Detective2: ‘డిటెక్టివ్‌2’.. 25ఏళ్లకు నా కల నిజమైంది: విశాల్‌

Vishal: విశాల్‌ స్వీయ దర్శకత్వంలో ‘డిటెక్టివ్‌2’ రూపొందుతున్న నేపథ్యంలో ఎక్స్‌ వేదికగా ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Published : 17 Mar 2024 00:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తమిళంతో పాటు, తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు విశాల్‌ (Vishal). ఆయన నటించిన ప్రతి సినిమా ఇక్కడ కూడా విడుదలవుతుంది. మిస్కిన్ దర్శకత్వంలో ఆయన నటించిన ‘డిటెక్టివ్‌’ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. దానికి కొనసాగింపుగా విశాల్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘డిటెక్టివ్‌2’. అంతేకాదు, ఈ సినిమాతో ఆయన దర్శకుడిగానూ మారారు. ఈ సందర్భంగా ఎక్స్‌ వేదికగా సంతోషాన్ని వ్యక్తి చేస్తూ ఓ పోస్ట్‌ పెట్టారు.

‘‘25ఏళ్ల తర్వాత ఎట్టకేలకు నా ప్రయాణం మొదలైంది. నా కల, నా ఆకాంక్ష, నా మొదటి ఆలోచన ఎట్టకేలకు నా జీవితంలో నిజం కాబోతోంది. అవును, ఇప్పుడు నేను కొత్త బాధ్యతలు తీసుకోబోతున్నా. దర్శకుడిగా పరిచయమవడం అన్నది ఇది నా కెరీర్‌లో అత్యంత సవాల్‌తో కూడుకున్నది. ‘తుప్పరివాలన్‌2/డిటెక్టివ్‌2’ కోసం లండన్‌ బయలుదేరాం. అజర్‌బైజాన్‌, మాల్లాల్లో షూటింగ్‌ చేయబోతున్నాం. దీన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదు. ‘పడిన కష్టం ఎప్పుడూ వృథా కాదు’ అంటూ నా తండ్రి జీకే రెడ్డి, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ సర్‌ చెప్పిన మాటలు ఎప్పుడూ మర్చిపోను. ఏది ఏమైనా, ఫలితం ఎలా వచ్చిన కలలు కనడం, వాటిని నిజం చేసుకోవడానికి ప్రయత్నించడం మానొద్దు. నటుడిగా నాకు గుర్తింపునిచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇలా దర్శకుడిగానూ నన్ను ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నా. నా కల ఇంత త్వరగా సాకారం కావడానికి కారణమైన మిస్కిన్‌ సర్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. రియల్‌ లైఫ్‌లోనైనా, రీల్‌ లైఫ్‌లోనైనా వేరొకరి బిడ్డను నేను అనాథగా వదిలేయను. లక్ష్యాన్ని చేరుకుంటాం’’ అని విశాల్‌ ట్వీట్ చేశారు.

‘డిటెక్టివ్‌2’ కూడా మిస్కిన్‌ దర్శకత్వంలోనే రూపొందాల్సి ఉంది. అయితే, అనివార్య కారణాల వల్ల ఆయన ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకొన్నారు. దీంతో ఈ మూవీకి తానే దర్శకత్వం వహిస్తానని విశాల్‌ ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని