
Omicron: బూస్టర్ డోసుతో ఒమిక్రాన్కు చెక్
కొత్త వేరియంట్తో బ్రేక్ త్రూ కేసులు సహజమే: డా.టి.జాకబ్ జాన్
దిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్కు అంతగా భయపడాల్సిన అవసరం లేదని ప్రముఖ వైరాలజీ నిపుణుడు, భారత వైద్య పరిశోధన మండలి మాజీ డైరెక్టర్ డా.టి.జాకబ్ జాన్ పేర్కొన్నారు. బూస్టర్ డోసుతో కొత్త వేరియంట్ను అడ్డుకోవచ్చన్నారు. కొవిడ్ సాధారణ వ్యాధిగా మారడానికి ఇది దోహదపడుతుందన్నారు.
‘‘ఒమిక్రాన్ కారణంగా భారత్లో మూడో ఉద్ధృతి సంభవించే అవకాశం లేదు. కానీ, టీకా తీసుకున్నవారికి కూడా కొవిడ్ (బ్రేక్ త్రూ కేసులు) రావచ్చు. కొత్త వేరియంట్ తలెత్తినప్పుడు సహజంగానే ఇలా జరుగుతుంది. ఒకటి, రెండు ఉద్ధృతులతో భారతీయుల్లో చాలామందికి రోగనిరోధక శక్తి వచ్చింది. ఆల్ఫా, బీటా, గామా, డెల్టాలతో పోలిస్తే ఒమిక్రాన్లో ఉత్పరివర్తనాలు ఎక్కువే. కొత్త వేరియంట్లో 34 మ్యూటేషన్లు కనిపించాయి. దీనివల్ల భారీ ముప్పు ఉండకపోవచ్చు. టీకా కార్యక్రమాన్ని ఉద్ధృతంగా చేపట్టి హెర్డ్ ఇమ్యూనిటీని పెంపొందించాలి. రెండు డోసులు తీసుకున్నవారికి బూస్టర్ డోసులు అందించాలి. చిన్నారులకూ తొలి డోసు ఇవ్వడం ప్రారంభించాలి. మొదటిసారి గర్భం దాల్చిన మహిళలకు వ్యాక్సిన్ రెండు డోసులు ఇవ్వాలి. రెండోసారి గర్భం దాల్చిన వారికి బూస్టర్ డోసు అందించాలి’’ అని ఆయన పేర్కొన్నారు.
అమెరికాలో తొలి ఒమిక్రాన్ కేసు
వాషింగ్టన్: అమెరికాలో బుధవారం ఒమిక్రాన్ తొలి కేసు నమోదైంది. కాలిఫోర్నియాకు చెందిన ఓ వ్యక్తిలో దీనిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.