Voter Id-Aadhar Link: ఓటర్‌ ఐడీ - ఆధార్‌ అనుసంధాన బిల్లుకు లోక్‌సభ ఆమోదం

దేశంలోని ఎన్నికల ప్రక్రియలో కీలక సంస్కరణలు చేపట్టేలా తీసుకొచ్చిన ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లును కేంద్ర ప్రభుత్వం నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టింది

Updated : 20 Dec 2021 15:42 IST

దిల్లీ: దేశంలోని ఎన్నికల ప్రక్రియలో కీలక సంస్కరణలు చేపట్టేలా తీసుకొచ్చిన ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభించింది. బోగస్‌ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా ఓటరు ఐడీని ఆధార్‌ కార్డుతో అనుసంధానించేలా రూపొందించిన ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజుజు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లును కాంగ్రెస్‌ సహా ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందని ఆరోపించాయి. అంతేగాక, సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తోందని దుయ్యబట్టాయి. విపక్షాల ఆందోళనతో సభ వాయిదా పడింది.

అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభవ్వగానే ఈ బిల్లుపై చర్చకు స్పీకర్‌ అనుమతించారు. అయితే విపక్ష ఎంపీలు మరోసారి ఆందోళన చేపట్టడంతో మరో 45 నిమిషాల పాటు సభ వాయిదా పడింది. అనంతరం 2.45గంటలకు లోక్‌సభ మళ్లీ సమావేశమైంది. కేంద్ర మంత్రి కిరణ్‌ రిజుజు బిల్లుపై ప్రసంగించారు. ప్రతిపక్షాల ఆందోళనల నడుమే స్పీకర్‌ ఓటింగ్‌ చేపట్టగా.. బిల్లును లోక్‌సభ ఆమోదించింది. అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడింది.

ఏంటీ సవరణ బిల్లు..

ఓటర్ల జాబితాను బలోపేతం చేయడం, ఓటింగ్‌ ప్రక్రియను మరింత మెరుగుపరచడం, ఈసీకి మరిన్ని అధికారాలు కల్పించడంతో పాటు బోగస్‌ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా పలు ప్రతిపాదనలున్న ఈ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోద ముద్రవేసింది. పాన్-ఆధార్ లింక్ చేసినట్లు గానే, ఓటర్‌ ఐడీ లేదా ఎలక్టోరల్‌ కార్డుతో ఆధార్‌ నంబర్‌ను అనుసంధానం చేయనున్నారు. కాకపోతే వ్యక్తిగత గోప్యతకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దృష్టిలో ఉంచుకొని స్వచ్ఛందంగా ప్రజలే అనుసంధానించుకొనేలా ఈ ప్రక్రియను చేపట్టనున్నట్టు సమాచారం.

అలాగే, కొత్త ఓటర్లు నమోదుకు ఏడాదిలో నాలుగు సార్లు అవకాశం కల్పించే మరో ప్రతిపాదనకు కూడా కేంద్ర కేబినెట్‌ ఓకే చెప్పింది. ఏటా జనవరి 1 నాటికి 18 ఏళ్లు దాటితేనే ఓటరుగా నమోదుకు అనుమతించనున్నారు. ఇక, ఎన్నికలు నిర్వహించే ప్రాంగణాల ఎంపికపై కేంద్ర ఎన్నికల సంఘానికే పూర్తి అధికారాలు కట్టబెడుతూ మరో సవరణ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు