logo

ఒక్క మిస్డ్‌ కాల్‌.. రెండు ప్రాణాలు బలి

ఒక్క మిస్డ్‌ కాల్‌.. రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. విద్యా బుద్ధులు నేర్పి సమాజాన్ని చక్కటి మార్గంలో నడిపించాల్సిన ఓ ఉపాధ్యాయురాలు తప్పుడు తోవలో పయనించడంతో ఆమెతోపాటు మరో యువకుడి ప్రాణాలు గాలిలో కలిశాయి.

Updated : 31 May 2023 05:09 IST

పెళ్లికాని యువతిగా ఉపాధ్యాయురాలు వాట్సప్‌ చాటింగ్‌
విషయం తెలిసి దూరం పెట్టడంతో వివాహిత ఆత్మహత్య
యువకుడి బలవన్మరణంలో కొత్త కోణాలు

హయత్‌నగర్‌ న్యూస్‌టుడే: ఒక్క మిస్డ్‌ కాల్‌.. రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. విద్యా బుద్ధులు నేర్పి సమాజాన్ని చక్కటి మార్గంలో నడిపించాల్సిన ఓ ఉపాధ్యాయురాలు తప్పుడు తోవలో పయనించడంతో ఆమెతోపాటు మరో యువకుడి ప్రాణాలు గాలిలో కలిశాయి. ములుగు జిల్లాలోని పంచోత్కులపల్లికి చెందిన ఎల్లావుల పరుశురాములు, విజయ దంపతుల రెండో సంతానమైన రాజేష్‌(25) మృతదేహం హయత్‌నగర్‌ సమీపంలోని కుంట్లూర్‌లో ఈనెల 29న లభించిన సంగతి తెలిసిందే. హయత్‌నగర్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు (45).. భర్త, ఇద్దరు పిల్లలతో నివాసముంటోంది. ఏడాదిన్నర క్రితం ఆమె నుంచి రాజేష్‌ సెల్‌కు మిస్డ్‌కాల్‌ వచ్చింది. దాంతో ఎవరు.. ఏమిటి? అంటూ పరస్పరం వాట్సప్‌ల ద్వారా పలకరించుకోవడంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ ఉపాధ్యాయురాలు తనకు వివాహం కాలేదని చెప్పడం.. యువకుడికి కూడా పెళ్లి కాకపోవడంతో ఇద్దరూ చాటింగ్‌లు చేసుకోవడం, చనువు ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరు కారులో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తిరిగారు. రాజేష్‌ను కలిసిన ప్రతిసారీ ఆమె అవివాహితగానే కనిపించేందుకు ప్రయత్నించింది. దీంతో రాజేష్‌ ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు తెలిసింది. ఆమెకు పెళ్లయిందని, ఉన్నత విద్య చదివే వయసున్న కుమార్తె, కుమారుడు ఉన్నట్లు రాజేష్‌కు కొద్దిరోజులకు తెలిసింది. దీంతో ఆమెను దూరం పెడుతూ వచ్చాడు. దీన్ని తట్టుకోలేకపోయిన ఆమె.. ‘నువ్వు లేకుండా నేను ఉండలేను.. చనిపోతా’ అంటూ రాజేష్‌కు వాట్సప్‌ చేసి ఈనెల 24న పురుగుమందు తాగడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతిచెందింది.

విషయం తెలిసిందిలా..: తల్లి మృతితో ఆమె సెల్‌ఫోన్‌ను కుమారుడు పరిశీలించగా వాట్సప్‌ చాట్‌ బయపడింది. ఆమె ఆత్మహత్యకు రాజేష్‌ కారణమని తెలుసుకుని అతన్ని గుర్తించేందుకు స్నేహితుల సాయం కోరాడు. ఫలానా ప్రాంతంలో తనను కలవాలని తల్లి చేస్తున్నట్లుగానే రాజేష్‌కు వాట్సప్‌ సందేశం పెట్టాడు. రాజేష్‌ హయత్‌నగర్‌ కుంట్లూర్‌ రోడ్డులోని ఓ టీస్టాల్‌ వద్దకు రాగానే ఇద్దరు స్నేహితులతో కలిసి బైకులపై వచ్చిన ఉపాధ్యాయురాలి కుమారుడు.. రాజేష్‌ను డాక్టర్స్‌ కాలనీలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ‘నీవల్లే మా అమ్మ చనిపోయిందంటూ దాడి చేసి హెచ్చరించి పంపారు. ఈ ఘటనతో ఆందోళనకు గురైన రాజేష్‌ పురుగు మందు తాగాడు. డాక్టర్స్‌ కాలనీలోని కంపౌండ్‌లోకి వెళ్లి కుప్పకూలి మృతిచెందాడు. రాజేష్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా కొన్ని విషయాలు బహిర్గతమైనట్లు తెలిసింది. శరీర లోపలి భాగాల్లో ఎక్కడా గాయాలైనట్లు, రక్తస్రావమైనట్లు ఆనవాళ్లు కనిపించలేదని సమాచారం. పురుగుమందు తాగిన ఆనవాళ్లు గుర్తించినట్లు ప్రాథమికంగా తెలిసింది. ప్రధాన అవయవాలతోపాటు పొట్టలోని స్రావాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపినట్లు తెలిసింది. పోస్టుమార్టం అనంతరం రాజేష్‌ మృతదేహాన్ని మంగళవారం మధ్యాహ్నం అతడి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని