Amritpal Singh: వీడియో విడుదల చేసిన అమృత్‌పాల్ సింగ్

లొంగిపోతాడనే ఊహాగానాల మధ్య ఖలిస్థానీ(Khalistan) సానుభూతిపరుడు, వివాదాస్పద మత ప్రబోధకుడు అమృత్‌పాల్ సింగ్(Amritpal Singh) అనూహ్యంగా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశాడు.

Published : 29 Mar 2023 23:10 IST

చండీగఢ్‌: ఖలిస్థానీ(Khalistan) సానుభూతిపరుడు, వివాదాస్పద మత ప్రబోధకుడు అమృత్‌పాల్ సింగ్(Amritpal Singh) కోసం గాలింపును పంజాబ్‌ పోలీసులు మరింత ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం అమృత్‌సర్‌ లేదా భటిండాలో లొంగిపోతాడనే వార్తలు వెలువడ్డాయి. కానీ, అనూహ్యంగా అతడి వాయిస్‌తో ఉన్న  ఓ వీడియో సందేశం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండటం చర్చనీయాంశమైంది. ఇందులో అమృత్‌పాల్ పంజాబ్ పోలీసు (Punajb Police)లపై తీవ్ర విమర్శలు చేశాడు. యూకేకు చెందిన యూట్యూబ్‌ ఛానెల్‌లో ప్రసారమైన ఈ వీడియోను రెండు రోజులు క్రితం ఉత్తర్‌ప్రదేశ్‌లో రికార్డు చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 

ఈ వీడియోలో అమృత్‌పాల్ మాట్లాడుతూ.. ‘‘పంజాబ్‌ పోలీసులు నన్ను అరెస్టు చేయాలనుకుంటే.. మా ఇంటికి వచ్చి అరెస్టు చేసేవారు. అప్పుడు మేము బాధ్యతగా వ్యవహరించేవాళ్లం. కానీ, ప్రభుత్వం పెద్ద ఎత్తున బలగాలతో మాపై దాడి చేయాలనుకుంది. నేను దేనికి భయపడే వ్యక్తిని కాదు. వచ్చే నెలలో జరిగే బైసాఖి పండుగ సందర్భంగా సిక్కు సమాజం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు సర్‌బాత్ ఖల్సా కార్యక్రమంలో సిక్కు సంఘాలు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలి. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సిక్కు సంఘాలు పాల్గొనాలని కోరుతున్నా.  మా సహచరులపై ప్రభుత్వం జాతీయ భద్రతా చట్టాన్ని (NSA)ను ప్రయోగించింది. వారిలో కొంతమందిని అస్సాం జైలుకు పంపారు. ప్రభుత్వం సిక్కు సమాజాన్ని మోసం చేసింది. దానిపై చర్చించేందుకు బైసాఖిలో జరిగే కార్యక్రమంలో సిక్కులంతా పాల్గొనాలి’’ అని పేర్కొన్నాడు.

గత 12 రోజులుగా అమృత్‌పాల్‌ను అరెస్టు చేసేందుకు పంజాబ్‌ పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని రోజులుగా వాహనాలు, వేషాలు మారుస్తూ పోలీసులకు చిక్కుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. మరోవైపు  హోషియార్‌పూర్‌లో అమృత్‌పాల్ ఉన్నాడనే పక్కా సమాచారంతో పోలీసులు ప్రతి ఇంటిలో తనిఖీలు నిర్వహించారు. కానీ, పోలీసులకు చిక్కకుండా తృటిలో తప్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం వీడియో సందేశాన్ని విడుదల చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు