logo

Manappuram Finance: నిఘా పెట్టారు.. నేర్పుగా పట్టేశారు

కంకిపాడు మణప్పురం గోల్డ్‌ ఫైనాన్స్‌ కంపెనీలో గత సోమవారం రాత్రి 10.660 కిలోల బంగారం చోరీ చేసి తన సన్నిహితుడితో ఉడాయించిన బ్రాంచి మేనేజర్‌ రెడ్డివెంకట పావనిని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated : 22 Oct 2023 07:44 IST

నిందితురాలు పావని (పాత చిత్రం)

కంకిపాడు గ్రామీణం, న్యూస్‌టుడే: కంకిపాడు మణప్పురం గోల్డ్‌ ఫైనాన్స్‌ కంపెనీలో గత సోమవారం రాత్రి 10.660 కిలోల బంగారం చోరీ చేసి తన సన్నిహితుడితో ఉడాయించిన బ్రాంచి మేనేజర్‌ రెడ్డివెంకట పావనిని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెచోరీ చేసిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. గుడివాడ రూరల్‌ లింగవరం అడ్డరోడ్డుకు చెందిన రెడ్డివెంకట పావని గత ఫిబ్రవరిలో కంకిపాడు బ్రాంచికి బదిలీపై వచ్చింది. ఆమె భర్తతో మనస్పర్థల కారణంగా కంకిపాడులో వేరుగా ఉంటోంది. కృత్తివెన్నుకు చెందిన ఓ వ్యక్తితో సన్నిహితంగా మెలుగుతోంది. అతడు ఓ ప్రైవేటు పాఠశాలను నడుపుతున్నాడు. అతడికి అప్పులు ఉండటం, ఇద్దరూ విలాసవంతమైన జీవితం గడపాలన్న ఉద్దేశంతో బ్యాంకులో చోరీకి పథక రచన చేశారు. ఈ క్రమంలోనే ఈనెల 16వ తేదీన ఆమె ఈ చోరీకి పాల్పడింది. అదేరోజు రాత్రి ఇంటికి వెళ్లి ఇంట్లో తన బ్యాగు, సెల్‌ఫోను ఉంచి బంగారంతో పాటు తన సన్నిహితుడి కారులో వెళ్లింది. బంగారం అతడికి ఇచ్చి కొంత బంగారం తీసుకుని తన బంధువులు శిర్డి వెళుతుంటే వారితోపాటు అక్కడికి వెళ్లిపోయింది. బంధువుల ఫోన్‌ నుంచి తన కుటుంబ సభ్యులతో పావని మాట్లాడటంతో పోలీసులు అప్పటికే వారిపై నిఘా పెట్టడటం.. ఆమె ఎక్కడుందనే విషయాన్ని తెలుసుకుని వెంటనే బృందాలుగా ఏర్పడి శిర్డి బయలుదేరి వెళ్లారు. శిర్డిలో ఆమెను గుర్తించి పట్టుకుని శుక్రవారం రాత్రి కంకిపాడుకు తీసుకు వచ్చారు. ఈ విషయాలను పోలీసులు నిర్ధారించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని