3 వేలమందిని ప్రశ్నించి ఆకలి సూచీ ఇస్తారంటూ మంత్రి వ్యాఖ్య.. భగ్గుమన్న విపక్షాలు

ఆకలిసూచీని ఉద్దేశించి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani) చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆకలిని అపహాస్యం చేయొద్దని మండిపడ్డాయి. 

Published : 21 Oct 2023 12:28 IST

దిల్లీ: 140 కోట్లమంది దేశ ప్రజల్లో 3000 మందిని పిలిచి, ఆకలేస్తుందా అని వారిని పశ్నించి ఆకలి సూచీని లెక్కిస్తారంటూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె మాటల్లో దయ లేదని, అజ్ఞానం కనిపిస్తోందని కాంగ్రెస్‌(Congress) దుయ్యబట్టింది.

ఈ ఏడాది విడుదలైన హంగర్‌ ఇండెక్స్‌ నివేదిక ప్రకారం భారత్‌ 111వ స్థానంలో ఉంది. ఆకలి సూచీలో పాకిస్థాన్‌(102) కంటే వెనకబడి ఉండటాన్ని ప్రశ్నిస్తూ.. స్మృతి(Smriti Irani) స్పందించారు. ‘భారతదేశ స్టోరీని ఇలాంటి సూచికలు అంచనావేయవు. ఉద్దేశపూర్వకంగా అలా జరగొచ్చు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌ లెక్కలను చాలామంది తోసిపుచ్చుతుంటారు. ఇండెక్స్‌ రూపకర్తలు.. భారత్‌లోని 140 కోట్ల మంది ప్రజల్లో  3000 మందిని పిలిచి, ఆకలి వేస్తుందా..? అని ప్రశ్నించి ఈ సూచీని రూపొందిస్తారు. ఆ ఇండెక్స్ ప్రకారం.. భారత్‌ కంటే పాకిస్థాన్‌ మెరుగ్గా ఉంది. అది సాధ్యమా..?’ అని మంత్రి వ్యాఖ్యలు చేశారు.

సైనికుల పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది..? వైరల్‌గా ఐఏఎఫ్‌ అధికారిణి పోస్టు

‘ఇంతకంటే సిగ్గుచేటు ఏమీ ఉండదు. మీ మాటల్లో మీ అజ్ఞానం కనిపిస్తోంది. కొంతమందిని పిలిచి, ఆకలిగా ఉందా అని అడిగి, ఈ సూచీని సిద్ధం చేస్తారని మీరు నిజంగా భావిస్తున్నారా..?’అని కాంగ్రెస్‌ నేత సుప్రియా ష్రినేట్ ట్వీట్ చేశారు. ‘మీరు భారత ప్రభుత్వంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. మీ నుంచి ఇలాంటి మాటలు వినడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. పిల్లల్లో వయసుకు తగ్గ ఎదుగుదల, పౌష్టికాహారలోపం వంటి నాలుగు సూచికల ఆధారంగా ఈ సూచీని రూపొందిస్తారు’ అని గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘ఆకలిని అపహాస్యం చేయొద్దు. మీరు ఎక్కడికి వెళ్లినా తగినంత ఆహారం అందుబాటులో ఉంటుంది’ అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మంత్రిగారు.. అహంకారానికి మరో రూపంగా ఉన్నారు’ అంటూ శివసేన(UBT)నేత ప్రియాంకా చతుర్వేది(Priyanka Chaturvedi) మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని