logo

హత్య కేసు నిందితుడికి జీవిత ఖైదు

మహిళలను హత్యచేసి బంగారం, వెండి ఆభరణాలు దొంగిలించే పాత నేరస్థుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. పటాన్‌చెరు ఠాణా పరిధిలో ఓ మహిళను హత్యచేసిన కేసులో ఈ శిక్ష పడింది.

Published : 17 Apr 2024 05:22 IST

విచారణలో పది హత్యలు చేసినట్లు వెల్లడి

పటాన్‌చెరు అర్బన్‌, న్యూస్‌టుడే: మహిళలను హత్యచేసి బంగారం, వెండి ఆభరణాలు దొంగిలించే పాత నేరస్థుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. పటాన్‌చెరు ఠాణా పరిధిలో ఓ మహిళను హత్యచేసిన కేసులో ఈ శిక్ష పడింది. పోలీసులు కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కంది మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన రాములు 2019 జూలై 11న చేవెళ్ల బస్టాండులో ఉన్న మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌ మండలం నాంచర్ల గ్రామానికి చెందిన అంజులమ్మ అనే మహిళను తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకున్నాడు. పటాన్‌చెరు మండలం లక్డారం గ్రామం లింగసానికుంట వద్దకు తీసుకొచ్చి ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. ఆమె వద్ద ఉన్న రూ.120, ఒక సెల్‌ఫోన్‌ దొంగలించుకుపోయాడు. దీనిపై కేసు నమోదు చేసిన పటాన్‌చెరు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో వివిధ ఠాణాల పరిధిలో 2003-2019 మధ్య కాలంలో పది హత్యలు, మూడు దొంగతనాలు చేసినట్లు అంగీకరించాడు. రాములు ప్రతీసారి మహిళను హత్య చేసి బంగారం, వెండి ఆభరణాలు తీసుకున్నాడు. ఆల్విన్‌ కాలనీ మహంకాళీ దేవాలయంలో అమ్మవారి మెడలో 10 గ్రాముల బంగారు గొలుసు కూడా ఎత్తుకెళ్లాడు. నిందితుడిని సంగారెడ్డి రెండో అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ సెషన్స్‌ కోర్టులో హాజరుపరచగా జీవిత ఖైదు, రూ.3వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి పీపీ కృష్ణార్జున్‌ తీర్పునిచ్చారు. రూ.3వేలు చెల్లించని పక్షంలో మరో మూడు నెలలు జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని