logo

నియంత్రణలోనే క్షయ

ఉమ్మడి జిల్లాలో క్షయ (టీబీ) నియంత్రణలో ఉంది. ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య రెండు జిల్లాల్లో క్రమంగా తగ్గుతుండగా.. మూడు జిల్లాల్లో మాత్రం నిలకడగా ఉంది.

Published : 24 Mar 2023 05:41 IST

న్యూస్‌టుడే, పాలమూరు: ఉమ్మడి జిల్లాలో క్షయ (టీబీ) నియంత్రణలో ఉంది. ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య రెండు జిల్లాల్లో క్రమంగా తగ్గుతుండగా.. మూడు జిల్లాల్లో మాత్రం నిలకడగా ఉంది. మహబూబ్‌నగర్‌, వనపర్తి జిల్లాల్లో గుర్తించిన రోగుల సంఖ్య తక్కువగా ఉండగా, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం కంటే ఎక్కువ మందిని గుర్తించారు. గత మూడేళ్ల క్రితంతో పోలిస్తే క్షయ బారిన పడుతున్నవారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. సిబ్బంది గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటికి తిరిగి క్షయ అనుమానితులను గుర్తించి వారికి పరీక్షలు చేస్తున్నారు. ఈ ఏడాది జవనరిలో అనుమానితులకు ఎక్స్‌రే, తెమడ పరీక్షలు నిర్వహించగా.. చాలా తక్కువ మందికి మాత్రమే నిర్ధారణ అయిది. వివిధ జబ్బులతో పీహెచ్‌సీలకు వచ్చేవారిలో కూడా ఎవరికైనా లక్షణాలు కనిపించినా క్షయ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. శుక్రవారం ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..

ప్రత్యేక ఆసుపత్రులు..

ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్‌, కోయిలకొండ, బాదేపల్లి, భూత్పూర్‌, నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, కొల్లాపూర్‌, కల్వకుర్తి, వనపర్తి, ఆత్మకూరు కొత్తకోట, గద్వాల, అయిజ, అలంపూర్‌, నారాయణపేట, కోస్గి, మక్తల్‌ తదితర ప్రాంతాల్లో క్షయ రోగులకు ప్రత్యేక ఆసుపత్రులు ఉన్నాయి. ఒక్కోచోట ఇద్దరు వైద్య సిబ్బంది ఉండి సేవలు అందిస్తున్నారు. వారిలో సీనియర్లు చికిత్స అందించే పర్యవేక్షకులు, మరొకరు  ల్యాబ్‌ పర్యవేక్షకులు ఉంటున్నారు. వారు ప్రతిరోజు అనుమానితులకు క్షయ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం, వ్యాధి ఉన్నట్లు తేలినవారికి మందులు అందిస్తున్నారు. రోగులకు బలవర్ధక ఆహారం కోసం ప్రభుత్వం తరఫున నెలకు రూ.500 చొప్పున ఆరు నెలల పాటు వారికి ఆర్థిక సాయం కూడా అందిస్తారు. గతంలో సరైన చికిత్స లేక క్షయ బాధితులు కోలుకోలేక మృత్యువాత పడేవారు. ఇప్పుడు ఆధునిక చికిత్సా విధానం, మంచి మందులు అందుబాటులో ఉండటంతో క్షయ ప్రాణాంతకం కాదని వైద్యులు ధైర్యం చెబుతున్నారు. బాధితులు ఆరు నెలల నుంచి ఏడాది పాటు క్రమం తప్పక మందులు వాడితే వ్యాధి పూర్తిగా నయమవుతుందని అంటున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో మూడేళ్ల కిందట  2,130 మంది క్షయ బాధితులు ఉంటే.. ఇప్పుడు వారి సంఖ్య 1,870కి పడిపోయింది.

రోగులకు మందులు ఇస్తున్న జిల్లా టీబీ నిర్మూలన అధికారి డా.రఫిక్‌ తదితరులు

గాలి ద్వారా ఒకరినుంచి మరొకరికి..

క్షయ గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. రోగులు దగ్గినా, తుమ్మినా ఆ తుంపర్లలో బ్యాక్టీరియా గాలి ద్వారా ఇతరులకు వ్యాపించి టీబీ సోకుతుందని అంటున్నారు. ఇంట్లో ఎవరికైనా  వ్యాధి నిర్ధారణ అయితే.. వారిని వేరే గదిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. గతంలో ఆసుపత్రుల్లో పెట్టి ప్రత్యేకంగా చికిత్స చేసేవారు. కానీ ఇప్పుడు కుటుంబ సభ్యుల సంరక్షణలోనే వైద్య సేవలను అందిస్తున్నారు. ప్రతిరోజూ వారికి బలవర్ధకమైన ఆహారం, వేళకు మందులు అందిస్తే త్వరగా కొలుకొని సాధారణ స్థితికి చేరుకుంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యాధి ఉన్నవారు మద్యం, పొగతాగడం పూర్తిగా మానేయాలని చెబుతున్నారు.

ఈ లక్షణాలు ఉంటే..

* పది రోజులకు మించి జ్వరం వస్తుండటం, 15 రోజులైనా దగ్గు తగ్గకపోవడం, ఎక్కువగా చెమట పట్టడం, బరువు తగ్గుతుండటం తదితర లక్షణాలు ఉంటే క్షయ అనుమానితులుగా భావిస్తున్నారు. అలాంటి వారు సమీపంలోని టీబీ ఆసుపత్రికి వెళ్లి ఎక్స్‌రే తీయించుకోవడం, తెమడ, సిబినాయట్‌, ట్రూనాయట్‌ పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యాధి నిర్ధారణ అయితే వెంటనే మందులు వాడాలని అంటున్నారు.

మహబూబ్‌నగర్‌ : క్షయ నిర్ధారణ పరీక్షల కోసం సేకరించిన నమూనాలు


నిరంతర పర్యవేక్షణ...
- డా.రఫిక్‌, జిల్లా క్షయ నియంత్రణ అధికారి, మహబూబ్‌నగర్‌

క్షయను నియంత్రించడానికి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాం. గ్రామాలు, పట్టణాలు తదితర ప్రాంతాల్లో వైద్య సిబ్బంది ప్రతి రోజూ అనుమానితులను గుర్తించి వారి నుంచి  నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తున్నాం. రోగులకు ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు ఇంటికి వెళ్లి మందులు అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం క్షయ క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని