లెక్కవేసి తమ ఆదాయంలో చెరో 50% ఖర్చు చేయొచ్చు. దంపతులలో ఒకరు ఎక్కువ సంపాదిస్తున్నట్లయితే..వారు ఖర్చులలో తమ వాటాను పెంచుకోవచ్చు. ఈ ఖర్చులను ట్రాక్‌ చేయడానికి వివిధ మొబైల్‌ అప్లికేషన్స్‌ కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించి తగిన విధంగా ప్లాన్‌ చేసుకోవచ్చు. 

బ్యాంకు ఖాతా

దంపతులకు  విడివిడి బ్యాంకు ఖాతాలు ఉన్నా కూడా ఇంటి ఖర్చుల నిమిత్తం డిపాజిట్‌/విత్‌డ్రా చేసుకోవడానికి ఒక జాయింట్‌ బ్యాంకు ఖాతాను ఏర్పాటు చేసుకోవడం మంచిది. బ్యాంకు డిపాజిట్లలో కొన్ని పన్ను రాయితీలు లభిస్తాయి. ఇద్దరిలో ఎవరూ తక్కువ పన్ను శ్లాబ్‌లో ఉంటే వారి పేరు మీద ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు వేసుకోవచ్చు. ఇలా ప్లాన్‌ చేసుకున్నట్లయితే పన్ను ఆదా అవుతుంది.

విలువైన ఆస్తులు

ఇల్లు వంటి ఆస్తులను సంపాదించడానికి ఐక్య ప్రయత్నం అవసరం పడుతుంది. ఉదాహరణకు, ఇల్లు కొనాలని చూస్తున్నప్పుడు తక్కువ ఆదాయం గల జంటలు లేదా తక్కువ క్రెడిట్‌ స్కోరు కలిగినవారు లోన్‌ కోసం ఉమ్మడిగా దరఖాస్తు చేసుకోవచ్చు. సంపన్న కుటుంబాల విషయంలో కూడా పెద్ద ఇంటికి అప్‌గ్రేడ్‌ అవ్వాలనుకుంటే ఇద్దరి భాగస్వామ్యంతో అధిక రుణాన్ని పొందొచ్చు. కారు, విద్యా రుణం వంటి వాటిని ఉమ్మడిగా తీసుకోవచ్చు. అత్యవసర నిధిని కూడా కలిపి సమకూర్చుకోవచ్చు.

జాయింట్‌ ఓనర్‌

ఫైనాన్షియల్‌ ప్లానర్లు కూడా కలిపి ఫైనాన్స్‌ను నిర్వహించడం వల్ల ఊహించని పరిస్థితుల్లో ఇబ్బంది లేకుండా వేగంగా బయటపడొచ్చని చెబుతున్నారు. ఉదాహరణకు భార్య కేవలం నామినీ మాత్రమే కాకుండా భర్త ఆస్తులకు జాయింట్‌ ఓనర్‌ అయితే, భర్త అకాల మరణం చెందినప్పుడు ఆమె ఆ ఆస్తులను ఆటోమేటిక్‌గా పొందుతుంది. ఒకవేళ భార్యను జాయింట్‌ ఓనర్‌గా చేయడంలో ఏవైనా ఇబ్బందులుంటే, ఆమెను లబ్ధిదారు(beneficiary)గా ఉద్దేశించి వీలునామాను రూపొందించవచ్చు. దీనివల్ల భర్త మరణించిన సందర్భంలో ఆస్తులు సజావుగా బదిలీ అవుతాయి.

ఇంటి కొనుగోలు

చాలా రాష్ట్రాల్లో మహిళలకు స్టాంప్‌ డ్యూటీ తక్కువగా ఉంటుంది. కాబట్టి, ఖర్చును ఆదా చేయడానికి భార్య పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయొచ్చు. అయితే, ఇలాంటి విషయంలో ఇల్లు భార్య ఆస్తిగానే ఉంటుంది. ఏవైనా అనుకోని సందర్భంలో విడాకులు లాంటివి జరిగితే భర్త దాన్ని క్లెయిం చేస్తే, అది చట్టపరమైన వివాదానికి దారి తీయొచ్చు. చట్ట ప్రకారం ఒక మహిళ భరణానికి అర్హులు, ఇందులో నివాస హక్కు ఉంటుంది. ఆమె తన భర్త ఆస్తులలో సగం కాకపోయినా ఆమెకు న్యాయస్థానాలు సహేతుకమైన నిర్వహణ మొత్తాన్ని మంజూరు చేస్తాయి. వివాదంలో ఇంటిని కోర్టులు విభజించాలని నిర్ణయించినట్లయితే భర్త సంపాదించినా కూడా భార్య పేరు మీద ఇల్లుంటే, ఆ ఇంటిని పాక్షికంగా అతడికి ఇవ్వవచ్చు.

ప్రొత్సాహకాలు

ఉద్యోగం చేసే జంటలు తమ సంపాదనపై స్వయంప్రతిపత్తిని కోరుతున్నా, కొన్ని ముఖ్యమైన విషయాలలో ఫైనాన్స్‌ను కలపడం వల్ల పన్ను ప్రొత్సాహకాలు లభిస్తాయి. ఇవి ఉమ్మడి లక్ష్యాలను మెరుగ్గా సాధించడంలో సహాయపడతాయని వివిధ ఆర్థిక నిపుణులు అంటున్నారు. వివాహిత జంట పొందగల ప్రయోజనంలో ఉమ్మడి ఇంటి రుణం ప్రధానమైంది. ఇంటి రుణం తీసుకున్న జంట ఆదాయ పన్ను నియమాల ప్రకారం విడివిడిగా రూ.2 లక్షల వరకు మినహాయింపును క్లెయిం చేయొచ్చు. అలాగే, సెక్షన్‌ 80సి కింద అసలు మొత్తంపై ఇద్దరూ రూ.1.50 లక్షల వరకు క్లెయిం చేయొచ్చు. 

చివరిగా: జంటలు ఉమ్మడిగా అన్ని లక్ష్యాల కోసం కలిసి పనిచేయడం ద్వారా విభేదాలను తగ్గించుకోవచ్చని, ఐక్యంగా పనిచేయకపోతే భవిష్యత్‌ ఆర్థిక లక్ష్యాలు ప్రభావితం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని