logo

Hyderabad: ఆన్‌లైన్‌ పరీక్ష.. వాట్సప్‌లో డిగ్రీ పట్టా

మేఘాలయలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ(ఎంజీయూ) పేరుతో నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు తయారుచేసి విక్రయిస్తున్న ముఠాను సైబరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. ఆరుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. ప్రధాన సూత్రధారి యూనివర్సిటీ డైరెక్టర్‌ మిల్లీ గోయెల్‌, క్లర్కు శివాని పరారీలో ఉన్నారు.

Updated : 15 Nov 2022 11:23 IST

ఆరుగురి అరెస్టు.. పరారీలో మరో ఇద్దరు

నకిలీ ధ్రువపత్రాలను పరిశీలిస్తున్న సీపీ స్టీఫెన్‌ రవీంద్ర

ఈనాడు, హైదరాబాద్‌: మేఘాలయలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ(ఎంజీయూ) పేరుతో నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు తయారుచేసి విక్రయిస్తున్న ముఠాను సైబరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. ఆరుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. ప్రధాన సూత్రధారి యూనివర్సిటీ డైరెక్టర్‌ మిల్లీ గోయెల్‌, క్లర్కు శివాని పరారీలో ఉన్నారు. నిందితుల బ్యాంకు ఖాతాల్లోని రూ.34.45 లక్షలు, నగదు రూ.50 వేలు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నంకు చెందిన షేక్‌ ఖాజా మియాపూర్‌లో ఉంటున్నాడు. డిగ్రీ పట్టా కోసం టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా పనిచేస్తున్న ప్రేమ్‌కుమార్‌(29)ను సంప్రదించాడు. అతడి సలహాతో సికింద్రాబాద్‌కు చెందిన కన్సల్టెన్సీ నిర్వాహకుడు సత్యనారాయణ శర్మను కలిశాడు. బీఎస్సీ(ఐటీ) కోర్సుకు దూర విద్య విధానంలో పట్టా కావాలని అడిగాడు. మేఘాలయలోని ఎంజీయూ మాజీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌గా పనిచేసిన అఖిలేష్‌ సెమ్వాల్‌(41) సహకారంతో ఆన్‌లైన్‌ విధానంలో శర్మ పరీక్ష నిర్వహించాడు. అనంతరం శర్మ సూచనతో ప్రేమ్‌కు రూ.2.07 లక్షలు ఖాజా ఫోన్‌పే ద్వారా పంపాడు. కొన్ని రోజుల తర్వాత ఎంజీయూ పేరుతో 2016లో డిగ్రీ పూర్తి చేసినట్లుగా ప్రేమ్‌కుమార్‌ వాట్సాప్‌లో మెమోలు పంపాడు. ఇవి నకిలీవని తేలడంతో ఖాజా మియాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

వందల మందికి నకిలీ పత్రాలు

సత్యనారాయణ శర్మ పదేళ్లుగా కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. సుజాత(38) రిసెప్షనిస్టుగా పనిచేస్తోంది. దిల్లీకి చెందిన అఖిలేష్‌ సెమ్వాల్‌, ఎంజీయూ మాజీ మార్కెటింగ్‌ ఇన్‌ఛార్జ్‌ దినేశ్‌ సింగ్‌(33), మాజీ డిప్యూటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినర్‌ తేజీందర్‌ సింగ్‌(36)ను సంప్రదించి మోసానికి తెరలేపాడు. వీరు ఇప్పటివరకూ 430 మందికి నకిలీ ధ్రువపత్రాలు విక్రయించారు. నిందితుల కార్యకలాపాలపై మాదాపూర్‌ ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్‌ శివప్రసాద్‌ నేతృత్వంలో నిఘా ఉంచారు. మెట్టుగూడ వస్తున్నారని తెలుసుకుని దినేశ్‌ సింగ్‌, అఖిలేష్‌ సెమ్వాల్‌, తేజీందర్‌ సింగ్‌, ప్రేమ్‌కుమార్‌, సుజాత, శర్మను అరెస్టు చేశారు. నిందితుల నుంచి నకిలీ డిగ్రీ పట్టాలు కొన్న వారిపైనా కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని