Train journey: థర్డ్‌ ఏసీ టికెట్‌ తీసుకున్నా.. ఒళ్లు మండిపోయి..!

జనరల్‌ టికెట్‌ తీసుకున్నవారు ఏసీ బోగీల్లో కిక్కిరిసి పోవడంతో.. థర్డ్‌ ఏసీ టికెట్‌ బుక్‌ చేసుకున్న ఓ వ్యక్తి లోపలకి వెళ్లలేకపోయారు. దీంతో ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Published : 13 Nov 2023 15:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పండగ సమయాల్లో రైలు ప్రయాణం (Train Journey) ప్రహసనమే. రిజర్వేషన్‌ కన్ఫర్మ్‌ (Reservation Ticket) అయినప్పటికీ.. వెయిటింగ్‌ లిస్టులో ఉన్నవారో, జనరల్‌ టికెట్‌ తీసి రిజర్వేషన్‌ బోగీ ఎక్కినవారో ఎవరో ఒకరొచ్చి పక్కన కూర్చుంటారు. వాళ్లను వద్దని చెప్పేందుకు కొన్నిసార్లు మొహమాటం అడ్డొస్తుంది. స్లీపర్‌ క్లాస్‌ (Sleeper Class) రిజర్వేషన్‌ చేయించుకున్న వాళ్లందరికీ దాదాపు ఈ అనుభవం ఎదురయ్యే ఉంటుంది. ఏసీ బోగీల్లో ప్రయాణించేవారికి ఈ సమస్య అంతగా ఉండదు. కానీ, దీపావళి (Diwali) సందర్భంగా గుజరాత్‌లోని వడోదర నుంచి మధ్యప్రదేశ్‌లోని రత్లాం వెళ్తున్న అన్షుల్‌ శర్మ అనే ప్రయాణికుడికి వింత అనుభవం ఎదురైంది. థర్డ్‌ ఏసీ టికెట్‌ బుక్ చేసుకున్నా ఫలితం లేకపోయింది. అతడు ఎక్కాల్సిన థర్డ్‌ ఏసీ కంపార్ట్‌మెంట్‌ ప్రయాణికులతో పూర్తిగా నిండిపోయింది. కనీసం లోపలికి అడుగు పెట్టడానికి వీలులేకుండా ద్వారం వద్ద ప్రయాణికులు కిక్కిరిసిపోయారు.

తన టికెట్‌ కన్ఫర్మ్‌ అయ్యిందని, లోపలికి వెళ్లేందుకు సహకరించాలని అక్కడి ఆర్పీఎఫ్‌ సిబ్బందికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. వాళ్లందర్నీ పక్కకు నెట్టి దారివ్వడం తమ వల్ల కాదని చేతులెత్తేశారు. దీంతో ఒళ్లుమండిన అన్షుల్‌  ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా ఇండియన్‌ రైల్వేస్‌పై మండిపడ్డారు. ఇంత పనికిమాలిన నిర్వహణను ఎక్కడా చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ నన్ను దీపావళి పండగ చేసుకోనివ్వనందుకు ధన్యవాదాలు. థర్డ్‌ ఏసీలో కన్ఫర్మ్‌ టికెట్‌ బుక్‌ చేసుకున్న వ్యక్తిని ట్రైన్‌ ఎక్కనివ్వకుండా చేశారు. భద్రతాదళసిబ్బంది నుంచి ఎలాంటి సహకారం అందలేదు. నా ఒక్కడిదేకాదు.. చాలా మంది ప్రయాణికులది ఇదే పరిస్థితి’’ అంటూ ట్విటర్‌లో రాసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలను కూడా జత చేశారు.

దిల్లీవాసుల నిర్లక్ష్యం.. ‘వర్షం ఊరట’ను తుడిచిపెట్టిన టపాసుల మోత

రైలు బయలు దేరకముందే.. ఇక్కడి పరిస్థితిని వివరించేందుకు రైల్వే హెల్ప్‌లైన్‌కు  ఫోన్‌ చేసినా ఫలితం లేకపోయిందని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రయాణం చేసేందుకు సదుపాయం కల్పించకపోయినా... తన టికెట్‌ డబ్బులు రూ.1,174 వెనక్కి ఇవ్వాలని అన్షుల్‌ కోరారు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. కచ్చితమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టి.. రైల్వే సిబ్బందికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసి.. ఎఫ్‌ఐఆర్‌తో వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాలని, రూ.25,000 వరకు నష్టపరిహారం పొందొచ్చని సలహా ఇస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని