logo

పాకాల.. వైభవం రావాల!

చుట్టూ దట్టమైన అడవి..అందులో సహజంగా మొలిచిన ఎన్నో ఔషధ మొక్కలు, వృక్షాలు. మధ్యలో కొండలు.. అక్కడ పడే ప్రతి చినుకూ ఔషధ మొక్కలను తాకుతూ తమలోని మలినాలను కడిగేసుకుంటూ స్వచ్ఛత రూపం దాల్చి ప్రవాహంగా మారి అందమైన మంచి నీటి సరస్సులోకి చేరుతాయి.

Published : 01 Jun 2023 03:26 IST

న్యూస్‌టుడే, ఖానాపురం: చుట్టూ దట్టమైన అడవి..అందులో సహజంగా మొలిచిన ఎన్నో ఔషధ మొక్కలు, వృక్షాలు. మధ్యలో కొండలు.. అక్కడ పడే ప్రతి చినుకూ ఔషధ మొక్కలను తాకుతూ తమలోని మలినాలను కడిగేసుకుంటూ స్వచ్ఛత రూపం దాల్చి ప్రవాహంగా మారి అందమైన మంచి నీటి సరస్సులోకి చేరుతాయి. అటువంటి అద్భుత సుందర ప్రదేశం మన మధ్యనే ఉంది.. అదే పాకాల సరస్సు.  పక్షుల కిలకిలా రావాలతో, కాలుష్యరహిత చల్లని గాలి వీస్తూ మన మనసులను దోచుకునే ఈ మంచినీటి సరస్సు  ఆసియాలోనే ఏడో అతి పెద్దది. దీని పూర్తి సామర్థ్యం 3.23 టీఎంసీలు.

గరిష్ఠంగా 30 అడుగుల వరకు నీరు నిల్వ ఉంటుంది. దీని కింద 28,512 ఎకరాల ఆయకట్టుతో ధాన్యాగారానికి ఆయువుపట్టుగా నిలిచింది. 1977 లో తప్ప ఇప్పటి వరకు ఎన్నడూ ఎండిపోని ఈ సరస్సులోకి రెండేళ్లుగా గోదావరి నీటిని ఎత్తిపోస్తున్నారు.  ప్రస్తుత ప్రభుత్వాల వైఖరి కారణంగా అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచి పర్యాటక ప్రాంతంగా కూడా అలరారలేక పోతోంది.  ప్రస్తుతం వీటి గేట్లకు రంధ్రాలు పడి నీరంతా వృథాగా పోతోంది. అటవీ సంరక్షణ చట్టం-1972 ఆధారంగా సరస్సు చుట్టూ ఉన్న ప్రాంతాన్ని అభయారణ్యంగా ప్రకటించారు. ఇక్కడ 152 రకాల పక్షులు, 256 ఔషధ మొక్కలున్నాయి. గిరకతాడు, నిమ్మగడ్డి, కృష్ణతులసి, పంచతులసి, లక్ష్మణ ఫలం, పంచపాండవుల తీగ, రాఖీపువ్వు, పొన్న, పొగడ, జిట్టెగి, కొరివి, తిప్పతీగ, ఏగిస, నోని, ఆకాశమల్లె వంటి  మొక్కలు వైద్యపరంగా ఖ్యాతి గడించాయి. అటవీ శాఖ ఏర్పాటుచేసిన సీతాకోకచిలుకల పార్కు, ఔషధ కేంద్రం, జీవ వైవిధ్య పార్కు ఉన్నా.. పర్యాటకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 2017లో ఏర్పాటుచేసిన హరిత రిసార్టు, బోటింగ్‌లు పర్యాటకానికి ఊపిరిలూదినా, కరోనా అనంతరం ఇవి మూతపడ్డాయి. సరస్సు పరిసరాలను అభివృద్ధిపరిచి, సకల వసతులు సమకూర్చి పూర్వవైభవం చేకూర్చాలని పర్యాటకులు కోరుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు