భావి తరాలపై భారం పడే దుబారాలొద్దు

‘రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. దుబారా చేయొద్దు. నిధులను న్యాయబద్ధంగా ఉపయోగించాలి. భవిష్యత్తు తరాలు తలకు మించిన భారాన్ని మోసే పరిస్థితి రాకుండా చూడాలి.

Updated : 28 May 2023 05:59 IST

ప్రజావసరాలే ప్రాతిపదిక కావాలి
నీతి ఆయోగ్‌ సమావేశంలో రాష్ట్రాలకు ప్రధాని మోదీ హితవు
వచ్చే 25 ఏళ్లకు విజన్‌ రూపొందించాలని సీఎంలకు పిలుపు
11 మంది ముఖ్యమంత్రుల గైర్హాజరు

ఈనాడు, దిల్లీ: ‘రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. దుబారా చేయొద్దు. నిధులను న్యాయబద్ధంగా ఉపయోగించాలి. భవిష్యత్తు తరాలు తలకు మించిన భారాన్ని మోసే పరిస్థితి రాకుండా చూడాలి. ఆర్థిక క్రమశిక్షణ పాటించని చాలా దేశాలు ఇప్పుడు ఆ పరిణామాలను అనుభవిస్తున్నాయి. అందువల్ల మనం ఏం చేసినా.. ఏ ప్రణాళిక రూపొందించినా భవిష్యత్తు తరాలపై భారం పడకూడదన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మనమంతా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి’ అని రాష్ట్రాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హితవు పలికారు. 2047 నాటికల్లా వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని చేరుకోవడానికి వీలుగా ప్రతి రాష్ట్రం వచ్చే 25 ఏళ్లకు విజన్‌ను రూపొందించుకోవాలని పిలుపునిచ్చారు. శనివారం దిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగిన నీతి ఆయోగ్‌ 8వ పాలక మండలి సమావేశంలో ఆయన ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లు, పాలనాధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సమావేశానికి 11 మంది ముఖ్యమంత్రులు గైర్హాజరయ్యారు. ఇంత పెద్ద సంఖ్యలో ముఖ్యమంత్రులు రాకపోవడం ఇదే ప్రథమం. ప్రధాని ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రారంభ, ముగింపోపన్యాసాలు చేశారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ‘ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత ఈ సమావేశంలో పాల్గొన్న అందరిపైనా ఉంది. అందుకోసం మనం ఉమ్మడి విజన్‌, వ్యూహంతో వెళ్లాలి. వికసిత్‌ భారత్‌ లక్ష్యం ఉన్నది వ్యక్తులకో, కొన్ని సమూహాలకో కాదు. ఇది 140 కోట్ల మంది భారతీయుల లక్ష్యం కాబట్టి దాని సాధనకు అందరూ కలిసికట్టుగా పని చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తున్న కార్యక్రమాలు విజయవంతంగా సాగుతున్నాయి. అందుకు ఉదాహరణ ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమమే.

దేశవ్యాప్తంగా వివిధ సూచికల్లో వెనుకబడిన 112 జిల్లాలను ఎంపిక చేసి వాటిని ముందుకు నడిపించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బాగా చేస్తున్నాయి. అలాగే అత్యంత వెనుకబడిన 500 బ్లాక్‌లను పైకి తీసుకురావడానికి చేపట్టిన ఆకాంక్షిత బ్లాక్‌ కార్యక్రమంపై రాష్ట్రాలు మంచి దృష్టి పెట్టి పని చేస్తున్నాయి. ఈ బ్లాక్‌లను వివిధ కొలమానాల్లో రాష్ట్ర సగటుకు తీసుకొస్తే ఆటోమేటిక్‌గా రాష్ట్రాలూ అభివృద్ధి చెందుతాయి. తద్వారా జాతీయ సగటు పెరుగుతుంది. ఇప్పటివరకూ 50వేల అమృత్‌ సరోవర్లను నిర్మించారు. మిగిలిన 50వేల సరోవర్ల పని పూర్తి చేయాలి. జిల్లాకు 75 కాకుండా ఒక్కో బ్లాక్‌లో 75 సరోవర్లను నిర్మించేందుకు ప్రయత్నించాలి. రాష్ట్రాలు అంతర్గత పోటీతత్వంతో పని చేయాలి. జిల్లాలు, బ్లాక్‌ల మధ్య పోటీ ఉండాలి. బాగా పని చేసే వాటిని ప్రోత్సహించాలి. కేవలం జాతీయ స్థాయిలో విజన్‌ ఉంటే సరిపోదు. రాష్ట్ర, జిల్లా స్థాయి విజన్‌ ఉండాలి. ఇందుకోసం ప్రతి రాష్ట్రంలో బలమైన టీమ్‌లను ఏర్పాటుచేసి నీతి ఆయోగ్‌తో కలిసి పని చేసేలా చూడాలి. ప్రతి రాష్ట్రం వచ్చే 25 ఏళ్లకు విజన్‌ను రూపొందించుకుని కేంద్రంతో కలిసి పని చేయాలి. దూకుడు ప్రదర్శించాలి. కార్మిక శక్తికి గౌరవమివ్వాలి. అప్పుడే అది నాణ్యమైన ఉత్పత్తినిస్తుంది. 2025కల్లా టీబీని నిర్మూలించాలి. రాష్ట్రాలు గతిశక్తి పోర్టల్‌ను ఉపయోగించుకోవాలి. ఏ లక్ష్యం  సాధించాలన్నా సుపరిపాలన ముఖ్యం. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ఒక నెల ముందుకు జరిపింది కాబట్టి కేంద్రం నుంచి ఏం వస్తాయన్నది రాష్ట్రాలకు ముందుగానే తెలుస్తుంది కాబట్టి బడ్జెట్లను సరిగా ఉపయోగించుకోవాలి. తొలి మూడు నెలల్లోనే పనులు మంజూరు చేసి మొదలు పెట్టాలి. లేదంటే వర్షాకాలం 3 నెలల సమయం వృథా అవుతుంది’ అని ప్రధాని పేర్కొన్నారు.

11 మంది ముఖ్యమంత్రుల గైర్హాజరు

ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన నీతి ఆయోగ్‌ 8వ పాలక మండలి సమావేశానికి 11మంది మంది ముఖ్యమంత్రులు గైర్హాజరయ్యారు. ఇందులో కేసీఆర్‌, కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌, నీతీశ్‌ కుమార్‌, మమతా బెనర్జీ, అశోక్‌ గహ్లోత్‌, ఎంకే స్టాలిన్‌, నవీన్‌ పట్నాయక్‌, పినరయి విజయన్‌, సిద్ధరామయ్య, బీరేన్‌ సింగ్‌ ఉన్నారు. ప్రతిపక్షాల నుంచి ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఝార్ఖండ్‌, ఆంధ్రప్రదేశ్‌ సీఎంలు హాజరయ్యారు. మిగిలిన వారంతా భాజపా, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులే ఉన్నారు. ఇది సాధారణమేనని, గతంలోనూ చాలా మంది ముఖ్యమంత్రులు రాని సందర్భాలున్నాయని నీతి ఆయోగ్‌ సీఈవో బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం తెలిపారు. వారు రాకపోయినా కేంద్రం రాష్ట్రాలతో కలిసి పని చేస్తుందని పేర్కొన్నారు. తాము స్టేట్‌ సపోర్ట్‌ మిషన్‌ ఏర్పాటు చేశామని, దీనిద్వారా అన్ని రాష్ట్రాల్లో నీతి ఆయోగ్‌ తరహా వ్యవస్థలను ఏర్పాటు చేయాలనుకుంటున్నామని తెలిపారు. ‘భారత్‌ ఇప్పుడు టేకాఫ్‌ దశలో ఉంది. జనాభాలో ప్రపంచంలో తొలి స్థానానికి చేరిన మన దేశం మరో రెండేళ్లలో 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థ స్థాయికి చేరుకోబోతోంది’ అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ప్రసంగం తర్వాత ఎజెండాలోని 8 అంశాలపై ముఖ్యమంత్రులంతా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని